Thursday, May 26

అష్ఠాదశ శక్తిపీఠాలు (2)


చాముండి
అమ్మవారి కురులు చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి పరమేశ్వరి, శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. "మహాబలాద్రి శిఖర" అనే కొండపై అమ్మవారు వెలిసారు కావున ఆ కొండ కాలక్రమములో చాముండికొండగా మారింది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.


జోగులాంబ

మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు. జోగులాంబ ఉగ్ర రూపంలో ఉంటుంది, చతుర్భుజి గా కపాలము, గొడ్డలి, ఖడ్గము, పాన పాత్ర ధరించి, శవమును ఆశనముగా కలిగి, ఎడమవైపు తల తిప్పి మోకాళ్ళపై కూర్చొనిఉన్న ఒక శిరస్సు పై తన వృష్టభాగాన్ని ఆనించి, అరికాలు కనపడేలా ఎడమపాదం నేలపై ఆనించి, కపాలమును యఙ్ఞోపవీతంగాను, ఐదు ఆకులవలె వేలాడుతున్న కటిసూత్రం ధరించి ఉంటుంది.

భ్రమరాంబిక
అమ్మవారి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు అమ్మవారు తుమ్మెదరూపంలో (భమరము అంటే తుమ్మెద) అవతరించిందట. మల్లికార్జునము అంటే తెల్లటి మల్లే పువ్వు. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

మహాలక్ష్మి
అలనాటి కరవీర ప్రాంతమే ఈనాటి కొల్హాపూర్‌. అమ్మవారి నేత్రాలు పడిన ప్రదేశము. పూణెకు 240 కి.మి దూరంలో ఉత్తరాన కొల్హాపూర్‌ మహాలక్ష్మి ఆలయం ఉంది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి కొల్హాసుర రాక్షస సంహారం అనంతరం ఈ కరవీరప్రాంతం కొల్హాపూర్‌గా రూపాంతరం చెందింది. హిందూ ఆలయాలు సహజంగా తూర్పు ఉత్తరదిశగా ఉంటాయి. కాని ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పడమరదిశగా ఉంటుంది. 'ఇక్కడ మరో ప్రత్యేకతేమిటంటే ఆలయంలో పశ్చిమాన ఒకచిన్న గవాక్షం ఉంది. సంవత్సరంలో మార్చి, సెప్టంబర్ నెలల్లో సూర్యాస్తమయ సమయంలో 3రోజులు సూర్య కిరణాలు ఈ కిటికీగుండా ప్రసరించి అమ్మవారి ముఖంపై ప్రకాశిస్తాయి. ఈ 3రోజులు 'కిరణోత్సవాలుగా జరుపు కుంటారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నాలుగు చేతులతో అమ్మవారి నల్లరాతి విగ్రహం మూడు అడుగుల ఎత్తున ఉంటుంది.దివ్యాభరణాలతో వెలిగిపోయే ఆ అమ్మని వర్ణించడం ఎవరితరమూ కాదు.

ఏకవీరాదేవి
అమ్మవారి కుడిచేయి పడినచోటు, మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రం. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు.
ఇంకో కధనం కూడా ఉంది :
జమదగ్ని ఆఙ్ఞచే, తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు పరశురాముడు. ఆ శిరస్సు రూపంలో ఉన్న మాయా శక్తే " ఏకవీర ", మిగిలిన రేణుకాదేవి శరీరం, భూదేవిగా పూజలు అందుకొంటోంది.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: