Tuesday, May 31

త్రిపుండ్రములు

శివభక్తులు నుదుటమీద అడ్డంగా ధరించే నామాలనే త్రిపుండ్రములు అని అంటారు. వీటిని ధరించడానికి ప్రత్యేక పద్దతి ఉంది, ఈ త్రిపుండ్రములను ఎక్కడ ధరంచాలి అనే విషయాన్ని శివపురాణంలో తెలియచేయబడి ఉంది. త్రిపుండ్రములను శైవులు మాత్రమే ధరించాలి అనే నియమం లేదు, ఎవరైన ధరించవచ్చు.
నామాలని ధరించేటప్పుడు సమయానుసారం ధరించాలి. మధ్యాహ్నంలోపు నామాలను ధరించే పనైతే విభూదిని నీటితో కలిపి పెట్టుకోవాలి. ఆ తరువాత ఐతే నీటిని కలపకుండా విభూదిని ధరించాలి. మధ్య, ఉంగరపు వేళ్ళతో మొదట రెండు నామాలు ధరించి, బొటనవేలితో మూడో నామాన్ని పెట్టుకోవాలి. కనుబొమ్మల మధ్య ఈ చివరనుండి, ఆ చివరవరకు నామాలు ధరించాలి. ధరించే సమయంలో శివనామస్మరణ చేయాలి.
ఈ నామాలను నుదుటిమీదే కాక వివిధస్థానాలలో శివభక్తులు ధరిస్తారు. 32 స్థానాలు లేక 16, 8, 5 స్థానాలలో మాత్రమే విభూదిరేఖలను ధరించాలి. శిరస్సు, లలాటం, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, కంఠం, రెండు చేతులు, మోచేతులు, మణికట్లు, హృదయం, రెండు
పార్శ్వాలు, నాభి, గుహ్యం, రువులు, మోకాళ్ళు, పిక్కలు, మోకాళ్ళ కిందభాగం, రెండు పాదాలు, వెనుక భాగం అనే 32 స్థానాలను భస్మధారణకు ప్రాధానమైనవిగా చెప్తారు. తల, నుదురు, కంఠం, 2 భుజస్కందాలు, 2భుజాలు, 2 మోచేతులు, 2 మణికట్లు, హృదయం, నాభి, 2 పార్శ్వాలు, వెనుకభాగము అనేవి విభూది ధారనకు ప్రధానమైన 16 స్థానాలు. గుహ్యం, లలాటం, రెండు చెవులు, రెండు భుజాలు, హృదయం, నాభి అనే 8 స్థానాలు కూడ విభూదిధారణకు ముఖ్యస్థానాలు. ఈ స్థానాలలో బ్రహ్మ, సప్తఋషులు ఉంటారు. శిరస్సు, 2భాహువులు, హృదయం, నాభి అనే 5 స్థానాలలో విభూదిధారణ చేయాలి. ( 32/16/8 స్థానాలలో ధరించలేనివారు).
( పైన ఫోటోలో గురుదేవులు ధరించినట్లు విభూది ఆయా స్థానాలలో ధరించాలి)
ఈ కాలంలో అయితే ఆఫీసులకి అలా వెళ్ళడం వీలుకాదు కనుక, కనీసం నుదుటిమధ్యలో విభూది ధరించడం మంచిది. ధరించే సమయంలో శివనామస్మరణ మరవవద్దు.

Saturday, May 28

అష్ఠాదశ శక్తిపీఠాలు (4)

మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వాడుకలోకి వచ్చింది.

Friday, May 27

అష్ఠాదశ శక్తిపీఠాలు (3)

మహాకాళి :
అమ్మవారి పైపెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని. పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గంగానదికి ఉపనది అయిన క్షిప్రానదీ తీరంలోని ఉజ్జయిని నగరం సప్తపురి క్షేత్రాలలో ఒకటి. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రాలలో ఒకటి.

Thursday, May 26

అష్ఠాదశ శక్తిపీఠాలు (2)


చాముండి
అమ్మవారి కురులు చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి పరమేశ్వరి, శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. "మహాబలాద్రి శిఖర" అనే కొండపై అమ్మవారు వెలిసారు కావున ఆ కొండ కాలక్రమములో చాముండికొండగా మారింది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

Wednesday, May 25

అష్ఠాదశ శక్తిపీఠాలు (1)

దక్షయఙ్ఞ కార్యక్రమమే అష్ఠాదశపీఠాలకు ఏర్పడటానికి మూలం ఐనది. తాను జరపబోయే బృహస్పతియాగానికి దక్షుడు అందరిని ఆహ్వానిస్తాడు, తన కూతురు దాక్షాయణిని, అల్లుడు శివుడిని తప్ప. తన ఇష్టంతో సంబంధంలేకుండా దాక్షాయణి శివుడిని పెళ్ళాడటమే అందుకు కారణం. పిలుపు లేకుండానే, దాక్షాయణి యాగానికి వస్తుంది (పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవల్సిన అవసరంలేదు అనే ఉద్దేశ్యంతో ). అక్కడ దక్షుడు, ఇతరులు చేసిన శివనింద భరించలేక ఆమె యోగాగ్నికి ఆహూతైంది.

ఉగ్రరూపుడైన శివుడు, విషాదంతో దాక్షాయణి మృతదేహాన్ని భుజాన వేసుకొని, జగత్రక్షణ కూడా పక్కనబెట్టి, సంచరించసాగాడు. సృష్టి, స్థితి, లయంలో ఏ ఒక్కట్టి ఆగినా అనర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది అనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, విష్ణుదేవుడు, శివుడిని కార్యోన్ముక్తుడు చేయుటకై, తన చక్రాయుధంతో దాక్షాయ
ణి మృతదేహాన్ని ఖండాలుగా చేస్తాడు. ఒక్కోభాగము ఒక్కోచోట పడ్డాయి అవి పడిన ప్రతీచోట శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి.

Friday, May 20

వల్లిదేవి, సుబ్రహ్మణ్యస్వామి


తొండైనాడు దేశంలో "మేర్పట్టి" అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ పొలిమేర్లలో వల్లిమలై [ వల్లికొండలు ] ఉన్నాయి. ఆ గ్రామంలోనే నంబి అనే పుళిందుడు ఉండేవాడు. [ పుళిందులు అంటే వేటాడి జీవనం సాగించేవారు అని ]. ఆ నంబికి మగపిల్లలు ఉన్నరు, కాని ఆడపిల్ల అంటే అతనికి చాలా ఇష్టము. ఒకరోజు నంబి, అతని భార్య ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూండగా వారు, ఓ శిశువు దుప్పి పరిరక్షణలో ఉండటం చూసారు. ఆడపిల్లలు లేనిలోటు ఆ దేవుడు ఈ రూపంలో తీర్చాడు అనుకొని, ఆ బిడ్డని ఎత్తుకొని ముద్దాడి, తమ ఇంటికి తీసుకొని పోయారు. తమ జీవనాధారం ఐన వల్లికొండల మద్య దొరికింది కాబట్టి "వల్లి" అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచసాగారు. భగవంతునిపై భక్తి, పెద్దలపట్ల గౌరవము, వినయ విధేయతలతో వల్లి పెరిగింది.

Thursday, May 19

షట్చక్రములు

షట్చక్రాలు అని మనం వినేఉంటాం. వాటి గురించి కూడ తెలుసుకొందాం. మాములుగా అంటూంటారు బాగా యోగ సాధనచేసేవారికి తప్ప అలాంటివి అర్ధంకావు అని. అది నిజమే సుమా, సాధన చేసేవారు ఆ చక్రాలను అనుభవించగలరు. కనీసం ఆ చక్రాల పేర్లెంటో అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకొందాం. అందులో తప్పులేదు కదా.

"మూలాధారం గుదస్థానం, స్వాదిస్ఠానం తు మేహనం

నాభిస్థు మణిపూరాఖ్యాం, హృదయాబ్జ మనాహతం

తాలుమూలం విశుద్దాఖ్యం, ఆఙ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారాం బ్రహ్మరంధ్ర ఇత్యాగమ విదోవిదుః "
వీటిని ఊర్ద్వలోక సప్తకమంటారు.

షట్చక్రములు : మూలాధారం. స్వాదిస్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్దం, ఆఙ్ఞాచక్రం, సహస్రారం.

7. సహస్రారం -- సత్యలోకం -- పరమాత్మస్థానం
6. ఆఙ్ఞాచక్రం -- తపోలోకం -- జీవాత్మస్థానం
5. విశుద్దం -- జనలోకం -- ఆకాశభూతస్థానం
4. అనాహతం -- మహ్ర్లోకం -- వాయుభూతస్థానం
3. మణిపూరకం -- సువర్లోకం -- అగ్నిభూతస్థానం
2. స్వాదిస్ఠానం -- భువర్లోకం -- జలభూతస్థానం
1. మూలాధారం -- భూలోకం -- పృధ్విభూతస్థానం



మూలాధారం:
మలరంధ్రానికి 2అంగుళాల పై భాగంలో ఉంటుంది. దీనిరంగు ఎర్రగా రక్తవర్ణంలో ఉంటుంది. 4రేకులు కల తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి గణపతి, వాహనం ఏనుగు.

స్వాధిష్టానం :
ఇది జననేద్రియం వెనుక భాగాన, వెన్నుముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మ, తత్వం జలం. సింధూరవర్ణంలో ఉంటుంది, 6 రేకుల పద్మాకారంలో ఉంటుంది. వాహనం మకరం.

మణిపూరకం : బొడ్డునకు మూలంలో వెన్నుముకయందు ఉంటుంది. అధిపతి విష్ణువు, 10 రేకుల పద్మాకారంలో, బంగారు వర్ణంలో ఉంటుంది, వాహనం కప్ప.

అనాహత చక్రం : హృదయం వెనుక వెన్నుముకలో ఉంటుంది. అధిదేవత రుద్రుడు, 12 రేకుల తామరపువ్వు వలె నీలం రంగులో ఉంటుంది. తత్వం వాయువు, వాహనం లేడి.

విశుద్ధచక్రం : కంఠం యొక్క ముడియందు ఉంటుంది. అదిపతి జీవుడు, నలుపురంగులో ఉంటుంది. తత్వం ఆకాశం, వాహనం ఏనుగు.

ఆఙ్ఞాచక్రం : రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. అధిపతి ఈశ్వరుడు, రెండుదళాలు గల పద్మాకారంలో, తెలుపు వర్ణంలో ఉంటుంది.

సహస్రారం : కపాలం పై భాగంలో, మనం మాడు అని పిలిచేచోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రం అంటారు. అధిపతి పరమేశ్వరుడు, వేయిరేకుల పద్మాకృతిలో ఉంటుంది. సుషుమ్నా నాడి పై కొన మీద ఈ చక్రం ఉంటుంది. దీనికి ఫలం ముక్తి.

Wednesday, May 18

కల్కి అవతారం


శ్రీమద్భాగవతం ప్రకారం కల్కి అవతారం కలియుగ అంతంలో వస్తుంది. ఎలా వస్తుంది అనేది భాగవతంలో వివరణ ఉంది. ఈ అవతారం ప్రతి కలియుగంలో వస్తుంది కనుకనే వేదవ్యాసుడు కల్కి అవతారం గురించి ప్రస్తావించాడు. ప్రతి మన్వంతరంలో 71 చతుర్యుగాలు వస్తాయి, అంటే 71 కలి యుగాలు. అందులో మనం ఉన్నది 28వ కలియుగం, అంటే 27 కల్కి అవతారాలు ఇది వరకే వచ్చాయని పురాణం చెబుతుంది.

ఇంకో కధనం కూడా ఉంది :
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కల్కి అవతారమున "విష్ణుయశస్సుడు" అనే పేరుతో బ్రాహ్మణకులములో జన్మిస్తాడని, హయగ్రీవుడికి వలె ఇతనికి కూడా గుఱ్ఱపు ముఖము ఉంటుందని, చేతిలో ఖడ్గముతో, తెల్లటి అశ్వం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని వివరణ.

నమస్కారం

"నమస్కారం" అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం. తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.

మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష. [ ఇటీవల నమస్కారానికే అర్ధం మారిపోయింది, ఒక చేతిని పైకెత్తి నమస్తే అంటున్నారు, ఇంకొందరు వెటకారంగా కూడా ఉపయోగిస్తున్నారు ]

సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా "నమస్కారం / నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు. వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.
  • శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.[శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు ]
  • హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించాలి.
  • గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి
  • తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి
  • తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి
  • యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.

Friday, May 13

బలరాముడు


మహావిష్ణువు శ్వేతతేజస్సు బలరాముడుగాను, నీలతేజస్సు శ్రీకృష్ణుడుగాను అవతరించి దుష్టశిక్షణ చేసారు. చెరశాలలో ఉన్న దేవకి సప్తమగర్భాన్ని యముడు తన మాయ చేత ఆకర్షించి, రోహిణిదేవి గర్భంలో ప్రవేశపెట్ట్టాడు. ఈ సందర్భంలోనే బలరాముడికి సంకర్షణుడు (సంపూర్తిగా ఆకర్షించినవాడు) అనే పేరు వచ్చింది. బలవంతులలోకి బలవంతుడు కనుక బలరాముడు అని పేరు. బలరామదేవుడు ఆదిశేషుని అవతారం. సాందీపుడి దగ్గర బలరామకృష్ణులు శిష్యరికం చేసారు. బలరాముడికి దుర్యోధనుడు అంటే మహాప్రీతి. భార్య రేవతీదేవి, నాగలి ఆయుధం, ఎప్పుడూ నీలిరంగు వస్త్రాలనే ధరిస్తాడు, జెండా పైన తాటిచెట్టు గుర్తు ఉంటుంది. భీముడు, ధుర్యోధనుడు గదావిద్యను బలరాముడిదగ్గరే నేర్చుకొన్నారు. పాండవ కౌరవ యుద్దంలో తటస్థంగా ఉన్నాడు. ఆ తటస్థ స్వభావాన్ని నిలుపుకోడానికి సరస్వతి నదీతీరంలో ఉన్న తీర్ధయాత్రలకు బయలుదేరివెళ్ళాడు. 42 రోజుల యాత్ర ముగించుకొని, భీమ దుర్యోధనుల గదాయుద్ధ సమాయానికి తిరిగివచ్చాడు. ఆ గదాయుద్ధంలో భీముడు, ధుర్యోనుడి తొడలు విరగగొట్టడం గదాయుద్ధధర్మం కాదు అని ఆగ్రహిస్తాడు బలదేవుడు. మైత్రేయమహర్షి శాపం వలన మరియు భీముడి ప్రతిఙ్ఞ వల అలా జరిగింది అని కృష్ణుడు చెప్పగా బలరాముడు శాంతించాడు.

కురుక్షేత్ర యుద్ధం తరువాత బలరాముడు అరణ్యంలో ఒక వృక్షం క్రింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమైన సమయంలో అతని నోటినుండి తెల్లని సర్పం బైటకువచ్చి పడమటిసముద్రంలో లీనమైనది. బలరాముడు ఆదిశేషు అవతారం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము.

కృష్ణావతారం


"వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం "

మథుర లో దేవకీవసుదేవుల బిడ్డగా పుట్టి, రేపల్లెలో యశోదానందుల ముద్దులకొండగా, బలరాముడు, సుభద్ర ల సోదరుడిగా, కన్నయ్య గా మన అందరిచేత ముద్దుగా పిలిపించుకొంటున్న విష్ణుమూర్తి యొక్క 9వ అవతారం శ్రీకృష్ణుడు. కౌరవలచేత పాండవపక్షపాతిగా పేరుపడ్డాడు. కృష్ణవర్ణం అంటే నీలం, నలుపు, చీకటి అనే అర్ధాలు ఉన్నాయి, ఙ్ఞానానికి ప్రతీక నీలం. అందుకే ఆ విష్ణుమూర్తి నీల మేఘశ్యాముడైనాడు.



"కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం.
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చుడామణిః "

పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. కాళిందిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యముచేసి "తాండవకృష్ణుడు" అయ్యాడు. ప్రళయకాలంలో గోవర్ధన గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చికాపాడి రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో రేపల్లెను మురిపించి కంసునిచే పంపబడిన ఉద్దవుని రాకతో మధురకు చేరి తనను మాయోపాయయంచే చంపచూసిన కంసుని వధించి తన తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించి చెరలోఉన్న తల్లి, తండ్రులను వారితో విడిపించి ద్వారకకు చేరుకుంటాడు. విద్యాభ్యాసానికి ముని ఆశ్రమము చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొంది, గురుదక్షిణగా తక్షకుడు తస్కరించిన అధిథి కుండలాలను విడిపించి గురువుకి సమర్పించి విద్యాధనంతో తన తల్లి తండ్రులవద్దకు చేరుకుంటాడు.
కృష్ణుని అష్టభార్యలు - రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళిందిని, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద మరియు లక్షణ
వనవాస సమయంలోను, కురుక్షేత్ర యుద్దంలోను పాండవులకు అండగా ఉండి, అర్జునుడికి "గీత" ను భోధించిన జగన్నాటకసూత్రధారి ఆ గోపాలపాలకుడు.

శ్రీమధ్బాగవత పఠన సంప్రదాయాన్ని మొట్టమొదట ప్రారంభించినవారు వ్యాసమహర్షి పుత్రుడు శుకమహర్షి, పరీక్షిత్ మహారాజుకి 7రోజులపాటు భాగవతాన్ని వినిపించాడు. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన 30ఏళ్ళ తరువాత కలియుగం ప్రవేసించిన భాద్రపద శుద్ధనవమి నుండి పౌర్ణమి దాక తొలి భగవత సప్తాహం జరిగింది.

రామావతారం


తల్లితండ్రుల మాటను తూచా తప్పకుండా పాటించే ఒక సామాన్యుడిగా రూపం దాల్చి, రావణాసురుడు వంటి రాక్షసులను సంహరించి, సీతా మహాసాధ్వితో అయోధ్యాదీసుడైనాడు రాముడు. అన్న మాటే వేదంగా శిరసావహించే తమ్ముడు లక్ష్మణుడు,, అన్న పాదారక్షలనే సింహాసనం పైన ఉంచి పాలనను సాగించిన తమ్ముడు భరతుడు, శత్రుఘ్యుడు.

మందర మాట విని కైకేయి, శ్రీరామునికి బదులు తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయమని, రాముడిని 14 ఏళ్ళ వనవాసం పంపమని దశరధ మహారాజుని కోరింది. పినతల్లి మాటకు కట్టుబడి, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం తలపెట్టెను. వనవాస సమయంలో లంకేయుడూ, మహేశ్వరుని అపర భక్తుడూ అయిన రావణాసురుడు, సీతమ్మ తల్లిని అపహరించి లంకలో అశోకవనములో ఉంచుతాడు. అపహరన తగదని రావణుడి తమ్ముడు విభీషణుడు, భార్య మండోదరి రాముడి గొప్పతనమును రావణుడికి చెప్పినను రావణుడు లెక్కచేయక, ఆ శ్రీరామచంద్రుడితోనే వైరంకి దిగాడు. రామయ్య వానరసేనతో, లంక పైన దాడి చేసి, రావణ సంహారమొనరించి, సీతమ్మతల్లిని తన దరికి చేర్చుకొంటాడు.

ఇంత గొప్ప రామాయణంలో హనుమంతుడి యొక్క స్వామిభక్తి, లక్ష్మణుడి యొక్క సోదరభావం, సీతమ్మ పతిభక్తి, శబరి తల్లిప్రేమ, గుహుడు, వారధి కట్టే సమయంలో ఉడత భక్తి ఇలా ఒక్కొక్కరు ఒక్కోరూపంలో తమ భక్తిని చాటుకొన్నారు.

"శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద ళాయతాక్షం
రామం నిసాచరవినాశకరం నమామి"

Wednesday, May 11

నవవిధభక్తి

భక్తి చేయడం అనేది వారి వారి అనుకూలత / అభిప్రాయాలు లేక వారివీలును బట్టి ఉంటుంది. ఏ విధంగా చేసినా రోజులో అధికసమయం దైవనామస్మరణ చేయడం, ప్రతీదానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం, ఆ భక్తి చేయడం అనేది కొందరు భజనలు చేస్తారు, కొందరు జపం చేస్తూంటారు, మరికొందరు ధ్యానం చేస్తారు. ఆ విధంగా పలురకాలుగా దేవుడిని ఆరాధించే మార్గాలు తొమ్మిది. వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు.

" శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్‌
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్‌ "

శ్రవణం : ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలోనే దైవత్వమును గ్రహించి కేవలం శ్రవణం ద్వార భక్తితత్వాన్ని గ్రహించాడు. మనకు ఉన్న సమయాన్ని దైవిక విషయాలు వినటానికి అది ఏ రూపంలోనైనాసరే (ఇప్పుడు అందరి ఇళ్ళలో సిడి ప్లేయర్స్, టేపిరికార్డ్లు ఉంటున్నాయి కదా) పొద్దున్నే సుప్రభాతం, విష్ణు, లలితా సహస్రనామములు, వారి ఇష్టదేవతా స్తోత్రములు వినడం ద్వారా ప్రశాంతమైన మనస్సుతో రోజును ప్రారంభించడం మంచిది.

కీర్తనం : మనందరికి తెలిసిన అన్నమ్మయ్య, త్యాగయ్య, భక్త రామదాసు మొదలైన వాగ్గేయకారులంతా భక్తి చేసినది "కీర్తనం" ద్వారానే. అందరికి అష్టోత్రాలు, సహస్రనామాలు చదవడం రాకపోవచ్చు, వారు అలా బాధపడకుండా, కీర్తనల రూపంలో ఆ శ్రీమన్నారాయణుడిని ఆరాధించవచ్చు.

స్మరణం : కార్తీకపురాణం, విష్ణుపురాణం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం మొదలైనవి అన్ని "స్మరణ" మార్గంగా చెప్పవచ్చు. అంజనేయస్వామి కూడ ఎప్పుడూ రామ నామస్మరణలోనే ఉంటాడు.

పాదసేవ : పాదసేవ కంటే మించినదిలేదు. గురువుగారి కి పాదసేవ, పాదపూజ చేయడం ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలము. భక్తుడెల్లప్పుడూ భగవంతుని దివ్యచరణాలను తన మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు. ఈ భక్తిపద్ధతిని పాదసేవనమంటారు. ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడని భాగవతం చెబుతోంది. రామచంద్రుని పాదుకలనే అతని దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నందిగ్రామంలో గడుపుతూ ఉంటాడు భరతుడు.

అర్చనం : మనం ప్రతినిత్యం చేసే విగ్రహారాధనే అర్చనం. దేవుడిని మనస్పూర్తిగా పూజించడం. పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. శ్రీరామచంద్రుడే సింహాసనంపై కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం(గొడుగు) పడతాడు.చామరం(వీవన)తో వీస్తాడు.

వందనం : ఇష్టదైవానికి / గురువుకి మనస్పూర్తిగా నమస్కరించడం. రామచంద్రుని చూడగానే పులకితగాత్రుడైన భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ రాముని పాదాలమీదపడి వందనమాచరిస్తాడు .

దాస్యం : సర్వం ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. లక్ష్మణుడు ప్రతీక్షణం శ్రీరామచంద్రుడికి కావలసినవి అమర్చడం, ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించడం మొదలైనవి దాస్య భక్తిప్రవృతి గా చెప్పవచ్చు.

సఖ్యం : భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత. కుచేలుడు దీనికి మంచి ఉదాహరణ. గోపాలునితో స్నేహమొనరించి, ఆ స్నేహమాధుర్యంతోనే అనన్యమైన భక్తిని సంపాదించాడు.

ఆత్మనివేదనం : కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో ఆ దేవదేవుడిని పూజింపాలి.

పూజచేయడానికి అంత సమయం లేదు అంటున్న ఈ యాంత్రికకాలం లో పైన చెప్పిన శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం చేయడంద్వార భగవత్ నామస్మరణ చేయొచ్చు. ఇవి చేయడానికి సమయం సంధర్భం అవసరంలేదు. మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా, ఇష్టమైన నామాన్ని స్మరించండి చాలు.

పరశురాముడు


జమదగ్ని మహర్షి, రేణుకల కుమారుడు పరశురాముడు. కోపము, ఆవేశము ఎక్కువ. ఏ కార్యం తలపెట్టిన వెనుతగ్గే సమస్యే లేదు, విజేయుడై వస్తాడు. ఒకసారి హైహయ వంశీయుడైన కార్తవీర్యార్జునుడు, వేటలో అలసిపోయి, తన సేనతో జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. మహర్షి రాజుకు, వారి పరివారానికి పంచభక్ష పరమాన్నలతో భోజనం పెట్టాడు. మహర్షి కామధేనువు సాయంతో ఇంతమందికి లోటులేకుండా భోజనాలు పెట్టాడు అని తెలుసుకొన్న రాజు, ఆ ధేనువును తనకు ఇమ్మని మహర్షిని అడిగాడు, అందుకు జమదగ్ని ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ధేనువుని తీసుకొనివెళ్ళిపోయాడు.

పరశురాముడు తన తండ్రిని అవమానించిన కార్తవీర్యార్జునిడిని సం హరించి, తిరిగి కామధేనువును ఆశ్రమానికి తెస్తాడు. కొద్దికాలం తరువాత మరొక సంఘటన జరిగింది.

తల్లి రేణుకా నీరు తేవడానికి సరస్సుకి వెళ్ళింది. అదే సమయంలో అప్సరసలతో చిత్రరధుడు క్రీడిస్తున్న దృశ్యం చుసి అలాగే ఉండిపోయినది. దివ్యదృష్టితో ఈ విషయం తెలుసుకొన్న జగమదగ్ని, తల్లిని వదించమని కుమారులను ఆఙ్ఞాపించాడు. అందుకు వారు నిరాకరించారు. కుమారులలో ఒకడైన పరశురాముడిని, తన మాట ధిక్కరించిన సోదరులను, మనోవికారానికి గురైన తల్లిని సంహరించమని ఆఙ్ఞాపించాడు, తండ్రి మాట శిరసావహించిన పరశురాముడిని వరం కోరుకోమంటాడు జమదగ్ని. తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించమని వేడుకొంటాడు పరశురాముడు. జమదగ్ని పుత్రుడి కోరికను నెరవేరుస్తాడు. ఇలా కొంతకాలం గడిచింది.

ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలోలేని సమయంలో, కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్నిని సంహరించి వెళ్తారు. విషయం తెల్సిన పరశురాముడు, తన తండ్రిని రాకుమారుడు సంహరిచినందుకు ప్రతీకారంగా ఈ భూమండలమందు రాజులను బ్రతకనివ్వనని ప్రతిఙ్ఞ చేసాడు.

పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేశాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్చించాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.

కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.

Tuesday, May 10

వామనావతారం

అన్నీ అవతారాలలోకి వామనావతారం విశిష్టమైనదిగా చెప్పవచ్చు. అప్పటివరకూ సృష్టిలోని జీవరాసులన్నిటియందూ తనను తాను ప్రతిష్టించుకొన్న ఆ శ్రీహరి ప్రధమంగా మానవావతారాన్ని ధరించిన రూపమే వామనావతారం. అమృతపానం చేసిన దేవతలు రాక్షసులతో యుధ్ధం చేసి ఎంతో మందిని సంహరించారు. మరెందరినో ఓడించారు. ప్రహ్లాదుని మనుమడు వరోచనుడు. ఆ వరోచనుని కుమారుడు బలి. గురువైన శుక్రాచార్యుల వారు బలి చేత 'విశ్వజిత్ 'అనే యాగం చేయించాడు. రాక్షసులకీ బలమూ, తేజస్సు, లభించిది. యుధ్ధ పరికరాలన్నిటినీ పొందిన బలి, దానవ సైన్యాన్ని కూడగట్టుకొని తిరిగి ఇంద్రుని మీదకు యుధ్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడి రాజధానిని బలి చక్రవర్తి ఆక్రమించాడు. అదితి తన కుమారులైన దేవతలు సర్వ సంపదలూ కోల్పోయి బాధపడుతుంటే కుమిలిపోయింది. కశ్యపుడు అదితికి ధైర్యం చెప్తూ, " మాఘమాసంలో అమావాస్య గడిచిన తెల్లవారుజామున ఫాల్గుణ శుక్లపక్షం ప్రారంభం అవుతుంది. శుక్లపక్ష ప్రధమదివసాన తెల్లవారుజామునే వాసుదేవుడిని స్తుతించాలి " అని వ్రతమును ఉపదేసిస్తాడు.

వ్రత ఫలితంగా మహావిష్ణు వరం వలన అదితి గర్భవతి ఐనది.
భాద్రపద శుద్ద ద్వాదశి నాడు శ్రవణానక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో ఆ శ్రీమహావిష్ణువు, వామన అవతారం లో ఈ భూమిమీద అవతరించాడు.

ఉపనయన సమయమున సవిత్రుడు గాయత్రిని భోదించాడు. బృహస్పతి బ్రహ్మ సూత్రాలను, సోముడు దండాన్ని, భూమి కృష్ణాజినాన్ని, దివస్సు చ్చత్రాన్ని, తండ్రి కశ్యపుడు మేఖలను, తల్లి అదితి కౌపీనాన్ని, కుబేరుడు భిక్షాపాత్ర, సరస్వతి జపమాల, సప్తౠషులు కుశలను ఇచ్చారు. ఉపనయనం తరువాత అదితి సంతతి మేలు కోసం బలిచక్రవర్తి దగ్గరకు బయలుదేరాడు.

వామనుడు బలిచక్రవర్తిని 3అడుగుల నేలను దానంగా ఇవ్వమని అడిగాడు. బలి చక్రవర్తి పక్కనే ఉన్న గురువు శుక్రాచార్యులు వామనుడు సామాన్యుడు కాదని గ్రహించి, దానం ఇవ్వొద్దు అని బలి ని వారిస్తాడు. అంతరార్ధం తెలియని బలి దానం ఇవ్వడానికి సిద్దపడి, కమండలం నుండి నీరుని వదులుతున్న సమయంలో శుక్రాచర్యుడు ఒక చిన్న పురుగు రూపంలో ఆ కమండలం నుండి నీరు బైటకు రాకుండా అడ్డుపడుతాడు. ఒక్క చిన్న దర్భ తో ఆ శ్రీమహావిష్ణువు అడ్డుని తొలగిస్తాడు. అలా దానం ఇవ్వడంలో ఆటంకం తొలిగించాడు. మొదటి అడుగు తో ఈ భూమండలాన్ని, రెండవ అడుగుతో ఆకాశాన్ని పూర్తిచేసాడు. ఇక ఒక్కడుగు మిగిలి ఉంది చోటు ఏది అని బలిని అడుగగా, సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే వామన రూపంలో వచ్చాడని తెలుసుకొన్న బలి తన శిరస్సుపై మూడవ అడుగు పెట్టమని శిరస్సు వంచి అభివాదం చేసాడు. వామనడు తన మూడవ అడుగును బలి శిరస్సుపై పెట్టి పాతాళానికి అణచివేసాడు.

" ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై "

Monday, May 9

నృసింహావతారం

మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ "నృసింహ అవతారము". పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ విజయులు' సంరక్షించుచూ ఉండు సమయాన, ఒక్కసారి సనక, సనందన, సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు. వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల, శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు. దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు. అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులుగా రెండవ జన్మలో రావణ, కుంభకర్ణులుగా, మూడవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మిస్తారు. అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులుగా జన్మించి ఘోరమైన తపస్సులుచేసి, ఆ వరగర్వంతో లోకకంటకులైనారు. దానితో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహా రూపంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.

హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి తనకు ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతోవిర్రవీగిపోతూ ఉంటాడు. (గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని, దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని, అస్త్రశస్త్రాలవల్లగాని, ఇంటగాని, బయటగాని, చావులేకుండా వరం) అట్టి దానవుడి నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు" విష్ణుభక్తుడు, దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద, దండోపాయాలతో ప్రయత్నిస్తారు.ఆగ్రహించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న శ్రీహరి ఎక్కడ ? ఈ స్తంభమున చూపగలవా? అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లదుడు తండ్రీ! సర్వాంతర్యామి అయిన శ్రీహరి
"ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమ యోగిగణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో! "
అని జవాబు ఇస్తాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా? అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు.




"వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్ ,
మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం"

అని సాక్షాత్తు శ్రీహరి స్వయముగా ప్రహ్లాదునితో చెప్పినట్లు "నృసింహపురాణం"లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి) అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశ్యపుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరిగిపడుచుండగా భూమ్యాకాశాదులు దద్దరిల్లేలా సింహగర్జన చేస్తూ ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు. సింహంతల, మానవశరీరం. సగం మృగత్వం, సగం నరత్వం. ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం, కరుణ, ఉగ్రత్వం, ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి హిరణ్యకశ్యపుడు పొందిన వరాలను ఛేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము "గడపపైన" మృగ నరలక్షణాలతో గూడి, ఒక్క ఉదుటన హిరణ్యకశ్యపుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు. అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక, స్వామిని శాంతింప చేయమని ప్రహ్లాదుడిని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు. అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా, పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాడబడచూ పూజించబడుచున్నారు.

Sunday, May 8

నైవేద్యం


మనం సకలదేవతలను పూజిస్తూంటాం. ఇష్టదైవాలను ఎంచుకోడం అనేది వారివారి నమ్మకాలు, అనుభవాల మీద ఆధారపడిఉంటుంది. అమ్మవారు / అయ్యవారికి చేయవలసిన అష్టోత్తర సహస్రనామములు, షోడసోపచార పూజల తర్వాత, ఇష్టదైవాలకు అవసరనైవేద్యం, మహానైవేద్యం, తాంబూలం, హారతి (నీరాజనం), మంత్రపుషం, ఫలశృతి, తీర్ధస్వీకారం అనంతరం పూజ పరిపూర్ణం అవుతుంది.

తూర్పు లేదా ఉత్తరముఖముగా కూర్చొని పూజ చేయాలి. మనకు ఎదురుగా దేవతామూర్తులు ఉండాలి అంటే దక్షిణ లేదా పశ్చిమ ముఖముగా దేవతామూర్తులు ఉండాలి. పూజకి కూర్చొనేముందు ఎవరైనసరే కుంకుమ లేక విభూది లేదా తిలకము కాని పెట్టుకోవాలి. ( ఇప్పటికాలంలో పెళ్ళి ఐన ఆడువారు కూడా నల్లబొట్టు పెడ్తున్నారు, దయచేసి పెళ్ళి ఐనవారు ఎట్టిపరిస్థితులలోనూ నలబొట్టు ధరించవద్దు. ) మన నిత్య పూజ అనంతరం దేవుడికి నైవేద్యం పెడ్తాము. ఎవరికి ఏ నైవేద్యం పెట్టాలో ఒక్కసారి చూద్దాం.

వినాయకుడు : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడు కాయలు నైవెద్యము శ్వేత అక్షతలతో (తెల్లని అక్షతలు) పూజ చేయాలి
ఏడుకొండల వెంకన్న : వడపప్పు, పానకం నైవేద్యము మెడలో తులసిమాల అలంకరించాలి
ఆంజనేయస్వామి : అప్పములు నైవేద్యముగాను, మెడలో వడమాల. సింధూరం, తమలపాకులతో పూజ చేయాలి

సూర్యుడు : మొక్క పెసలు, క్షీరాన్నం నైవేద్యం

లక్ష్మీదేవి : క్షీరాన్నం, తీపి పండ్లు నైవేద్యం. తామరపూలతో పూజింపాలి.

లలితాదేవి : క్షీరాన్నం, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.

సత్యనారాయణస్వామి : ఎర్రగోధుమనూకలో జీడిపప్పు, నెయ్యి కలిపిన నైవేద్యం

దుర్గామాత : మినపగారెలు

సంతోషిమాత : పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.

శ్రీకృష్ణుడు : అటుకులతో కూడిన తీపి పదార్ధాలు. వెన్న నైవేద్యం, తులసి దళములతో పూజింపాలి.
శివుడు : కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం. మారేడు దళములతో పూజచేయాలి.
షిరిడి సాయిబాబా : గోధుమరొట్టెలు, పాలు

Saturday, May 7

సింహాచల అప్పన్న నిజరూపదర్శనం (చందనోత్సవం)


ఉగ్రరూపుడైన నరసింహ స్వామి 12మణుగుల శ్రీచందనంలో ఏడాది పొడవునా దాగి ఉంటారు. హిరణ్యాక్షుడి సంహారం తర్వాత, ఆ ఉగ్రరూపంతోనే ఈ కొండపై స్వామి అవతరించారని పురాణ కధనం. ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్ల తదియ నాడు నిజరూప దర్శనం ఇస్తారు స్వామి. సిం హాచలంలో తెల్లవారుఝామున ఒంటిగంట నుండి అర్చకులు వైధిక కార్యక్రమాలు నిర్వహించి, స్వామిపై ఉన్న చందనాన్ని వెండి బొరిగలతో తొలగిస్తారు. నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి తొలివిడతగా 3మణుగుల గంధం సమర్పిస్తారు. అనంతరం వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలలో మరో మూడేసి మణుగుల గంధం సమర్పిస్తారు. శ్రావణ పౌర్ణమినాడు కరాళ చందన అలకరణ జరుగుతుంది. ఏడాదికి 12మణుగుల గంధం స్వామివారికి సమర్పిస్తారు. ఇది సంప్రదాయం. దానితో పాటు పాత్తు వస్త్రాన్ని సమర్పిస్తారు.
ప్రతీ ఏడాది వైశాఖ బహుళ ఏకాదశినాడు గంధం చెక్కల అరగతీత మొదలుపెడ్తారు. ఈ చెక్కలను తిరుపొత్తూరు నుండి తెస్తారు.



Friday, May 6

వరాహావతారం


దశావతార సంప్రదాయంలో వరాహావతారం మూడోది. ఈ వరాహావతారానికి సంబంధించి ఒక పురాణగాధ ప్రచారంలో ఉంది. ఒకానొక సమయంలో సృష్టి చేయదలచిన బ్రహ్మ మానసికంగా మనువును సృష్టించి, సృష్టి సాగించాల్సిందిగా ఆదేశిస్తాడు. ఆ సమయంలో భూగోళం సమస్తం జలంతో మునిగి ఉండడంతో దానిపై సృష్టి ఏ విధంగా చేయాలని మనువు బ్రహ్మను అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ శ్రీమహావిష్ణువును ధ్యానిస్తాడు. నాసికా రంధ్రాల నుంచి యఙ్ఞ వరాహమూర్తి అంగుష్ట మాత్రా దేహంతో ఆవిర్భవించి క్షణాల్లో ఏనుగంత పెరిగాడు. బ్రహ్మ నిద్రావశుడై ఉన్న కాలంలో జలంలొ మునిగిన భూమిని ఉద్ధరించేందుకు రసతలానికి వెళ్తాడు. జలమధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురౌతాడు. ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. హిరణ్యాక్షుడు మాయా చక్రాన్ని ప్రయోగించగా, శ్రీహరి తన చక్రంతో ఆ మాయా చక్రాన్ని అడ్డుకొంటాడు. చివరకు వరాహమూర్తి ఆ రాక్షసుడిని కర్ణమూలాన్ని తన కోరలతో చేధించగా హిరణ్యాక్షుడు నెత్తురుకక్కుకొని మరణిస్తాడు. భూమిని ఉద్దరించాక వరాహానికి వైకుంఠం నుంచి భూలోకంలో అవతరించిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల కొండలలో చోటు చూపించాడని వరాహ, బ్రహ్మాండ పురాణాలు చెప్తున్నాయి.
పరమాత్ముడైన విష్ణుమూర్తి యఙ్ఞరూప ధరుడైన వరాహంగా తెల్లని దేహంతో అవతరించిన కల్పం కనుక శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. సకల సంపదలకు యఙ్ఞం అలవాలం గనుక పరమపురుషుడు యఙ్ఞమూర్తిగా అవతరించాడు. చైత్ర బహుళ త్రయోదశి నాడు యఙ్ఞవరాహావతార ఆవిర్భావం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి.

Thursday, May 5

కూర్మావతారం


ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాలని స్నేహపూర్వకంగా ఇస్తాడు. సహజంగానే గర్వము, అహంకారము ఉన్న ఇంద్రుడు ఆ మాలని వాహనమైన ఐరావతం కి వేసాడు. గజరాజు ఆ మాలని తన కాలిక్రింద వేసి తొక్కడంతో కోపోద్రేకుడైన మహర్షి, " దేవతల వద్దనున్న సిరిసంపదలు నశిస్తాయి " అని శాపం ఇస్తాడు. దేవతలందరు కలిసి విష్ణుదేవుని వద్ద మొరపెట్టుకోగా, మహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు " సముద్ర మదనం చేస్తే వచ్చిన నిధితో దేవలోకానికి ఎటువంటి కొరత ఉండదు. పైగా సాగర మదనం ద్వార వచ్చే అమృతంతో దేవతలు చిరంజీవులుగా, శక్తిమంతులుగా ఉంటారు, ఆ మదనానికి అసురుల సహాయం కోరండి" అని దేవేంద్రునితో చెప్తాడు. అమృతాన్ని అసురులకు కూడా పంచుతాము అని, అసురులకు చెప్పడం ద్వార, వారి సహాయంతో సాగరమదనానికి పూనుకొన్నారు.
మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకి ని తాడుగా చేసుకొని, వాసుకి తలవైపు సురులు, వెనుకవైపు అసురులు పట్టుకొని సాగరమదనం చేసారు. ఆ మహా పర్వతానికి ఆలంబనగా ఉం
టానికి ఏదైన తక్కువే, అంతటి భారాన్ని మోయడానికి సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కూర్మరూపం దాల్చి ఆలంబనగా నిలిచాడు. మదనంలో మొదటగా హలాహలం, లక్ష్మీ దేవి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము చివరకు అమృతము వచ్చాయి. మోహినీ అవతారంలో అమృతాన్ని అసురల బారినపడకుండా సురులుకి పంచుతాడు మాహావిష్ణువు.

కూర్మావతారంలో వెలసిన ఆ విష్ణుమూర్తి ని మనం "శ్రీకూర్మం (వైజాగ్)" లో దర్శించుకోవచ్చు.

Wednesday, May 4

మత్స్యావతారము

మత్స్యావతారము దశావతారములలో ప్రప్రథమ స్థానములో ఉన్నది. లోమ హర్షణుడు గొప్ప ఋషి. నైమిశారణ్యములో అగస్త్య మునికి “మత్స్య పురాణము”ను వివరించెను. 291 అధ్యాయములలో -14 వేల శ్లోకములు గా లోమహర్షణ వాక్కులు సంకలనముగా ఏర్పడినది. మత్స్య పురాణము ను “తామసిక పురాణము”గా పరిగ్రహింపబడుచున్నది. సత్య వ్రతుడు ప్రజా క్షేమము కొరకు పాటుపడే భక్తాగ్రగణ్యుడైన చక్రవర్తి. ఇతడే “వైవశ్వత మనువు”గా ప్రసిద్ధిగాంచెను.

అగ్ని పురాణములో ఈ గాథ ఉన్నది. కృతమాలా నదిలో స్నానము చేసి, సంధ్య వార్చునప్పుడు, సత్యవ్రతుని కమండలమునందు ఒక చిన్న చేప చేరినది. రాజు దానిని తిరిగి నదిలో విడువబోయాడు. కానీ ఆ మీనము “రాజా!నన్ను పెద్ద మత్స్యములు వెంటాడుచున్నవి. వాని నుండి నాకు రక్షణ అవసరము“ అనెను. ప్రభువు జాలి పడి “అట్లే!” అని దానిని భవనమునకు తెచ్చెను. చిత్రంగా అది ఒక్క రాత్రిలో ఎంతో పెరిగినది. అ చేపను పెద్ద గంగాళములోనికి మార్చ వలసి వచ్చినది.రోజు రోజుకూ అలాగ అది అపరిమితముగా వృద్ధి చెందుచునే ఉన్నది. తత్ఫలితముగా అద్దానిని, మడుగు , సరస్సు , చెరువు,కొట్ట కొసకు మహా సముద్రములోనికి మార్చుతూ, చేర్చారు.

“ఇది మామూలు ఝషము కాదు. కేవలము భగవానును అపర అవతారమే!” అని గ్రహించిన మహారాజు సత్యవ్రతుడు, అంజలి ఘటించి,అడిగాడు.”నేను మీ అవతార రహస్యమును తెలుసుకొనలేకున్న అజ్ఞానిని. మీ అవతార హేతువులను, లీలా విశేషములను బోధపరచ కోరుచున్నాను”

ఆ మీనము అన్నది “ నేటి నుండి ఏడవ దినమున ( సప్తమ = 7 )సృష్టి యావత్తు నాశనము అవబోతున్నది. అందు చేత ముందు జాగ్రత్త అక్కర కలిగినది. సృష్టి రక్షణ బాధ్యతా భారమును నీ భుజ స్కంధముల పైన వహింపవలయును.
తరు సంపద నిమిత్తము ముఖ్యమైన విత్తనములను, ప్రాణి కోటి యొక్క పునఃసృష్టి ఆరంభము కొఱకు జంతువులను సేకరించి, భద్రపరచుము.” ఆ ఆదేశములను శిరసావహించాడు సత్యవ్రతుడు.

ప్రకృతి విలయము సంభవించినది.ఆ బృహత్ మీనావతారము, తన వీపున ఒక పెద్ద నావను మోసుకొని వచ్చినది.అందులో సప్తర్షులు, సృష్టి కర్త ఐన బ్రహ్మ ,మున్నే తాను సేకరించిన బీజాది అనేక వస్తు సముదాయములతో రాజు అధిరోహించెను.

చేప కొమ్ముకు (చేప మొప్ప/ రెక్క)ఒక సర్పముతో పడవను కట్టాడు. వైవస్వంతుని పుత్రుడు సత్యవ్రతుడు ప్రళయ పయోధి జలముల నుండి సృష్టిని కాపాడి,నిలిపెను. సృష్ట్యాది నుండి అసంఖ్యాక మన్వంతర యుగములు గడచినవి. ఈనాడు మనము “వైవస్వంత మన్వంతర కాలము”లో ఉన్నాము. మహాభారతము లో అర్జునుడు భేదించిన “మత్స్య యంత్రము” సుప్రసిద్ధమైనదే కదా!

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం


1.షాడాననం చందనలేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం
రుద్రస్య సూనుం సురులోకనాధం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే


2.జాజ్వల్యమానం సురబృంద వందం కుమారధారాతట మందిరస్థం
కందర్పరూపం కమనీయగాత్రం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే

3.ద్విషడ్భుజం ద్వాదశ దివ్యనేత్రం త్రయీ తనుం శూలమశిందధానం
శేషావతారం కమనీయ రూపం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే

4.సురారిఘ్నోరాహవ శోభమానం సురోత్తమం శక్తిధరం కుమారం

సుధారశక్త్యాయుధ శోభిహస్తం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే


5.ఇష్టార్ద సిద్దిరద మీశపుత్రం మిష్టాన్నదం భూసుర కామధేనుం
గంగోద్భవం సర్వజనానుకూలం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే

ఫలశ్రుతి య: శ్లోక పంచకమిదం పఠేత్ భక్త్యా శ్రీసుబ్రహ్మణ్యదేవ వినివేశిత్త్ మానస: సంప్రాప్నోతి బోగమజ్రులం భువి యద్యాదిష్టం అంతే చ గచ్చతి ముదాగుహ సామ్యమేవ