Saturday, July 21

ఉపనిషత్తుల గురించిన అతి కొద్ది సమాచారం

నాలుగు వేదాలలో కలిపి 1180 ఉపనిషత్తులున్నాయి. ఋగ్వేదంలో 21, యజుర్వేదంలో 109, సామవేదంలో 1000, అధర్వణవేదంలో 50. వీటిలో వేదవిద్యతో పాటు చాలా ఉపనిషత్తులు అంతరించాయి.(లభ్యం కావడంలేదు). అయితే శ్రీరాముడు హనుమంతునికి 108 ఉపనిషత్తులని మాత్రమే సంగ్రహించి ఉపదేశించినట్లు గ్రంధాలు బోధిస్తున్నాయి. అవి సంగ్రహించి చెప్పినవే గాని, మిగిలిన ఉపనిషత్తులు లేవని అర్ధంకాదు. ఆది శంకరులు, ఇతర ఆచార్యులు పదింటికి భాష్యం వ్రాశారు.

అవి : ఈస, కేన, కఠ, ప్రశ్న, మండక, మాండుక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. ఐతే వీటిని మాత్రమే వ్రాయడంలో మిగిలిన వాటిని వారు అంగీకరించలేదని అర్ధం కాదు. వీటి భాష్యసరళిని గమనించి, ఉపనిషత్తులను ఆవగాహన పరచుకోవచ్చని వారి ఉద్దేశం.

వేదములు (వేద శాఖలన్నీ) నాలుగు భాగాలుగా ఉంటాయి. అవి : సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్తు. నాలగవది వేదములకు చివర కనుక “వేదాంతం” అంటారు. అంతేకాక “చివరి మాట” అంటే “తీర్పు” అని అర్ధం. వేదముల తీర్పు అంటే పరమతాత్పర్యం - ఙ్ఞానం (ఆత్మఙ్ఞానం). డానిని ప్రస్ఫ్పుటముగా అందించే ఉపనిషత్తులను “వేదాంతం” అన్నారు.

ఉపనిషత్తులు బ్రహ్మ విద్యను బోధిస్తాయి. ఆత్మవిచారణగా కొన్ని, ఉపాసనగా కొన్ని, యోగపరంగా కొన్ని ఉపనిషత్తులున్నాయి. దీని అర్ధం, మూడింటి పరమార్ధం ఆత్మఙ్ఞానమేనని చెప్పడం.

ఆది శంకరులు పది ఉపనిషత్తులకే కాక శ్వేతాశ్వతర, నృసింహ తాపినీ ఉపనిషత్తులకు కూడా భాష్యం రచించారని కొందరు చెబుతారు. ఆ లెక్కలో ద్వాదశోపనిషత్తులు ప్రసిద్ధం
.
నాలుగు వేదాలలో ఎన్నో ఉపనిషత్తులున్నా, నాలుగు వేదాల నుండి నాలుగు ఉపనిషత్తులలోనూ, జీవ బ్రహ్మైక్యాన్ని చెప్పే నాలుగు మహా వాక్యాలను చెప్పారు.

అవి : 1. ప్రఙ్ఞానం బ్రహ్మ (ఋగ్వేదం, లక్షణ వాక్యం) 2. అహం బ్రహ్మాస్మి (యజుర్వేదం, స్వానుభవ వాక్యం) 3. తత్వమసి (సామవేదం, ఉపదేశవాక్యం) 4.ఆయమాత్మా బ్రహ్మ (అధర్వణవేదం, సాక్షాత్కార వాక్యం).

ఇవి గాక శ్రీరాముడు హనుమంతునకు 108 ఉపనిషత్తుల నుండీ 108 మహా వాక్యాలను ఉపదేశించినట్లు ఒక గాధ ఉంది. అవి కూడా లభ్యమవ్తున్నాయి. “మహావాక్య భాగ్యరత్నావళి” అని సమకూర్చారు.

అద్భుతమైన ఉపనిషద్విద్యను మనకు అందించడానికి మేధావులు చేసిన వివిధ ప్రయత్నాలివి. ఏదేమైనా, జీవ బ్రహ్మైక్యాన్ని తెలియచేసే మహావాక్యాలు నాలుగింటికి ఎక్కువ ప్రసిద్ధి.

Friday, July 20

కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు...

పూజ చేసాక, దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్దతి / ఆచారం. పూజ పూర్తి అయ్యాక, టెంకాయ కొట్టేసాం, నైవేద్యం పెట్టెసాం తంతు పూర్తి అయింది అని అనుకుంటారు (అనుకుంటాము). అంతా బాగనే ఉంది గాని, టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. అందేంటొ కాస్త తెలుసుకుందాం.
టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి....

1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.


2. కాయ కొట్టేటప్పుడు 9అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది


3. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది


4. టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు


5. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.

Wednesday, July 18

శ్రీ రాఘవేంద్రస్వామి


"పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే "

ఒకప్పుడు ‘మంచాల’ గ్రామంగా ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రాఘవేంద్రస్వామివారు బృందావన ప్రవేశం చేశారు. ఆ ప్రదేశమే మంత్రాలయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న ఈ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. శ్రీ రాఘవేంద్రస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించి ఓ పురాణగాథ ఒకటి ఉంది. శంఖు కర్ణుడనే పరిచారకుడు తర్వాత జన్మలో ప్రహ్లాదుడిగా జన్మించాడు.
తర్వాత జన్మలో వ్యాసరాయలుగా జన్మించి సన్యాశాస్రమాన్ని స్వీకరించి తన 93వ ఏట ‘హంపి’ క్షేత్రంలో సమాధి పొందాడు.

శంఖుకర్ణుడు మూడవ జన్మగా కాంచీపురం సమీపంలోగల భువనగిరి గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణ దంపతులైన తిమ్మనభట్టు, గోపమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1595లో మన్మధ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి వేంకటనాధుడని నామకరణం చేశారు. అతనే మన రాఘవేంద్రస్వామి. వెంకటనాధుడు చిన్నతనంలోనే శబ్దమంజరి వల్లించాడు. అష్టాదశ పురాణాలలోని విశేషార్చనలను అధ్యయనం చేశాడు. అనంతరం ధర్మప్రబోధానికి నడుంకట్టి తంజావూరులో తన గురువు సుదీంద్ర తీర్థులవద్ద 1623లో వేంకటనాధుడు సన్యాసం స్వీకరించాడు. గురువు ఆయనకు ‘వ్రణమంత్రం’ బోధించాడు. మూల రాములవారు స్వప్నంలో ఆదేశించిన విధంగా ‘శ్రీ రాఘవేంద్ర తీర్థ’ అని గురువు ఆయనకు నామకరణం చేశారు.

సన్యాసం స్వీకరించిన శ్రీ రాఘవేంద్రస్వామి లోక కళ్యాణానికి కృషిచేసి 1671 ఆగస్టులో ప్రహ్లాదుడు యజ్ఞం చేసిన తుంగభద్ర నదీ తీరంలో బృందావన ప్రవేశం చేశారు. ఒకప్పుడు ‘మంచాల’ గ్రామదేవతగా మంచాలమ్మవారు ఉండేవారు.

పూర్వం జమదగ్నిమహర్షి భార్య రేణుకాదేవి, మంచాల గ్రామంలో మంచాలమ్మగా వెలిశారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గురువుకు సిసలైన నిర్వచనంగా నిలిచిన శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయం సదా భక్తజన సందోహంతో దివ్యమైన లోకాన్ని తలపిస్తుంది. శ్రీరాఘవేంద్రస్వామి వారి బృందావనమే ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. ప్రాపంచిక విషయాలను సైతం పటాపంచలు చేసే ఈ బృందావన దర్శనంవల్ల సర్వదా శుభం జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

శ్రీ రాఘవేంద్రస్వామికి ఎదురుగా ఓ ఆలయంలో ఆంజనేయస్వామివారు కొలువయ్యారు. శ్రీరామభక్తుడైన ఆ స్వామి ఇక్కడ కొలువై ఉండడంవల్ల శ్రీరాఘవేంద్రస్వామివారి బృందావన క్షేత్రం మరింత మహిమాన్వితమైంది. శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంగా, విరాజిల్లుతున్న మఠానికి ముందు కుడివైపుభాగంలో మంచాలమ్మవారు ఆశీనులయ్యారు. లోపల ఆలయంలో పూర్వ మఠాధిపతుల సమాధులు (బృందావనాలు) కనిపిస్తాయి. మరోపక్క నాగేంద్రస్వామి, ముడుపుల చెట్టు దర్శనమిచ్చి పునీతుల్ని చేస్తుంది.

Tuesday, July 17

ఆది శంకరలు, భజగోవిందం (3)

21. పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం

ఇహ సంసారే బహుదుస్తారే

కృపయా పారే పాహి మురారే


పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది. మురారీ దయతో నన్ను రక్షించు.


పుట్టుక, మరణం, మరణం - పుట్టుక అంతర్గర్భితమై ఉన్నాయి. మనిషి వస్త్రాలను మార్చినట్లు, జీవాత్మ శరీరాలను మారుస్తుంది. అంటే జీవాత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరాన్ని ఆశ్రయించడం వల్ల జీవితం అనంతమైన యాత్ర అవుతోంది. మరణం కేవలం దీర్ఘనిద్ర మాత్రమే. కర్మవాసనలు జన్మజన్మలకు వెంటాడుతూ ఉంటాయి. జనన మరణ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది.


మనిషి జన్మ పాపపుణ్యాల మిశ్రమం. ఎన్ని జన్మలెత్తినా పరంధాముని దివ్యధామం చేరలేని జన్మవ్యర్ధం. వివేకం, విచక్షణలతో చిగురించిన వైరాగ్యాన్ని పెంచి, ఓ తండ్రీ! బ్రతుకు భారాన్ని మోయలేని నిస్సహాయుడిని. ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించే ఓపిక లేదు. పరంధామా! కరుణతో ఈ జన్మకి ముగింపు పలికి, నన్ను నీదరికి చేర్చుకో స్వామీ..! అని ఆర్తితో తపనతో ప్రతిక్షణం నివేదన చేస్తే తప్పక స్పందిస్తాడు పరమాత్మ.


22.రథ్యాకర్పట విరచిత కన్దః

పుణ్యాపుణ్య విసర్జిత పన్ధ:

యోగీ యోగ నియోజిత చిత్తో
రమతో చాలోన్మత్తవ దేవ

నిజమైన యోగి దొరికిన వస్త్రాల పీలికలతో బొంతను తయారుచేసుకుని, అది మాత్రమే ఉపయోగిస్తాడు. పుణ్యాపుణ్యాలను అధిగమించి మనసును పరిపూర్ణ యోగంలో నియమిస్తాడు. బ్రహ్మములో లీనం అయిన మహాత్ముని చిత్తం పసిపిల్లవాని, పిచ్చివాని మనసు వంటిది.

సర్వసంగ పరిత్యాగి అయిన యోగి నిత్యసంతోషి. ఏ విధమైన సుఖానుభూతులను యోగి మనసు కోరదు. తినటానికి తిండి కట్టుకునే బట్ట, తలదాసుకొను గూడు అందరికి అవసరమే. వీటికోసం మనిషి చాలా శ్రమిస్తాడు. కానీ యోగి ఏది దొరికితే అది, ఏది అందుబాటులో ఉంటే అదే అందుకొని తృప్తిపడతాడు. ఎందుకు? యోగి మనస్సు పాప పుణ్యాలను అధిగమించి ఉంటుంది. కారణం, మనస్సుని నియమించి, చిత్తాన్ని పరమాత్మపై ఉంచుతాడు.


‘దృష్టిం జ్ఞానమయం కృత్వా - పశ్యేద్ర్భహ్మమయం జగత్’ అని శృతి వాక్యం. అంటే దృష్టిని జ్ఞానమయం చేసుకటే సకల సృష్టి బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఆ స్థితి పసిబాలుని స్థితి. దివ్యజ్యోతి స్వరూపమైన విశ్వాత్మ ప్రకాశం దర్శించగలిగినప్పుడు అంతా ఆర్ణవమైన ఆనందమే. అహం శబ్దవాచ్యుడైన పరమాత్మే మనలోని ఆత్మ అని తెలిసి నిర్వికల్పానందం అనుభవించవచ్చు.


23.కస్త్వం కోహం కుత ఆయాతః

కామే జననీ కోమే తాతః

ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వంత్యక్త్యా స్వప్నవిచారమ్

నీవెవరు? నేనువరు? నేనెక్కడి నుండి వచ్చాను? నా తల్లిదండ్రులెవరు? బాహ్యేంద్రియాలకు అనుభవమయ్యే ఈ సకల ప్రపంచం కలలాంటిది కదా? అందుకే దీనిని నర్జించాలి.

నిజానికి ఈ ప్రపంచం ఒక ఇంద్రజాలం. కొన్నికొన్ని ప్రశ్నలకు సమాధనాలు దొరకవు. కొన్ని పరిస్థితుల్లో మనసులో అసాధారణమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నో జన్మల విషయవాసనలు మనస్సును, జన్మాంతరాల వరకు అంటిపెట్టుకునే ఉంటాయి. దేహం వశించినా వాసనలు నశించవు. అందుకే విషయ చింతనలు తగ్గించి విశ్వేశ్వర చింతన పెంచాలి. మనసు తత్త్వాన్ని అవగాహన చేసుకుంటే, అదుపు చేయడం సులభం. మనదైన శరీరం అశాశ్వతమవుతే జగత్తు మాత్రం అశాశ్వతం కాదా! కలకాదా! నిస్సారమైన కలలాంటి జగత్తుపై, శరీరంపై మమకారం పెంచుకోటం మూర్ఖత్వం. ‘ఆత్మవెళ్లిన దేహమగ్నిహోత్రుని పాలు - కఠిచ శల్యములన్ని గంగపాలు’ అన్నారు పెద్దలు. అందుకే మనలోకి మనమే పయనించి, పరమాత్ముని దర్శించి ధన్యత చెందాలి.

24.త్యయిమయి చాన్యత్రైకో విష్ణుః

వ్యర్ధం కుష్యసి మయ్య సహిష్ణుః
భవ సమచిత్రః సర్వత్రత్వం
వఛస్య చిరాద్యది విష్ణుత్వమ్

నీలో, నాలో, అంతటా ఉన్నది ఒక్కడే పరమాత్మ. నీ కోపతాపాలు ఎవరి మీద? నిజంగా నీవు పరమాత్మ దర్శనానికై తపించేట్లయితే సమభావన అలవరుచుకోవాలి.

మోక్షప్రాప్తికి సాధకుడు ఇంద్రియ నిగ్రహం తరువాత సాధించవలసింది సమభావన. స్థిరచిత్తులై, ఇష్ఠానిష్టాలకు, ఆగ్రహాగ్రవేశాలకు లొంగకూడదు. కోపంవల్ల మోహం, మోహంవల్ల లోభం, లోభం వల్ల బుద్ధినాశనం, ఆపై సర్వం నాశనమవుతుంది. ‘ఎన్ని సంవత్సరాల నుంచో పరమాత్మని సేవిస్తున్నానే, అయినా ముముక్షత్వం సిద్ధించట్లేదు’. అని ఆవేదన పడే ముందు, అనన్య చింతనతో పరమాత్మని సేవించానా? అన్యధా శరణం నాస్తి అని సర్వస్య శరణాగతి చేశానా? అని ఆలోచించాలి. చింతలలో రగులుతున్న మనస్సును ప్రశాంతపరచి, ఏకాగ్రం చేసి అప్పుడు శరణంటే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. జన్మజన్మల పుణ్యఫలంగా పరమాత్మ పాదాల చెంత స్థిరమైన భక్తి ఏర్పడుతుంది. సర్వత్ర సమచిత్తం సాధించి ముక్తిపొందవచ్చు.


25. శత్రౌమిత్రే పుత్రౌబంధౌ

మాకురు యత్నం విగ్రహసన్దౌ

సర్వస్మిన్నసి పశ్యాత్మానం

సర్వత్రో త్తృజ భౌధజ్ఞానమ్


శత్రువుతో, మిత్రునితో, పుత్రునితో, బంధువుతో శతృత్వం కానీ, మితృత్వం కానీ చేయాలని చూడరాదు. అందరిలో అంతటా పరమాత్మని దర్శించి అభేద బుద్ధిని వదలాలి.

మితృత్వం వల్ల దగ్గరితనం, శతృత్వం వల్ల అగాధం మనుషుల మధ్య ఏర్పడతాయి. ఈ రెండూ కూడా మోక్షసాధనకు ప్రతిబంధకాలు. చీకటి వెలుగుల్లా, జ్ఞానం - అజ్ఞానం జంటగానే ఉంటాయి. అజ్ఞానం వల్ల మాయకు లోబడితే అంతటా బేధ దృష్టే. సముద్రం, అల వేరు వేరు కానట్లే ఆత్మ, పరమాత్మ వేరు కాదను అభేద దృష్టి మోక్షకారకం. అండ పిండ బ్రహ్మాండమంతా పరమాత్మ చైతన్య శక్తిచే ఆవరించబడి ఉంటుందనే నిజాన్ని గ్రహించిన నాడు, ఆలోచనలు అదుపులో కొచ్చి, సర్వం సమం అనే సమదృష్టి ఏర్పడుతుంది. అంతటా, అన్నిట్లో పరమాత్మే గోచరిస్తాడు. అప్పుడు అనుభవించే ఆత్మానందానికి అవధులు ఉండవు.


26. కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం పశ్యతి సోహం

ఆత్మజ్ఞాన విహీనా మూఢా
స్తేపచ్యన్తే నరక నిగూఢా

కామ, క్రోధ, లోభ, మోహ గుణాలను విసర్జించి, పరమాత్మే నాలోని ఆత్మ అనే సమభావం కలిగితే ఆత్మదర్శనం సులభ సాధ్యం. అజ్ఞానులు మూఢులై, ఆత్మజ్ఞానం లేక నరకంలో పడి బాధలు అనుభవిస్తారు.

అరిషడ్వర్గాలు ఆరు. కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు మనిషికి శతృవులు. ఈ ఆరింటికి మూలం మనస్సు. మనస్సును సత్యమార్గంలో పెడితే పొందే ఫలితం అమోఘం. అంతఃశ్శతృవులైన అరిషడ్వర్గాలలో మనస్సుతో కామాన్ని, బుద్ధితో క్రోధాన్ని, చిత్తంతో లోభాన్ని, సోహం భావనతో మోహాన్ని అణచివేయాలి. అప్పుడు మధ, మాత్సర్యాలు మాయమై సమదర్శకత్వం సమకూరుతుంది. జన్మతః జీవుడు నిర్మలుడే. ప్రారబ్ధ కర్మ ఫలితంగా కర్మల నాచరించి, మాయావరణలో చిక్కుకుని, సంసార లంపటంలో బంధింపబడుతున్నాడు. ఏ కొంచెం వివేకంతో ఆలోచించగలిగినా మాయావరణను ఛేదించి, ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి సాధన చేసి, సాధించి, ముక్తి పొందాలి.

27. గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపసమజస్తం

నేయం సజ్జనసంగే చిత్తం
దేయం దీనజనాయచ విత్తం

భగవద్గీతా నామ సహస్రం గానం చెయ్యాలి. ఎల్లప్పుడు నారాయణుని ధ్యానం చెయ్యలి. మనస్సును సదా సత్సంగత్యంలో నడిపించాలి. దానం చేయాలి.
సర్పోపనిషత్సారమైన గీతాగానం పుష్టిని, తుష్టిని ఇస్తుంది. అట్లాగే నారాయణుని రూపధ్యానం జీవాత్మను, పరమాత్మగా రూపాంతరం చెందిస్తుంది. సజ్జన సాంగత్యం మనిషిలో మాన్వత్వాన్ని ద్విగుణికృతం చేసి దైవత్వానికి దగ్గరగా తీసుకెళుతుంది. దీనికి తోడుగా దీనజన సేవ చేసిన మరింత అద్వైత భావన ప్రబలమై, ముక్తిమార్గం సులభమౌతుంది.

కలియుగంలో మోక్షసాధనకి సులభమార్గంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు ప్రసాదించిన అద్భుతవరం గీతాశాస్త్రం. సాధకునికి అవసరమైన సూచనలన్నీ, ఈ గ్రంథంలో సూక్ష్మీకరించబడి, సులభంగా వివరించబడ్డాయి. అందుకే గీతని నిత్యం పారాయణ చేయడం వల్ల, మనోచిత్తాలు శుద్ధమై, నిస్సంకల్ప మౌతాయి. మనసంతా నారాయణుని రూపం నిండి, నిరంతరం అసంకల్పిత ధ్యానం కొనసాగుతుంది. ఆ స్థితిలో మనసెప్పుడూ, మంచి వారితో స్నేహం చేయాలని, మంచి మాటలు వినాలని మంచి పనులు చేయాలని పరుగులు తీస్తుంటుంది. ఎప్పుడైతే సజ్జనమైత్రి లభిస్తుందో, అప్పుడే మనలోని మానవత్వం జాగృతమై, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, దీనులపై దయచూపించాలని, ఆర్తులను ఆదుకోవాలని, దీనులపై దయచూపించాలని, ఆర్తులను ఆదరించాలనే సత్సంకల్పం కలిగి మనల్ని దైవత్వం వైపు నడిపిస్తుంది.


28. సుఖతః క్రియతే రామా భోగం

పశ్చాద్ధస్త శరీరా రోగః

యద్యపి లోకే మరణం శరణం
తదపిన ముంచ తి పాపాచరణమ్

సుఖం కోరి భోగాలలో తేలతారు. అది రోగాలకు దారితీస్తుంది. జీవితంలో చివరికి మరణమే శరణం. అయినా మనిషి పాపాలు చేయడం వదిలిపెట్టడు.

జరిగిపోయిన చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అయినా మనిషి మాయకు లోబడి సుఖ భోగాలకు దాసుడై పతనమవుతున్నాడు. ఇంద్రియ లోలత్వం మనిషిని ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది. తుఛ్ఛమైన ఐహిక వాంఛలు తీర్చుకోవడానికి రేయింబవళ్ళు శ్రమపడే మనిషికి చివరికి మిగిలేదేం ఉండదు. అశాశ్వతమైన భోగాలకి సమయాన్ని శరీరాన్ని వెచ్చించి, చివరికి వ్యాధిగ్రస్తమై మరణించవలసిందే. మనిషి పశువులా కాక మనిషిలా బ్రతికి, పరిమితికి లోబడి, ధర్మానుసారం సుభానుభవాన్ని పొందినా, ధర్మ బద్ధమైన, నీతివంతమైన, ఆదర్శవంతమైన జీవనం ఎన్నుకున్నవారే అంతంలో అనంతుని పొందగలరు.


29. అర్ధవనర్ధం భావయ నిత్య

నాస్తి తతస్సుఖ లేశస్సత్యం

పుత్యాదపి ధన భాజా భీతిః

సర్వత్రేషా విహితా రీతిః

అన్ని అనర్ధాలకు మూలకారణం ధనం. ధనంలో లేశమాత్రం సుఖం లేదన్నది సత్యం. ధనమున్నవారికి పుత్రులవల్ల కూడా భయం కలుగుతుంది. ఇది లోక విహితం. డబ్బు పుష్కలంగా సంపాదిస్తాం. అహంకరిస్తాం. పోయేనాడది వెంట వస్తుందా! పరస్పర సంబంధాలు పెంచుకుని ఆధునిక కాలంలో మనిషి కార్యాచరణకై పరిగెత్తుతూ అది దగ్గర సంబంధాలను కూడా కేవలం ధనం కోసమన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. అది మనస్సులను కలుషితం చేస్తుంది.

ధనం విలువ తెలిసిననాడు, తాను సంపాదించాననే గర్వంతో కాకుండా, తనుకున్నదంతా భగవత్ప్రసాదంగా భావించి, కొంచెం దానం, ధర్మం చేస్తేనే పుణ్యం, పురుషార్ధం. ఇహంలో జీవితం సుఖమయంగా గడపడానికి డబ్బు సంపాదించాలి. తప్పదు. కానీ అది మితిమీరకూడదు. మరి పరానికి ఏం సంపద కూడబెట్టాలి? ఆధ్యాత్మిక సంపద, దైవతత్వ సంపద. ఈ సంపదకి హద్దులేదు. ప్రశాంతమైన జీవితానికై డబ్బు సంపాదించినా, సుఖశాంతులు శరీరం ఉన్నంత వరకే అని గ్రహించగలిగితే జన్మ ధన్యమే. కడుపున పుట్టిన పిల్లలే నాకేమిస్తావు? సంపాదించినదంతా ఏం చేశావు? అని ప్రశ్నించిన రోజుకంటె దౌర్భాగ్యకరమైన రోజు జీవితంలో ఇంకొకటి లేదు. అందుకే అర్ధాన్ని వదిలి సర్వత్రా గోవిందుని భజించి ముక్తికి మార్గం సుగమం చేసుకోవాలి.

30. ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారం
జాప్యసమేత సమాధి విధానం

ప్రాణాయామం చేసి ప్రత్యాహారం పాటించాలి. నిత్యానిత్య విచారణతో, జపతపాలు ఆచరించాలి. మనస్సుని సమాధి స్థితిలో నిలపాలి. వీటికి జాగ్రత్త, ఏకాగ్రత, చెక్కు చెదరని మనసు ముఖ్యం.. శరీరంలో ప్రాణగతిని అదుపులో ఉంచటమే పాణాయామం. ప్రాణాయామానికి చిత్తం ఏకాగ్రమనాలి. మనస్సు నిశ్చలమనాలి. సాధన వల్ల మాత్రమే ఇవి సాధ్యం. అసంకల్పితంగా మనిషిలో జరిగే చర్యలలో ఊపిరి తీయటం ఒకటి. సాధనతో ఊపిరిని అదుపు చేయాలి. సంకల్ప రహితమైన మనస్సుతో చిత్తాన్ని ఏకాగ్రం చేసి ప్రాణాయామ, ప్రత్యాహారాలు పాటించటమే తపస్సై, సమాధి సిద్ధిస్తుంది. సమాధి స్థితిలో సర్వేంద్రియాలు చిత్తంతో లయమై, ఆత్మానందం అనుభవమవుతుంది. ఇదే జీవిత లక్ష్యమైన వాని జన్మ ధన్యం.

Sunday, July 15

ఆది శంకరలు, భజగోవిందం (2)

11. మాకురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం
మాయామయమిద మఖిలం హిత్వా

బ్రహ్మపరం త్వం ప్రవిశ విదిత్వా


నీకు ధనముంది. నీవారున్నారు. యౌవనంలో ఉన్నానని గర్వపడకు. ఇవన్నీ కాలగతిలో హరించిపోతాయి. అంతా మాయయే. అందుకే బ్రహ్మపదాన్ని పొంది తరించు.
డబ్బు ఉంటే చాలు ఎన్ని ఆనందాలైనా అందుకోవచ్చు అనే తలంపు కేవలం మూర్ఖత్వమే. ధనబలం కాక జనబలం ఉన్నదని మిడిసిపడకూడదు. యౌవన బలగర్వం అసలు ఉండకూడదు. ఈ దృశ్య ప్రపంచం పరిణామశీలం. ప్రపంచవాసనల భ్రాంతిలో బ్రతకటం వ్యర్ధం. సర్వ ప్రపంచం అంతటా పరమాత్మ యొక్క చైతన్య తేజస్సు వ్యర్ధం. సర్వ ప్రపంచం అంతటా పరమాత్మ యొక్క చైతన్య తేజస్సు నిండి ఉందనే గ్రహింపు కలగాలి. అప్పుడే బ్రహ్మపదం చేరాలనే తపన మొదలై, అదే తపస్సవుతుంది. పరమాత్మ ప్రసాదితమైన ఈ శరీరం, శరీరంలోని అణువణువు, ఆయన కైంకర్యానికై వినియోగించడం మన కర్తవ్యం. ఆ నిత్య సాధనే శాశ్వతానందాన్నిచ్చే బ్రహ్మపదానికి చేరుస్తుంది.

12. దినయామిన్యౌ సాయంప్రాతః
శిశిర వసన్తే పునరా యాతః

కాలః క్రీడతిగచ్ఛ త్యాయుః

తదపినముంచ త్యాశా వాయుః


పగలు రాత్రి, ఉదయం అస్తమయం, శిశిరం వసంతం వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. కాలం ఆటలాడుతుంటే, జీవితం జీర్ణించి పోతుంటుంది. అది తెలిసినా మనిషి ఆశను వదలలేకపోతున్నాడు.


కాలం అనంతం. కాల పరిభ్రమణంలో మనందరం కేవలం కాలం యాత్రికులం. ఎన్ని జన్మలు గడిచాయో, ఇంకెన్ని జన్మలు గడవాలో చెప్పలేం. అనంతం. కాల పరిభ్రమణంలో మనం నీటిబొట్లం. ప్రస్తుత జీవితకాలం క్షణభంగురం. అది అందరికీ తెలుసు. అయినా మనలోని ఆశ ఆకాశమంత. అదే మాయ. ఆ మాయకు లోబడి కర్త, కర్మ అన్నీ మనమే నన్న అహంకారం మనల్ని ముంచేస్తుంది. ఈ జన్మలో మనం అనుభవించే సుఖదుఃఖాలు ప్రారబ్ధ కర్మానుభవాలు. అందుకే తప్పనిసరైన కర్మలను అనుభవిస్తూనే జన్మరాహిత్యానికై ప్రయత్నం చేయాలి. వివేకం, విచక్షణ చేయగల మనస్సు మనకు పరమాత్మ ప్రసాదించిన వరం.. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకుని, దైవసాన్నిధ్యాన్ని కాక, దైవంలో ఐక్యం కావటానికి కృషిచేయాలి. అప్పుడే చరించగలం.

13. కాతే కాన్తా ధనగత చిన్తా

వాతుల కింతపనాస్తి నియన్తా

త్రిజగతి సజ్జన సంగతి రేకా
భవతి భవార్ణవ తరణే నౌకా


కాంతా కనకాల కోసం ఎందుకు విలపించడం. ధర్మాన్ని రక్షించి, పాలించే నియంత లేడనుకున్నావా! మూడు లోకాల్లోనూ సజ్జన సాంగత్య మొకటే భవసాగరాన్ని దాటించే నావ.

పరమాత్మ మనిషికి మనస్సు. బుద్ధి ఎందుకిచ్చాడు? తానెవరో తెలిసికోవడానికి, కాని మనిషి అవివేకంతో, బలహీనమైన మనోబుద్ధులతో ధనదారాసుతుల కోసం చింతిస్తూ, శ్రమిస్తూ బ్రతుకును, కాలాన్ని వ్యర్ధం చేసుకుంటున్నాడు. జగత్తు, జగత్తులోని జీవులు అంతా అశాశ్వతమని తెలిసినా, మాయామోహాంధకారంలో మునిగిన మనిషి తప్పుదారి పడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో విచక్షణతో ఏమాత్రం ఆలోచించగలిగినా మనిషిని మంచి మార్గానికి మళ్ళించగలిగేది సజ్జన సాంగత్యం. సాధు సత్పురుషుల సేవ మనిషిలో మంచిని పెంచి, దైవీ గుణాలను వెలికి తెస్తుంది. ఈ సంసారం ఒక సాగరం. ఎన్ని జన్మలెత్తినా, సంసారం అనే సముద్రంలో అవధి కనిపించక, పరిధీ తెలియక జీవుడు తపించ వలసిందే. అందుకే సంసార జలధిని దాటడానికి సజ్జనుడనే నౌక కావాలి. ఆ సజ్జనుడే సద్గురువై మన చేయి పట్టి ముక్తివైపు నడిపిస్తాడు


14. జటిలో ముండీలుంచిత కేశః

కాషాయాంబర బహుకృత వేషః

పశ్యన్నపిచ నపశ్యతి మూఢోః

హ్యదర నిమిత్తో బహుకృత వేషః


జడలు ధరించి, గుండు గీయించుకుని, జుట్టు విప్పుకుని, కాషాయబట్టలు ధరించి, ఎందరో తిరుగుతుంటారు. వారు కేవలం పొట్టకూటికోసం వేషాలు ధరించినవారు.


నిజానికి సన్యాసమనేది మోక్షసాధనే, కానీ సన్యసించటం అంటే అందరినీ విడిచి వెళ్ళటం కాదు. అందరిమీద ఉన్న మమకారం జయించడం. బాహ్యానికి సర్వసంగపరిత్యాగిలా కనపడినా అంతరంగంలో పరిత్యాగభావన లేకపోతే ప్రయోజనం లేదు. మనోవాక్కాయ కర్మలా, త్రికరణ శుద్ధిగా సన్యాస జీవితం గడపాలి. కామక్రోధాదులను నిగ్రహించినవాడే నిజమైన సన్యాసి. చక్షురేంద్రియాలను నియంత్రించగలిగిన వాడే నిజమైన సన్యాసి. ఆత్మనాత్మ వివేకంతో, సత్యాసత్య విచక్షణతో పరిపూర్ణమైన వైరాగ్యం సాధించినవాడే నిజమైన సన్యాసి. బాహ్యవేషాడంబరాల కన్నా, అంతరంగ పరిణతి, అంతర్యాగ నిరతి ముఖ్యం. సన్యసించకుండానే, సంసారంలో ఉంటూనే, ధర్మనిరతితో ధన్యులైన మహాపురుషులు ఎందరో!


15. అంగం గళితం ఫలితం ముండం
దశన విహీనం జాతం తుండమ్

వృద్ధోయాతి గృహీత్వా దండం

తదపిన ముంచ త్యాశాపిండమ్

శరీరం శిష్కించింది. తల నెరసిపోయింది. పళ్ళు ఊడిపోయాయి. ముసలితనం పైబడింది. మూడో కాలుగా కర్ర వచ్చింది. కానీ కోరికలు మాత్రం వదలడం లేదు. బాల్య, యౌవన, కౌమార దశలను వృధాగా గడిపి వృద్ధాప్యంలో శక్తి ఉడిగి, చింతించే వారెందరో! ఆ దశలో ఆశలు చెలరేగితే ఇంద్రియాలు ఏవీ సహకరించవు. సత్సంగం, సద్గ్రంధ పఠనం , సదాచారం పాటించడం వల్ల దానథర్మ నిరతుడై, నిత్యా నిత్య వివేక జ్ఞానం కలుగుతుంది. ఇంకా వయసెంతో ఉంది. దైవచింతనకి, బ్రహ్మానందానుభవానికి చాలా సమయముంది. అని భావించడం నిజమైన అజ్ఞానం. పరమాత్మ కూడా శాసించలేనికి కాలం మాత్రమే. మరుక్షణం ఏం జరుగబోతోంది అనేది మానవ మేథస్సుకు అతీతం. కాలానికి అవిశ్రాంతమైన పయనం. అందుకే సమయం సానుకూలంగా ఉండగానే సదుపయోగం చేసుకుని, ఆధ్యాత్మిక పరిణతికై సాధన చేయడం ధర్మం.


16. అగ్రేవహ్నిః పృష్టేభానూ

రాత్రౌచుబుక సమర్పిత జానుః
కరతల భిక్షిస్తరుతలవాస
స్తదపిన ముంచత్యాశా పాశః

అగ్నిముందు కూర్చున్నా, సూర్యుని వేడికి నిలబడినా, చలికి ముడుచుకుని పడుకొని, భిక్షమెత్తుకుని, చెట్టుకింద నివశిస్తున్నా మనిషిలో ఆశ చావదు. ప్రతివాడూ ఆనందంగా బతకాలనుకోవడం సహజం. కానీ ఆ ఆనందతత్త్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడు. ప్రయత్నించడం కూడా ఎంతో కష్టమనుకుంటాడు. కోరికలు ఆకాశాన్నంటుతాయి. ఆ కోరికలు తీరడానికి మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి వాడికి పరమాత్మ సాక్షాత్కారం ఎట్లా లభిస్తుంది? అందుకే శరీరంలో పటుత్వం ఉండగానే సాధన చేయాలి. మనస్సుని మెల్లమెల్లగా కోరికల వలయం నుండి తప్పించి, అద్భుతమైన ఆత్మానందాన్ని అనుభవించేలా సాధన చెయ్యాలి. మనస్సులో కలిగే సంకల్పాలే కోరికలకి పునాదులు. ఆ పునాదుల్లో కూరుకుని పోకుండా ఉండాలంటే ముందు మనస్సు సంకల్పరహితం కావాలి. సంకల్పరహితం కావాలంటే, మనస్సును ప్రలోభపెట్టే ఆలోచనలని, ఆశలని నిగ్రహించాలి. ఇది సాధకుని సాధనలో మొదటి మెట్టు.

17. కురుతే గంగా సాగర గమనం

వ్రతపరిపాలన మథవాదానం
జ్ఞాన విహీనః సర్వమతేన
ముక్తిం నభజతి జన్మశతేన

మనిషి గంగలో మునిగినా, వ్రతాలు, దానధర్మాలు చేసినా, జ్ఞానం పొందకుండా ఎన్ని జన్మలెత్తినా ముక్తిపొందలేడు. ఆత్మ స్వయం ప్రకాశం. ఆత్మ జ్ఞానంలోనే పరమశాంతి ఉంది. ప్రకాశించే సూర్యుని మేఘం మూసేసినట్లు, ఆత్మని అజ్ఞానం అంతంచేసి, జ్ఞానం పొందాలంటే ఎంతో సాధన అవసరం. ముందు బాహ్యేంద్రియాలను, ఆపై అంతరింద్రియాలను కట్టుదిట్టం చేసి, మనోచిత్తాలను లయం చేసి, భగవద్ధర్శనాభిలాషతో చేసే సాధన చాలా ముఖ్యం. శాస్త్రాలు చదివినంత మాత్రాన జన్మరాహిత్యం దొరకదు. స్వధర్మాచరణతో, బంధవిముక్తుడై విరక్తుడై చేసే సాధన తప్పక మోక్షాన్నిస్తుంది.

18. సురమందిర తరుమూల నివాసః

శయ్యాభూతల మజినం వాసః
సర్వపరిగ్రహ భోగత్యాగం

కన్య సుఖం నకరోతి విరాగః

దేవాలయాలు దర్శించి, చెట్ల కింద నివశించి, మృగచర్మాన్ని చుట్తుకుని, నేలమీద పడుకున్నంత మాత్రాన వైరాగ్యం కలుగదు. భోగాలను త్యజించి, సర్వం త్యాగం చేస్తే, వైరాగ్యం ఎందుకు కలుగదు.

19. యోగ రతేవా భోగరతేవా

సంగర తోవా సంగ విహీనః

యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి వందత్యేవ

యోగాన్ని అనుష్టించవచ్చు. భోగాలను అనుభవించవచ్చు. జనుల మధ్య నివశింపవచ్చు. లేదా ఏకాంతంగా ఉండనూ వచ్చు. ఇన్ని చేసినా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ బ్రహ్మలో లీనం అయి ఉంటుందో వారే ఆనందమయులు.

ఆనందమే తానైన ఆత్మ జ్ఞానికి సర్వం శివమయం. ఆత్మవిష్ణుని దృష్టి ఎల్లవేళలా పరమాత్మపైన ఉంటుంది. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమని నిర్వహించినవాడు అంతా అద్వైత ఆనందమే. అప్పుడే బహిరంతరాలలో పవిత్రత ఏర్పడుతుంది. పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. పవిత్రమైన మనస్సే పరమేశ్వరునికి ఆలయమై, జీవదేవ భ్రాంతి నశించి జన్మరాహిత్యం పొందవచ్చు.


20. భగవద్గీతా కించిదధీతా
గంగాజల లవకణికాపీతా
సకృదపిమేన మురారి సమర్చా
క్రియతే తస్యయ మేనన చర్చా

భగవద్గీతను కొంచెమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కైనా త్రాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా ఎవరు పూజిస్తారో, వారికి యమునితో వివాదమే ఉండదు.


భగవద్గీత పరమ పవిత్రమైనది. సాక్షాత్ పరమాత్మ వాక్కు. మోక్షగామి అయిన మనిషి ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? తరించే మార్గమేది? వివరంగా చెప్పబడింది. మానవాళి మనుగడపై మహితాత్ముడైన పురుషోత్తమునికున్న ఆదరణ భగవద్గీత తెలుపుతోంది. గీతాపారాయణం మనిషిలో అజ్ఞానం దూరం చేసి స్థితప్రజ్ఞుని చేస్తుంది. లోకపావని గంగ, ధాత్రిని పవిత్రం చేస్తుంది. గంగ ఒడ్డునే వేదం పుట్టిందంటారు. నిత్యం వేద మంత్రోచ్ఛారణ జరుగుతుంటుంది. ఎందరో మహాత్ములు తపస్సు చేసి తరించారు. అటువంటి నిర్మలజలం ఒక్క చుక్క మన నోట పడినా చాలు జన్మ ధన్యం. నిత్యం మురాంతకుడైన మురళీధరుని పూజించాలి. మోక్ష ప్రదాత అయిన పరమాత్మని స్తుతించడం మనిషి ధర్మం. స్తుతులకు లొంగని వారుంటారా?


అందులో కరుణాళుడైన పరమాత్మ! అయితే పూజలు కానీ, స్తుతులు కానీ అనన్య చింతనతో చేయాలి. అప్పుడే జీవాత్మ అవ్యయుడై, అద్వైత భావన ప్రబలమై మృత్యుభయం వీడి తరిస్తుంది.

Friday, July 13

ఆది శంకరలు, భజగోవిందం (1)

సాక్షాత్ ఆది శంకర స్వరూపులు, ఆదిశంకరులు కారణజన్ములు. మానవజన్మ దుర్లభం. కానీ అవిద్య కారణంగా మోహాపాశాలతో, బంధనాలతో, ఉత్తమమైన జన్మని వ్యర్ధం చేసుకుంటున్నాడు మానవుడు. మన జన్మాంతర పుణ్య విశేశంగా, మానవాళికి ముక్తిమార్గాన్ని నిర్దేశిస్తూ, ఎన్నో స్త్రోత్రాలు, వేదాల సారాన్నంతా సంక్షిప్తపరుస్తూ, ప్రభోదాత్మకమైన ఉపదేశ గ్రంధాలు, ఆధ్యాత్మిక తత్త్వాన్ని వివరిస్తూ వ్రాసి మానవాళికి మహోపకారం చేశారు శ్రీ శంకరులు.

మానవ జన్మ నెత్తిన ప్రతి జీవిలో అంతర్గతంగా ప్రకాశించేది సచ్చిదానందమయుని తేజం, అదే ఆత్మచైతన్య పరమాత్మ. పరమాత్మని అన్వేషించడానికి మూడు మార్గాలు నిర్దేశించాయి వేదాలు. అవే భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలు. ఈ మూడు మార్గాల్లో, ఏదైనా ఒకదానిలో ప్రయాణించి, పరమాత్మని చేరుకోవాలనుకునే సాధకుడు ముందుగా సాధించవలసింది మనో నిర్మలత, నిశ్చలత, బుద్ధి శుద్దత, స్థిరత. స్థితప్రజ్ఞత్వం సాధించి కైవల్య సోపానాలను దాటి, దేవదేవునిలో లీనం కావాలంటే, జన్మరాహిత్యాన్ని పొందాలంటే ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి? అని స్పష్టంగా ప్రబోధాత్మకంగా ‘భజగోవిందం’ శ్లోకాల్లో వివరించారు ఆదిశంకరులు. అంతేకాదు మానవ జన్మయొక్క విలక్షణత్వం వివరిస్తూ, జన్మాంతర పుణ్యఫలంగా లభించిన జన్మని వ్యర్దం చేసుకోవద్దని, ఆత్మతత్వావగాహనపై మనసు నిలిపి, సాధించి తరించమని ఉద్భోదించారు.

‘భజగోవిందమ్’ శ్లోకాల్లో ‘12 శ్లోకాలు మాత్రమే శ్రీ శంకరుల రచన అనీ, మిగిలినవి వారి ఆదేశంతో శిష్యులు వ్రాసినవనీ అంటారు. భజగోవిందం శ్లోకాలని అంతా కాకపోయినా, కొంతయినా అర్ధం చేసుకుంటే ధన్యులం

1. భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే, కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే

ఓ ముర్ఖుడా! గోవిందుని భజింపుము, మరణకాలము ఆసన్నమైనపుడు, ఏ వ్యాకరణ సూత్రాలూ రక్షింపవు.

మరణమనేది పుట్టిన ప్రతి జీవికి అనివార్యం. జన్మ, జరా, మరణాలు అందరూ అనుభవించవలసినదే. ఈషణత్రయానికి లోబడిన మనిషి, తాను, తనవారు తనవి అన్నీ శాశ్వతమనే నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరణం తర్వాత మనతో ఏదీ రాదనే సత్యం అందరికీ తెలుసు. క్షణం సేపు ఈ విషయాన్ని మనసులో గుర్తుకు చేసుకున్నా, మరుక్షణం మాయకు లోబడి, నేను, నాది అనే బంధానికి బద్ధుడౌతున్నాడు. మనిషిగా పుట్టినందుకు, పరమాత్మకు కృతజ్ఞులమై, మరణ సమయంలో, భగవన్నామ స్మరణతో కన్నుమూస్తే జన్మ ధన్యం.

2. మూడ జహేహి ధనాగమ తృష్ణాం
కురు సుద్భుద్ధిం మనసి వితృష్ణాం
యల్లభసే నిజకర్మొపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం

మూఢుడా ! ధనార్జనకు జీవితకాలాన్ని వ్యర్ధం చేయకు. ధనం అగ్నితో సమానం. ఎంతవర్కు ప్రాప్తమో అంతవకేనని సంతృప్తిపడి, ఆర్జించిన ధనంతో పుణ్యకార్యాలు నిర్వహించు..

జీవజాలంలో మనిషే ఉత్తముడు. అందుకే సద్భుద్ధి అలవరచుకోవాలి. బాహ్య శరీర శుద్ధి కాదు ముఖ్యం. అంతఃశుద్ధి తప్పించి, పరమాత్మవైపు పరుగులు తీయించాలి. మాయలో పుట్టి మాయలో పెరిగినా, ఆ మాయని దాటటమే మనిషి కర్తవ్యం. డబ్బు సంపాదించాలి, కానీ మితిమీరిన ఆశతో అదే ధ్యేయంగా బతకకూడదు. ఆర్జించిన ధనం కొంతవరకైనా ధర్మ కార్యనిర్వహణకు వెచ్చిస్తే పొందే సంతృప్తి వర్ణించలేము. ఈ ఆనందాన్నిచ్చే దైవాన్ని మరచిపోరాదు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో భగవదార్పణగా చేస్తే లభించే ఫలితం అమోఘం. నిత్యం అవసానకాలంలో కూడా మనోచిత్తాలు పరమాత్మ నామస్మరణలో లీనమై ఉంటాయి. జన్మ చరితార్ధమవుతుంది

3.నళినీ దళగత జలమతి తరళం
తద్వత్ జీవిత మతిశయ చపలం
విద్ది వ్యాద్యభిమాగగ్రస్థం
లోకం శోకహతంచ సమస్తమ్ || భ||

తామరాకు మీద నీటి బొట్టు నిలవదు. అట్లాగే ఈ జీవితం కూడా క్షణికం. జీవితం చంచలం. ప్రపంచం రోగాలతో, అభిమానాలతో, శోకాలతో నిండి ఉంది.
తామరాకు మీద నీటి బొట్టు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. కానీ ఏ కొద్దిపాటి గాలి వీచినా జారిపోతుంది. మానవుని జీవితం అంతే. అనంతమైన కాలంలో మనిషి జీవితకాలం క్షణం. ఆ క్షణమాత్రానికే అహంకార మమకారాలతో మనిషి, మహిషియై పతనమవటం ఎంతవరకు సమంజసం. ఒక్క క్షణం ఆలోచించి, కాలం విలువ గ్రహిస్తే, పరతత్త్వ విచారణతో బ్రతుకు ధన్యమవుతుంది. ఈ లోకం శోకమయం. నశ్వరమైన శరీరం రోగాలకు నిలయం. సంసారం విషవలయం. బ్రతుకు భారం నుండి బయటపడాలంటే రోజులో కొద్ది సమయమైనా దైవచింతనకై వెచ్చించి, పుణ్యాత్ములమై, ధన్యాత్ములమై, దైవానుగ్రహం పొంది తరించాలి. ఇదే శ్రీ శంకరుల ఆదేశం.

4. నారీస్తన భర నాభి నివేశం
దృష్ట్యామాగా మోహావేశం
ఏ తన్మాంస వసాది వికారం
మనసి విచిన్తయ వారం వారమ్ ||భ||

యువతుల స్తనభారమును, నాభి ప్రదేశాన్ని చూసి మోహావేశాలకు లోనుకావద్దు. ఆ అందమంతా కేవలం మాంస నిర్మితం. తాత్కాలికం.
పై పై అంశాలు చూసి భ్రమపడకూడాదు. వికారాలకు లోనుకాగూడదు. ఆత్మ సౌందర్యాన్ని దర్శించగలగాలి. అందానికే అందం, ఆ అంతర్యామి సౌందర్యం. అలైకికమైన ఆనందాన్నిచ్చే, ఆ అద్భుతమైన అందాన్ని ఆరాధించి, అనంతాత్మకుడైన పరమాత్మే, మనలోని ఆత్మ అని తెలిసుకోవాలి. అవ్యక్తుడైన అనంతునిలో లీనమయే క్షణం కోసం ఎదురుచూడాలి. దేహం అశాశ్వతమని తెలుసు. బాహ్య సౌందర్యం అనిశ్చితమని తెలుసు. ఈ రోజు ఉన్నాం. రేపేమౌతామో అనే ఆలోచిస్తాం. కానీ మరుక్షణం మాయకు లోబడి వ్యామోహానికి బానిసలమై, సత్యాన్ని విస్మరిస్తున్నాం. అదే వద్దంటున్నారు భగవత్పాదులు. వారి ఉద్భోధను అర్ధం చేసుకుని ఆచరించటం మన కర్తవ్యం.

ఈ ప్రభోదం కేవలం పురుషులకే కాదు, స్త్రీలకు వర్తించేట్లు తెలుపారు శ్రీ శంకరులు,

5. యావద్విత్తోపార్జన సక్తః
యావన్ని జ పరివారోరక్తః
పశ్చాజ్జీవిత జర్జర దేహే
వార్తాకోపి సపృఛ్ఛతిగేహే ||భ||

నీవు ధనాన్ని ఆర్జించినంతకాలం నీ వారనుకున్న వారందరు అడుగులకు మడుగులొత్తుతారు. వృద్ధాప్యంలో, శరీరంలో శక్తి తగ్గినప్పుడు ఇంట్లో వాళ్ళే నిన్ను నిందిస్తారు.

ఉత్తమోత్తమమైన మానవజన్మ సార్ధకం చేసుకోవటం మనిషి బాధ్యత. శరీరంలో శక్తి ఉన్నప్పుడే ధ్యాన అనుష్టానాలతో పరతత్త్వాన్ని తెలుసుకోవాలి. సద్గురువు నాశ్రయించి, కాలాన్ని సత్యాన్వేషణకై వెచ్చించాలి. ఆధ్యాత్మిక సంపద నార్జించి, బ్రహ్మతత్త్వావగాహనకై గోవిందుని చరణాల నాశ్రయించాలి. బెల్లం కొద్దీ చీమలు అనే నానుడి అక్షర సత్యం. ధనం మూలం ఇదం జగత్.. అన్నట్లు మన దగ్గర డబ్బు దండిగా ఉన్నప్పుడు అందరూ నందిమాగధులే చుట్టూ చేరి భజించేవారే. ఆ డబ్బే లేకపోతే అందరికీ లోకువే. మనవారనుకున్న వారి నిర్లక్ష్యం, నిరసన అనుభవించి, ఆవేదన పడటం అవసరమా? సత్యాసత్య వివేక జ్ఞానంతో, విచక్షణతో నిత్యుడు, సత్యుడైన సర్వాంతర్యామిని మనసా వాచా కర్మణా కొలిస్తే అంతా శాంతే. సర్వం ప్రశాంతతే.

6. యావత్ పవనో నివసతి దేహే
తావత్ పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయో దేహాపాయే
భార్యాభిభ్యతి తస్మిన్ కాయే || భ||

ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నీ వారనుకున్న వారు కుశలం అడుగుతారు. ప్రాణంపోయిన శరీరాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది.

మరణానంతరం మనిషి శరీరం ఎందుకూ పనికిరాదు. ఈ విషయంలో మనిషి కంటే పశుపక్ష్యాదులే ఎంతో గొప్పవి. వాటి మృత దేహాలు ఏదో విధంగా మనిషికి ఉపయోగపడుతున్నాయి. పంజరం లోంచి పక్షి ఎగిరిపోయే పంజరం ఎందుకు? దేహం లోంచి ప్రాణం పక్షి లాగా ఎగిరిపోతే మృత దేహం ఎవరికీ అక్కరలేదు. ప్రాణం పోయిన మరుక్షణం మనవాళ్ళే మృత దేహాన్ని, అదే శరీరాన్ని ఎప్పుడెప్పుడు బయటపడేద్దామా అని చూస్తారు. ప్రాణం ఉన్నప్పుడు అపురూపంగా, ముద్దుగా చూసిన వారే ప్రాణం లేని కట్టెని కాల్చేస్తారు. అందుకే ఆత్మజ్యోతిని వెలిగించి, సర్వేంద్రియాలను సంగమించి, తురీయానం దానుభూతిని పొంది ముక్తిని కాదు, జీవన్ముక్తిని సాధించమంటున్నారు ఆదిశంకరులు.

7. బాలస్తావత్ క్రీడాపక్తః తరుణస్తావత్
తరుణీ సక్తః వృధ్దాస్తావత్
చిన్తాసక్తః
పరే బ్రహ్మణికో పినకస్తః ||భ||

బాల్యం అంతా ఆటపాటలతో గడిచిపోతుంది. యౌవనం ఇంద్రియ విషయం లోలత్వంతో గడిచిపోతుంది. వృద్ధాప్యం చింతలతో చిక్కుకుని పోతుంది. అందుకే పరంబ్రహ్మపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

ప్రయాణానికి ఒక గమ్యం ఉన్నట్లే, జీవన యానానికీ ఒక గమ్యం తప్పనిసరిగా ఉండాలి. ఆ గమ్యం పరమాత్మ దర్శనం, స్పర్శనం కావాలి. లేదా ముక్తి కావాలి. అందుకే విలువైన ఆయువును వృధా కానీక, మహితాత్ముల అడుగు జాడలలో నడచి ఆత్మ దర్శన భాగ్యాన్ని పొందాలి. దర్మయుక్తంగా చతుర్విధ ఆశ్రమ ధర్మాలను పాటించి కైవల్యాన్ని సాధించాలి.
అతి తక్కువైన వయస్సులో చిన్నతనం ఆటపాటలతో గడిచిపోతే , యుక్త వయస్సులో చినతనం ఆటపాటలతో గడిచిపోతే, యుక్త వయస్సు సంసార బంధంలో తల మునకలయిపోతుంది. ముసలితనం చింతలకు నిలయమై, చితిని చేరుస్తుంది. అందుకే ఆశ్రమ ధర్మాలను పరిమితంగా, యుక్తి యుక్తమ్గా నిర్వహిస్తే మనస్సు, చిత్తం ఎల్లవేళలా పరమత్మకు కైంకర్యం అవుతాయి. నియమితం కాని అతి మనిషిని చాంచల్యానికి గురిచేస్తుంది. ఆ స్థితిలో పరబ్రహ్మైక్యం ఎట్లా సాధ్యం!

8. కాతే కాన్తా కస్తే పుత్రః
సంసారో యమ తీవ విచిత్రః
కష్యత్వం కః కుత ఆయాతః
తత్వం చిన్తయ తదిహభ్రాతః ||భ||

నీ భార్య ఎవరు? పుత్రులెవరు? బహు చిత్రమైనది ఈ సంసారం. నీ వెవరివాడవు? ఎక్కడి నుండి వచ్చావు. సోదరా! తత్వచింతన చేయి,.

ఈ సంసారం ఒక ఘోర జనారణ్యమ్. మాయా ప్రపంచం శాశ్వతమని భ్రమసి మనిషి నా భార్య, నా పిల్లలు అని పాకులాడతారు. ఇవన్నీ అశాశ్వతం. ఆత్మ ఒక్కటే శాశ్వతం. అది పురాతనం, అమరం. ‘ఋణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయః అన్నట్లు భార్య, పుత్రులు, బంధువులు అందరూ మనతో ఋణానుబంధంగా ముడిపడి ఉంటారు. జన్మతః పవిత్రుడు, జ్ఞాని అయిన జీవి, కాలంతో పాటు పెరిగి పెద్దవాడైన కొద్దీ మాయకు లోబడి, అజ్ఞానంలో, తాను శాశ్వతుడని తననుభవించే ఆనందాలు శాశ్వతమనీ, భ్రమపడి, విలువైన కాలాన్ని పరమాత్మ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అందుకే ఎల్లప్పుడూ గోవిందుని భజించి తరించమని హెచ్చరిస్తున్నారు శ్రీ శంకరులు.

9. సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలత్వం
నిశ్చలతత్త్వై జీవన్ముక్తిః

సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది.
భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభించింది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.

ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.

10. వయసి గతేకః కామ వికారః
శుష్కే నీరేకః కాసారః
క్రీణే విత్తేకః పరివారో
జ్ఞాతే తత్త్వైకః సంసారః

వయస్సుడిగితే వ్యామోహమెక్కడుంటుంది! నీరు ఇంకితే చెరువు ఎక్కడుంటుంది! సిరిసంపదలు పోతే బంధువర్గం ఎక్కడ? తత్త్వజ్ఞానం సిద్ధించిన మోహానికి గురై దారి తప్పుతుంది. ఈ పరిస్థితికి కారణం వయసు. వయసు కలలాంటిది. చెరువులో నీరుంటే కప్పలు మొదలైన జీవాలు పుష్కలంగా చేరతాయి. ఆ నీరు ఇంకిపోతే ఏవీ ఉండవు. నిజం చెప్పాలంటే ఈ శరీరం ఒక్ చెరువు. ప్రాణంపోతే దేహమే ఉండదు. అందుకని, వయస్సుని సద్వినియోగం చేసుకుని, నిరంతరం భగవన్నామస్మరణ చేయాలి. ఐహిక సంపద సంచలనం, ఆ ధనం ఉన్నంతవరకే మనవారని జనం చుట్టూ చేరతారు. ఆ ధనమే పోతే ఎవరూ మిగలరు. అదే ఆధ్యాత్మిక సంపదైతే, పోగొట్టుకుంటామేమోనన్న భయమే ఉండదు. పవిత్రత, ఆధ్యాత్మికత్వం మన సంపదౌతే అన్నీ ఆనందాలే.

Monday, July 9

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి

“చిన్న పిలకాయల్ని అడిగినా చెప్తారు ఎల ప్లాన్ చేసుకోవాలో, పార్టి ఎక్కడ ఇస్తే బాగుంటుందో, ఏ హోటల్ లో భోజనం చేస్తే బాగుంటుందో” అనేది టక్కున వచ్చే సమాధానం. కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యుతను చెడగొడుతోందో తెలుస్తోంది.

వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది.

పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు.

మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం

ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి. ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది.

ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయి
ఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి

లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి

అంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిది
కేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??

ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు.

పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే.

ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి

చిరంజీవీ యధా త్వం భో భవిష్యామి మహామునే
రూపనాన్ విత్తవాంశ్చైవ శ్రియాయుక్తశ్చ సర్వదా
మార్కండేయ నమస్తేస్తు సప్తకల్పాంత జీవన
ఆయురారోగ్య సిద్ధ్యర్ధం ప్రసీద భగవన్మునే
చిరంజీవీ యధాత్వంతు మునీనాం ప్రవరో ద్విజ
కురుష్వ మునిశార్దూల తధా మాం చిరంజీవినం
మార్కండేయ, మహాభాగ, సప్తకల్పాంత జీవనః
ఆయురారోగ్య సిద్ధ్యర్ధం ఆస్మాకం వరదోభవ

ఈ శ్లోకాలను పుట్టినరోజు ఎవరిదైతే వారు చదవాలి. ఈ క్రింది షష్టీదేవి శ్లోకం పిల్లలచే చదివించడం మంచిది

జయదేవి జగన్మాతః జగదానంద కారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టదేవతే
త్రైలోక్యేయాని భూతాని స్థావరాణి చరాణిచ
బ్రహ్మ విష్ణు శివైస్సార్ధం రక్షాం కుర్వంతు తానిమే

ఈ శ్లోకాలతోపాటు చదువవలసినవి

అశ్వత్ధామా బలిః వ్యాసః హనుమాంశ్చ విభీషణః
కృపః పరుశురామశ్చ సప్తైతే చిరంజీవనః
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ మధాష్టమం
జీవేద్వర్ష శతం ప్రాఙ్ఞః అపమృత్యు వివర్జితః
పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి.

“షష్టిపూర్తి” ఉత్సవాలు

ఇంతేకాక శాంతి కమలాకరంలో షష్టి ఆబ్ది పూర్తి వంటి విశేష దినాలో చేయాల్సిన తంతు చెప్ప బడినది.

జన్మత ష్షష్టమే వర్షే మృత్యు రుగ్ర రధానృణాం
దశభిస్త్వధికే తస్మిన్ మృత్యుర్భీమరధో నృణాం
విజయాఖ్యా రధోమృత్యుః అష్టసప్తతిమే భవేత్

59 దాటి 60వ సంవత్సరం రాగానే “ఉగ్రరధ” శాంతి, 70వ ఏట “భీమరధ” శాంతి, 78వ ఏట “విజయరధ” శాంతి, 83వ ఏట “శతాభిషేకం”, వంద సంవత్సరాలు నిండాక పూర్ణ శతాభిషేకం చేసుకోవాలి.

చిన్నవారందరు వారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది.

మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..

నిత్యాన్నదాతా తరుణోగ్ని హోత్రీ
మాసోపవాసీ చ పతివ్రతాచః
వేదాంతవిత్ చంద్ర సహస్ర దర్శీ
షడ్జీవలోకే మమ వందనీయాః

“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట.

విషయ సేకరణ : ఋషిపీఠం

Tuesday, July 3

గురు వందనం

"వ్యత్యస్తపాణినా కార్యముప సంగ్రహణం గురోః
సవ్యేన సవ్యః స్ప్రష్టవ్యో దక్షిణేన చ దక్షిణః"


గురువులకు పాధాభివందనం చేసేటప్పుడు కుడి, ఎడమచేతులను వ్యత్యస్త చేయాలి. అనగా కుడి చేతితో ఎడమ పాదమును, ఎడమ చేతితో కుడి పాదమును తాకుతూ, నుదురును గురుపాదములందలి బొటన వ్రేళ్ళకు తగిలేట్లుగా శిరోనమఃస్కారము చేయాలి. ఇలా చేయడము వలన గురువుగారికి - గురుపత్ని కి ఏకకాలంలో నమస్కారం చేసిన ఫలితం కల్గుతుంది