Friday, March 18

భక్త శిఖామణి ......అంజనీపుత్రుడు

శ్రీరామ చంద్రుడిని గుండెల్లో ప్రతిష్టించుకొన్న భక్త శిఖామణి ఆంజనేయుడు. చిరంజీవి ఐన హనుమంతుడు 11 వ రుద్రావతారం. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రాన ఆంజనేయుడు జన్మించాడు .

వానరులైన అంజనాదేవి – కేసరి దంపతులకు వాయుదేవుని వల్ల శివాంశతో జన్మించినవాడు ఆంజనేయుడు. ఎర్రగా ఉన్న సూర్యుడిని ఫలంగా భావించి దానిని అందుకొనేందుకు ప్రయత్నించాడు మారుతి. ఆనాడు రాహుగ్రహణ కాలం. మారుతిని చూసి రాహువు భయపడి పారిపోయి ఇంద్రుడితో మొరపెట్టుకోగా ఆయన తన వజ్రాయుధం తో మారుతీ హనుమల ( చెక్కిళ్ళు ) పై కొట్టడంతో మూర్చపోతాడు. దీన్ని చూసిన వాయుదేవుడు తన కుమారుడైన ఆంజనేయుడు వజ్రాయుధ ఘాతకానికి గురికావడం తో సహించలేక వాయు సంచారాన్నినిలిపివేశాడు. సమస్త జీవరాశి గాలి లేక కలవరపాటుకు గురైనది. గంధర్వులు, దేవతలు చివరకు బ్రహ్మదేవుడిని శరణు కోరగా, బ్రహ్మ తన అమృత హస్తాలతో నిమరడంతో మేల్కొన్న మారుతి అప్పటినుండి హనుమంతునిగా పేరు గాంచాడు. ఆయన సూర్యుని నుంచి తేజస్సును, వ్యాకరణ , వేదశాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించాడు.

హనుమంతుడు అటు రామునికి భక్తునిగాను, సీతను రావణుడి చెర నుండి విడిపించేందుకు దూతగాను, రామ రావణ యుద్ధంలో సేనానిగా రాముడికి చేదోడు వాదోడుగా ఉంటూ తన పాత్రను భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు.

సుగ్రీవుడు వెంట నిలిచి వాలి సంచరించలేని ఋష్యమూక పర్వతం పై నివాసం ఏర్పరచుకొని ఆయనకు రక్షణగా నిలిచాడు. సీతను వెతికే సమయంలో రామ లక్ష్మణుల వెంట నడిచాడు. సముద్రాన్ని దాటి సీతాదేవి జాడ తెల్సుకొన్నాడు. రాముడి ముద్రికను సీతమ్మకిచ్చి, ఆమె ఇచ్చిన చూడామణి ని రామచంద్రుడికి తెచ్చి ఇచ్చాడు. లంకా దహనం చేసి కార్యశీలిగా పేరుగాంచాడు .

సీతమ్మ తలలో సింధూరాన్ని చూసి దాని వలన శ్రీరామునికి ఆయుషు వృద్ధి అని తన ఒంటి నిండా నింపుకొన్నాడు. అందువలన హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారు. మహేంద్రగిరి పై తపస్సు చేసుకొంటూ అయోధ్య వదిలి వెళ్ళిన ఆంజనేయుడికి సీతాదేవి శ్రీరామునికి తమలపాకులు ఇవ్వడం చూసి రాముడికి ఆరోగ్య వరూధిని తెలుసుకొని తమలపాకులను దేహం నిండా కట్టుకొన్నాడు. హనుమంతుడిని తమలపాకులతో పూజించడానికి ఇది కూడా ఒక కారణం. దీనివల్ల హనుమంతుడు శాంతిస్తాడట.

ఆంజనేయ కవచం, స్తుతి, చాలీసా, మంగళాష్టకం, పంచరత్నమాల, సుందరకాండ పటించడం చాల మంచిది.

యత్ర యత్ర రఘు నాద కీర్తనం ----- తత్ర తత్ర కృత మస్త కాంజలిం.

పంచముఖ ఆంజనేయస్వామి

Thursday, March 17

పంచముఖ ఆంజనేయ స్వామి

పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోక తో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపం లో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు. పాతాళం లో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.
పరమగురు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కి ఆరాధ్యుడు పంచముఖ ఆంజనేయుడు. కుంభకోణం లో ప్రసిద్ధి చెందిన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు.
ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు
గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు
వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు
నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.
హయగ్రీవుడు, నాలుగు ముఖాలకు పైన ఆసీనుడై ఉంటాడు. భక్తి, ఙ్ఞాన వృద్ధికి కారకుడు.

Wednesday, March 16

శివలింగోద్భవం

శివలింగోద్భవం గురించి స్కంద పురాణం లో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు. పుష్కలా వర్తక మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి ఆ శాంభవనల స్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుల చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు. అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

సాదారణంగా ప్రతీనెలా వచ్చే చతుర్దశి తిధిని మాసశివరాత్రి అంటాము, మాఘమాసంలో బహుళ చతుర్ధశినాడు వచ్చేది మహా శివరాత్రి.

Wednesday, March 9

సద్గురు స్తోత్రం

శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలశ్రీలక్ష్మీనరసింహరాజ
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా

జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా

జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యసుత శ్రీ చరణా

జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సవితృకాఠకచయన పుణ్యఫల భరధ్వాజఋషి గోత్రసంభవా

జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘనసంఖ్యాబోదిత శ్రీ చరణా

జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా
జయవిజయీ భవ
దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమః తన్నో దత్తః ప్రచోదయాత్
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ దత్తాత్రేయాయనమః
శ్రీ గురుదేవదత్తా
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము, జై గురుదేవ్

సద్గురు / సిద్ధమంగళ స్తోత్రము, పఠించినయెడల అనఘాస్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు బోజనము పెట్టినంత ఫలితము లభిస్తుంది. మండల దీక్ష వహించి, ఏకభుక్తము చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రహ్మనులకు బోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును, మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా, కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు.