Friday, November 25

మణిద్వీప వర్ణన (2)

వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది. ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.

చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.

శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.

శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.

విశాఖపట్టణంలోని, లలితాపీఠంలో మణిద్వీప నిర్మాణం చేసి, అమ్మవారికి పూజలు అందిస్తున్నారు. నేను ఈ పీఠాన్ని దర్శించుకున్నాను. మణిద్వీపంలో అమ్మవారి అలంకారములు, కుంకుమార్చన చాలా బాగ చేస్తారు.
{ విషయసేకరణ : శ్రీలలిత సహస్రనామం, శ్రీలలితా పీఠం, విశాఖపట్టణం వారి ప్రచురణ }

Thursday, November 24

మణిద్వీప వర్ణన (1)

మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆ ప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.

ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది.

సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు.

పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.

Friday, November 18

ధర్మశాస్త అయ్యప్ప

వర్ణనాతీతమైన దివ్యమైన ఙ్ఞానమంగళ విగ్రహం. హరిహరాత్మకమైన ఏక చైతన్యం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన మహా వాక్యాల ద్వార ప్రతిపాదింపబడుతున్న అద్వైత తత్వానికి సాకారం.
ధ్యానిస్తే చాలు సమస్త తత్వసారమూ సాక్షాత్కారమవుతుంది. అయ్యప్ప మహిమ జగద్విదితం. స్వామి లీలలు స్కాందాది (శివరహస్య ఖండాంతర్గత) పురాణగాధల్లో వర్ణించబడ్డాయి.
హరిహరాత్మకం
నారాయణుడు, శివుడు వేరు తత్వతః ఒక్కరే అని వేద, పురాణాలు సుస్పష్టంగా వక్కాణిస్తున్నయి.

యోహం సత్వం జగచ్చేదం
స దేవాసురమానుషం
అవిద్యా మోహితాత్మానః
పురుషా భిన్నదర్శినః

"శంకరా, నేను దేవాసుర మనుషాది సహితమైన ఈ జగత్తు నీ స్వరూపమే. అవిద్యామోహితులు భిన్నభిన్నంగా భావిస్తారు" అని విష్ణుపురాణంలో విష్ణువచనం,

అహం త్వం సర్వగోదేవ
త్వమేవాహం జనార్దన
ఆవయోరంతరం నాస్తి
శబ్దై రర్ధై ర్జగత్త్రైయే

"నేను సర్వగతుడవైన నీవే.
నీవే నేను. శబ్దాలచే గాని, అర్ధాలచే గాని మన ఉభయులకు భేదం లేదు" అని హరివంశంలో శంకరుడు విష్ణువుతో అన్నమాటలు. ఈ అభేద ప్రతిపత్తి అయ్యప్ప రూపంలో రూఢి అవుతోంది.
హరి, మోహిని రూపం ధరించగా, హరుడు మోహించాడని కథ. నారీవేషం ధరించిన విష్ణువు సాక్సాత్తు పరాశక్తి. "పుం రూపా విష్ణువిగ్రహా" అని లలితోపాఖ్యానం చెప్తోంది.

"లలితాదేవి ధరించిన పురుష రూపమే విష్ణువు" ఇద్దరిలో ఒకే లక్షణం ఉంది, అందుకే ఆమె వైష్ణవి. పద్మనాభ సహోదరి (విష్ణు సోదరి). ఏకలక్షణం చేత వారు సోదర స్థానీయులు.
ఉమాదేవి స్వయంగా విష్ణువు. ఇదే విషయాన్ని " శివానందలహరి"లో "బాణత్వ్"శంకరా, ఆ విష్ణువు నీకు భార్యగా అర్ధ భాగాన్ని స్వీకరించాడు" అని అన్నారు శంకర భగవత్పాదులు.
శివుడు అగ్ని తత్వం కాగా, నారాయణుడు జల తత్వం. ఈ విశ్వమంతా అగ్నిసోమాత్మకం(జలం). స్త్రీవాచకంగా చెప్పినప్పుడు సోమం-ఉమాదేవి. పురుష వాచకంగా - విష్ణువు.అగ్నిసోమంగా విశ్వవ్యాప్తమైన చైతన్యం పరమాత్మ. ఆ ఏకత్వ ప్రతిపాదకమైన పరమాత్మ శివ నారాయణాత్మక జ్యోతిస్వరూపంగా దర్శించారు. అదే అయ్యప్పమూర్తి.
అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫొటమవుతుంటాయి.

18 పరిపూర్ణతను సాదించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం.
అయ్యప్పకు మరో పేరు 'ధర్మశాస్తా. 'శాస్తా అంటే గురువు అని అర్ధం. ఆదిశంకరులు 'శాస్తారం ప్రణమామ్యహం' అంటూ ఆ
స్వామిని స్తుతించారు. " ఇది ధర్మం, ఇది యోగం" అని శాసించి ఆచరింపచేసేవాడు కనుకనే గురువును "శాస్త" అన్నారు.
స్వామి 'చిన్ము
ద్ర ధరించి ఉంటారు. అంటే "బొటనవేలు చూపుడు వేలు కలిపి" ఉంచే ముద్ర. మనం దక్షిణామూర్తి లో ఈ ముద్రను దర్శించవచ్చు. అయ్యప్ప కూడ చిన్ముద్ర ధారి.
మండలం పాటు దీక్ష గా ఉండి స్వామిని దర్శించాలన్నారు. దీక్షతో వెళ్ళిన వారికే "యాత్రా ఫలం" లభిస్తుంది.
40 రోజులనేది చాలా శాస్త్రీయమైన సంఖ్య. మన శరీరమానసిక చైతన్య వ్యవస్థగా రూపుదిద్దుకోడానికి 40రోజులు పడుతుంది. { ఆయుర్వేదంలో కూ
ఒక మందు మండలం రోజులు వాడితే కాని ఫలితం ఉండదు అంటారు } అందుకే మండలదీక్ష నిర్ణయించారు.
అయ్య, అప్ప - అనే దేశీయమైన పదాలు "ఆర్యా""పితా" అనే ఆర్ష శబ్దాల రూపాలే. గురువే ఆర్యుడు. ఆయనే పరమాత్మ. ఉపాసకుల కోసం ఒకే పరతత్వం వివిధ రూపాలుగా దర్శనమిస్తుంది. అలా ధరించిన యోగ ఙ్ఞానమయ మంగళమూర్తి - ధర్మశాస్త.
"స్వామియే శరణం అయ్యప్ప" అనే మాట పరమ మంత్రమై సాధకులకు సిద్ధిని ప్రసాదిస్తోంది.

" హరిహర సుతన్, ఆనంద చిత్తన్, అయ్యన్, అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్పా......"

{ఆధారం : షణ్ముఖశర్మగారి ప్రవచనం}

Monday, November 14

శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి

ఇంద్రుడు శచీదేవుల గారాబు పుత్రుడు జయంతుడు. మంచి అందగాడని ప్రసిద్ధి. ఒకప్పుడు శతజిహ్వుడనే రాక్షసుడు యాగములను పాడుచేస్తూ వుంటే జయంతుని వెళ్ళి ఆ రాక్షసునితో యుద్ధం చేయమని బ్రహ్మ అడుగుతాడు. కానీ శచీదేవి తన కుమారుడు రాక్షసులతో యుద్ధం చేయడానికి భయపడి, వద్దని వారించింది. బ్రహ్మకు కోపం వచ్చి నీవింత భయస్తురాలవైతివి కనుక భూలోకంలో వైశ్యుని ఇంట పుట్టమని శపించాడు. ఇంద్రుడు బ్రహ్మ కాళ్ళమీద పడి ప్రార్థించగా, ఆమె భూలోకంలో పుట్టినా ఎవ్వరినీ పెళ్ళాడకుండానే తిరిగి స్వర్గానికి వస్తుందని అభయమిచ్చాడు.

శచీదేవి భూలోకంలో పుట్టడానికి మరొక కారణం కూడా వుంది.

సోమకాంతుడనే యక్షుడు, అతని భార్య శచీదేవిని తమకు కుమార్తెగా పుట్టమని ప్రార్థించారు. ఆమె వారికి పుత్రికగా జన్మించింది. ఆమెకు వయస్సు వచ్చాక, చిత్రకంకుడనే యక్షుడు ప్రేమించి తనను పెళ్ళాడమని అడిగాడు. అందుకు ఈమె నిరాకరించడంతో కోపించి ఆమెను భూలోకంలో పుట్టమని శపించాడు.

భూలోకంలో కుసుమశ్రేష్ఠి అనే వైశ్యుడు భారత దేశంలో పెనుగొండ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అతని భార్య కుసుమాంబ. ఈ కుసుమశ్రేష్ఠి అప్పటి వేంగీదేశ ప్రభువైన చాళుక్య వంశస్థుడు విష్ణువర్ధనుని సామంతుడు. కుసుమశ్రేష్ఠి పాలనలో జనులు సుఖశాంతులతో జీవించేవారు. కానీ ఎంత సంతోషంగా వున్నా కుసుమశ్రేష్ఠికి పిల్లలులేకపోవడం తీరని లోటుగావుండేది. అందుకని పుత్రకామేష్టి యాగం చేసాడు. తత్ఫలితంగా అతనికి వైశాఖమాసంలో విరూపాక్షుడను కుమారుడు, శాపగ్రస్తురాలైన శచీదేవి వాసమాంబ అను కుమార్తెగా జన్మించారు. చిన్నతనంనుంచే విరూపాక్షునిలో గొప్ప నాయకుని లక్షణాలు కనిపించసాగాయి. వాసమాంబ సంగీత సాహిత్యాలపై ఉత్సాహం చూపేది. అంతేగాక ఎక్కువకాలం దైవచింతనలో గడిపేది. ఆమె పెరిగి పద్దదవుతున్నకొద్దీ ఆమెలో వైరాగ్య లక్షణాలు ఆమె తల్లి తండ్రులు గమనించసాగరు.

ఆ రోజుల్లో వారికి భాస్కరాచార్యులు కులగురువుగా వీరికి అన్నిట సలహాదారుడుగా వుండేవారు. ఆయన శిక్షణలో విరూపాక్షుడు వీరోచిత విద్యలన్నీ నేర్చుకున్నాడు. కానీ వాసమాంబ మాత్రం వేదాంతపరమైన విద్యలే నేర్చుకుంది.
ఇలా వుండగా వేంగీదేశ ప్రభువైన విష్ణువర్ధనుడు సామ్రాజ్య విస్తీరణకై దండయాత్రకు బయల్దేరి వెళ్ళుతూ, పెనుగొండకు వచ్చాడు. అతనికి కుసుమశ్రేష్ఠి, వైశ్యప్రముఖులు కూడా ఘనస్వాగతం ఇచ్చారు.

వారి సత్కారాలకు సంతోషించి రాజు పురప్రముఖులను పిలిచి ఒక్కొక్కరికే తాంబూల సత్కారం చేసాడు. అలా తాంబూలం ఇచ్చేసమయంలో వాసమాంబను చూసి, ఆమె సౌందర్యానికి అబ్బురపడ్డాడు. రాజధానికి తిరిగి వచ్చాక, ఆమెను వివాహమాడాలని నిశ్చయించి తన మంత్రిని పెనుగొండ కుసుమశ్రేష్ఠి దగ్గరకు తనకు వాసమాంబతో వివాహం చెయ్యమని రాయబారం పంపాడు. వాసమాంబ మనస్తత్వం తెలిసిన తండ్రి అందుకు నిరాకరించాడు. రాజుకు కోపం వచ్చి యుద్ధంలో వారిని జయించైనా తాను వాసమాంబను తీసుకు వచ్చి వివాహమాడుతానని తిరిగి వర్తమానం పంపాడు.

చేసేదిలేక కుసుమశ్రేష్ఠి అందుకు అంగీకరించి, రెండునెలలు గడువు పెట్టాడు తన తోటి వైశ్య ప్రముఖలను సమావేసపరచి, కర్తవ్యం చెప్పమని ప్రార్థించాడు. వారంతా కూడా వాసమాంబ వైరాగ్య పద్ధతి తెలిసినవారు కనుక, ఆమె అభిమతానికి విరుద్ధంగా ఈ వివాహం జరగడానికి వీలులేదని, కరాఖండీగా తీర్మానించారు.

యుద్ధమే జరిగితే, ఎందరో తనవల్ల ప్రాణాలు పోగొట్టుకుంటారని వాసమాంబ హోమగుండంలో దూకి ప్రాణత్యాగం చెయ్యడానికి నిశ్చయించుకొంది. ఆమె నిశ్చయాన్ని విన్న వైశ్యులందరూ వ్యాకులత చెంది ఆమెను వారించబోయారు. అప్పుడు వాసమాంబ తాను ఇంద్రుని పట్టమహిషి శచీదేవినని, శాపవశాన భూలోకంలో జన్మించానని, తాను కన్యగానే మరణించి స్వర్గానికి చేరాలని వారికి నచ్చ చెప్తుంది. అప్పుడు ఆవైశ్యులు తాము కూడా అమెతో బాటు అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేస్తామని పలికారు.

గోదావరి తీరాన గంధపు చెక్కలతో నూటమూడు అగ్నికుండాలు ఏర్పాటుచేసారు. ఈ ఆత్మత్యాగానికి వైశ్యులు భార్యలతో సహా సిద్ధమయ్యారు. వాసమాంబ మానవరూపంలో పుట్టిన దేవత అని వారివిశ్వాసం. వాసమాంబ మొదటగా హోమకుండంలో ప్రవేశించింది. వెంటనే అగ్ని చల్లబడిపోయి వాసమాంబతో "తల్లీ నీలో నేను కూడా భరించలేని వేడి వుంది. నిన్ను దహించేశక్తి నాకు లేదు" అని ప్రార్థించాడు.

వాసమాంబ అగ్నిదేవునితో తాను హోమగుండంద్వారా స్వర్గానికి చేరాలని అందుకు తనకు సాయపడమని అగ్నిని వేడుకొని అగ్ని ప్రవేశం చేసింది. వెంటనే ఆమెను అనుసరించి మిగిలిన వారు కూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసారు.
వాసమాంబ కన్యగా మరిణించుటచేత కన్యకాంబ, కన్యకా పరమేశ్వరి అని పిలువబడుతూ, అప్పటినుంచి వైశ్యకులస్థుల కులదేవతగా వారి సేవలు అందుకుంటూ వుంది.

మన ఆంధ్రరాష్ట్రంలో పశ్చిమగోదావరిజిల్లలో పెనుగొండలో ఈమెకు దేవాలయం వుంది. అదే ఈమె మొదటి దేవాలయంగాను, వైశ్యుల దక్షిణకాశీగాను ప్రశిద్ధిగాంచింది.

భారతదేశానికి చివరభాగాన, త్రిసాగర సంగమ తీరాన(బంగాళా ఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం కలిసిన చోట) కన్యకాపరమేశ్వరి దేవాలయం వుంది. ఈ దేవాలయం గర్భగుడిలో కన్యకా పరమేశ్వరి మూలవిరాట్టు ముక్కున వున్న వజ్రపు నత్తు అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ వుండడం నేటికీ కమనీయ దృశ్యమే.

{పెనుగొండ దేవాలయంలోని కన్యక వేరు, కన్యాకుమారి లోవున్న కన్యక వేరు.
బాణాసుర అనే రాక్షసుడు (ఉష తండ్రికాదు) పెట్టే ఇడుములు భరించలేక దేవతులు పరమేశ్వరిని ప్రార్ధించారు. ఆమె అందుకు అంగీకరించి, కన్యగా అవతరించిదిట. పరమేశ్వరును వివాహమాడాలనే తలంపుతొ తపస్సు ప్రారంభించిది. నారదుడు రాయబారం సలిపి, చివరకు ఒకానొక రోజు రాత్రిముహూర్తం నిర్ణయించి పరమేశ్వరుని తరలి రమ్మన్నాడుట. ఆయన పరివారంతో వస్తూవుండగా దారిలో కొందరు నృత్యకారులు ప్రదర్శనచేస్తూవుండడంతో ఆగిపోయాడుట. ఇంతలో తెల్లవారిపోయింది. నారదుడు పెట్టిన ముహూర్తం దాటిపోయిందని పరమశివుడు కైలాసానికి వెళ్ళిపోయాడుట. కన్యాకుమారి శివుని రాకకోసం చూసి చూసి ఎంతకూ రాకపోయేసరికి తను ఇక జీవితంలో పెళ్ళాడకూడదని నిశ్చయించుకుంది.
ఆనాడు పెళ్ళి విందుకోసం చేసిన పదార్ధాలన్నీ రంగు రాళ్ళగా మారిపోయాయిట. ఇప్పటకీ అక్కడ ఇసుకలో రంగురాళ్ళు కనపడతాయి. ఈమె వృత్తాంతం విన్న బాణాసురుడు చక్కావచ్చాడు. అతనితో యుద్ధం చేసి కన్యాకుమారి అతన్ని సంహరించిందిట. ఆ తరువాత అక్కడే శిలావిగ్రహెమై వెలిసిందిట
ఆమె ముక్కున వున్న నత్తులోని వజ్రపు కాంతి వల్ల ఓడలో వచ్చేవారికి కళ్ళు మిరుమిట్లు గొల్పి మార్గం కనపడక బండరాళ్ళనూ ఢీకొని ప్రమాదాలు సంభవించేవిట. అందుకనే తూర్పువైపు ద్వారం మూసి, అయిదేళ్లకొకసారి ఉత్సవాలప్పుడు కొంతసేపు తెరిచి వుంచుతారుట. }

Saturday, November 12

ద్వాదశజ్యోతిర్లింగాలు (3)

9. కాశీ విశ్వనాధుడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి (కాశీ) లో విశ్వేశ్వరలింగము ఉంది. కాశీ యాత్ర చేయనిదే స్వర్గద్వారాలు తెరుచుకోవని హిందువుల నమ్మకము. ఆలయ ప్రవేశము హిందువులకు మాత్రమే. కాశీలో 100 శివాలయాలు, 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి. గంగానది ఉత్తరవాహినియై ప్రవహించు చున్నది. ఈ పుణ్య స్టలములోనే అశోకుడు నిర్మించిన సారనాధ స్ధూపం ఉంది.
వరుణ, అసి నదుల మధ్య ప్రదేశం కనుక ఇది వారణాశైంది. పార్వతీదేవి అన్నపూర్ణమ్మగా, విశాలాక్షిగా నివాసమేర్పరచుకున్న చోటు. అయ్యవారు విశ్వనాథుడై వెలసి విశ్వాన్ని శాసిస్తూ తరింప చేస్తున్న చోటూ ఇదే. ఆధ్యాత్మిక ఔనత్యంగల కాశీ పరమత సహనానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఎందుకంటే విశ్వనాథ ఆలయానికి ప్రక్కనే దర్శనమిస్తుంది మసీదు. గుడిగోపురం, పై భాగాలను తొలగించి పవిత్రమైన ఆ పునాదులపై, కుడ్యాలమీదా ఔరంగజేబు మసీదు నిర్మాణం చేయించాడు. ప్రస్తుతం మనం చూస్తున్న విశ్వనాధాలయాన్ని 1780సం.లో హోల్కరుల వంశకీర్తి మహారాణి అహల్యాబాయి కట్టించింది.
పూర్వం లంకకు రాజు విశ్రవసుబ్రహ్మ పెద్ద కుమారుడు వైశ్రవుడు (కుబేరుడు). సవతి తల్లి కొడుకు అయిన రావణుడు వైశ్రవుడును వెడల గొట్టి, లంకను ఆక్రమించెను. వైశ్రావణుడు విశ్వకార్మచే కాశీ నగరమును నిర్మాణమును చేయించుకొని, దీర్ఘకాలం తపస్సు చేశాడు. పార్వతి పరమేశ్వరులు సాక్షాత్కరించి, అలకాపుర పాలానాధికారము, మితిలేని ధనము, దిక్పాలకులందు స్దానాన్ని ప్రసాదించారు. వైశ్రవుడు కోరిక ప్రకారము అన్నపూర్ణ, విశ్వనాధ నామములతో కాశీలో వెలసినారు. కాశీ క్షేత్రము నందు మరణించిన వారికి కైలాసప్రాప్తి కలుగును. ఈ కాశీ పురమున అష్ట భైరవులు, నవ దుర్గలు, నవ గౌరీ దేవతలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, ఇరువది యిద్దరు విష్ణువులు, ఏబదియార్వురు గణాధిపతులు గల గొప్ప శివ క్షేత్రము . ఇక్కడ ఉన్న స్నాన ఘట్టాలలో పంచగంగా ఘాట్, సోమేశ్వర్ ఘాట్, దత్తాత్రేయ ఘాట్, కేదార ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా, దశాశ్వమేద ఘాట్ ముఖ్యమైనవి.

10. త్ర్యంబకేశ్వరుడు

మహారాష్ట్రా లోని నాసిక్ నుండి 25కి.మి దూరంలో, గౌతమీ నదీ తీరంలో త్ర్యంబకేశ్వరుడిని మనం దర్శించవచ్చు. గోహత్య పాతాకమంతరింపటకు గౌతమ మునీశ్వరుడు నాసికా క్షేత్రమున శంకరుడు గురించి తపస్సు చేసెను. శంకరుడు గౌతమ మునీశ్వరుని సంకల్పము నెరవేర్చుటకై నీటి బిందువును ప్రసాదించాడు. ఆ నీటి బిందువు మహానది రూపమున గోవు మరణించిన చోట నుండి ప్రవహించింది. ఆ నదికి గౌతమ పేరున "గౌతమి" గా పేరు వచ్చెను. ఆ క్షేత్రం యందు గౌతమ ముని కోరికపై శంకరుడు త్ర్యంబకేశ్వరస్వామిగా వెలిశాడు. ఈ క్షేత్రమున మశ్ఛీంద్ర నాధుని పాదుకలు, 108 మహాదేవుని లింగముల స్ధానం, గోదావరీ అమ్మవారి ఆలయం దర్శించదగ్గ ప్రసిద్ధమైనవి. ఇక్కడ త్రిమూర్తుల రూపం, బొటనువేలు ఆకారంలో, లింగరూపమున, దర్శనిస్తారు. భూమిలోనే శివలింగం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది.


11. కేదారేశ్వరుడు

ఉత్తరప్రదేశ్‌లో , హిమాలయంలో "కేదార" అనే పర్వతం పైన కేదారేశ్వరుడు ఉన్నాడు. ఈ ప్రాంతం రూషికేష్ కు 250 కి. మీ దూరంలో ఉంది.
పూర్వము నరనారయణులు అను వారు తపస్సు చేసి, శివున్ని ప్రత్యక్షము చేసుకుని, కేదారలింగ రూపంలో వేంచేసి ఉండమని కోరారు. గంగాధరుడు అందుకు సమ్మతించి జ్యోతిర్లింగంగా వెలిశాడు. స్వయం ప్రకాశము గల కేదారలింగమును పూజించిన నరనారాయణులు ద్వాపర యుగమున కృష్టార్జనులై జన్మించారు. పాండవులు అరణ్యవాశము నందున్నప్పుడు కేదారలింగమును సేవించతలచి కేదారనకు వచ్చారు. శంకరుడు భీముని బలమును పరీక్షించుటకై మహిష రూపము ధరించి, పారిపోసాగెను. ఆది చూచిన భీముడు ఆ మహిషం వెనుక భాగాన్ని పట్టుకొని, మహేశ్వరుని అక్కడే ఉండమని ప్రార్ధిస్తాడు . భీముని బలము వలన మహిషం వృచ్ఛ భాగం మాత్రమే కేదారంలో ఉండిపోయింది. పాండవుల చెంతనుండక పారిపోయిన మహిష, నేపాళ రాజ్యమునకు పోయి, అక్కడే మహిష శిలాకారమున నిల్చింది.

12. ఘృశ్వేశ్వరుడు

ఔరంగాబాద్ (మహారాష్ట్ర) లోని దౌలతాబాద్ నుండి 11కి.మి దూరంలో ఘృష్ణేశ్వరుడు మనకు దర్శనిమిస్తారు. కుసుమేశ్వరుడు, ఘుష్మేశ్వరుడు, ఘృష్నేశ్వరుడు అనే నామాలతో సుప్రసిద్దుడు. అహల్యాబాయి హోల్కర్ ఈ గుడిని నిర్మించారు.