ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. చాంద్రమాస వికృతినామ సంవత్సరం లో అధిక వైశాఖమాసం ఏప్రిల్ 15 నుండి ఆరంభమై మే 14 వరకు ఉండే ఈ మాసానికి స్వయంగా విష్ణు భగవానుడే అధిపతిగా ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. అధిక వైశాఖం లో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, దానధర్మాలు అనుష్టాన పూర్వకంగా చేసినట్లైతే విష్ణు మూర్తి అనుగ్రహాన్ని పొందుతారని ప్రతీతి. అధికవైశాఖం లో పెళ్ళిళ్ళు తదితర శుభకార్యాలకు నెలరోజులపాటు విరామం. ఈ కాలంలో శివకేశవుల్లిద్దరిని తప్పక ఆరాధించాలి. వందసంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే పుణ్యఫలం అధికమాసంలో ఒక్కరోజు జపతపాలు, దానధర్మాలు చేస్తే లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
అధికమాసం లో వ్రతాలు, పూజలు చేసేవారు నిష్టతో చేయాలి. మాంసం, మత్తుపదార్ధాలు, నువ్వుల నూనె, ఉల్లి, వెల్లుల్లి తదితర పదార్ధాలకు దూరంగా ఉండాలి. ప్రతీరోజు ఒకరికి భోజనం పెట్టడం, గోపూజ, దానధర్మాలు, వ్రతాలు ఆచరిస్తూ సహనంతో సాత్వికమైన జీవితం గడపాలి. ఈ నెలలో దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాలలో భాగవతాది సప్తాహ కథా శ్రవణాలు, శివాలయాలలో శివునికి ప్రీతికరమైన రుద్రాభిషేకం, తులసీదళాలతో సాలిగ్రామ పూజలు, విష్ణువుకు ప్రీతికరమైన సత్యదేవ వ్రతాలు, విష్ణుసహస్రనామ పారాయణం చేస్తారు. అధికమాసంలో శివకేశవుల ధ్యానంలో గడపడం, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించడం వాళ్ళ శివానుగ్రహం పొందుతారు.
అధికమాసంలో నెలరోజులపాటు వివాహ, కేశ ఖండన, దేవతా ప్రతిష్ట, గృహప్రవేశం తదితర శుభకార్యాలు చేసుకోరాదు. మే 15 నుండి ప్రారంభమై జూలై 8 వరకు ఉండే నిజమాసంలో శుభకార్యాలు జరుపుకోవచ్చు అని వేదపండితులు చెప్తునారు.