Saturday, April 30

ఊర్ధ్వ పుండ్రములు ( తిరునామాలు )


" వెంకన్న " పేరు వింటేనే తెలియరాని ఆనందానుభూతి, ఆ దివ్య మంగళ రూపాన్ని ఒక్కసారి కనులార దర్శించే భాగ్యం కలిగించు స్వామి అని వేడుకొంటాం. ఎదైనా శుభకార్యం మొదలు పెట్టేముందు మరియు తిరుమల దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వత " పిండి దీపారాధన " చేయడం మనకు పరిపాటి. వెంకన్న కి అలంకరించే తిరునామాల గురించి తెలుసుకొందాం.

విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త, సాక్షాత్తూ ఆదిశేషుని అంశతో జన్మించిన భగవద్ శ్రీ రామానుజాచార్యులు వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వ పుండ్రములు అలంకరించారు. ఇప్పటికీ శ్రీనివాసుని నొసట ప్రతీ శుక్రవారం నాడు అభిషేకం తరువాత 16 తులాల పచ్చకర్పూరం, 1 1/2 తులాల కస్తూరితో ఈ తిరునామాలు అలంకరించబడుతాయి. బ్రహ్మోత్సవ సమయాలలో మాత్రం శ్రీనివాసుని ఊర్ధ్వపుండ్రములలో పచ్చకర్పూరం, కస్తూరి రెట్టింపుగా వినియోగిస్తారు. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనవి బ్రహ్మోత్సవాలు.

10రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారం నాడు, మధ్యలో వచ్చే శుక్రవారం రోజు, తిరిగి ముగింపు శుక్రవారం రోజు, ఇలా 3 లేదా 4 శుక్రవారములలో శ్రీవారి ఊర్ధ్వపుండ్రముల అలంకరణలో 32తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరి వినియోగించబడుతుంది. ఈ శుక్రవారములను ఆలయ సంప్రదాయాలలో రెట్టింపు శుక్రవారాలని, రెట్టవారాలని వ్యవహరిస్తారు. ఈ శుక్రవారాలలో స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని గాంచిన వారికి మరో జన్మ ఉండదు.

మానవుడు సహజముగా తమోగుణప్రధానుడు. తమోగుణము ముఖ వర్ణముచే సూచించబడినది. తమోగుణమును నశింపచేసుకుని సత్వగుణప్రధానులు కావలెను. ఈ సత్వగుణమును సూచించబడేవే తెల్లటి తిరునామాలు. సత్వగుణసంపన్నుడు మాత్రమేకాక రజోగుణసంపన్నుడు కూడా కావలెననెడి భావము అరుణ వర్ణము కలిగిన శ్రీ చూర్ణము వెల్లడించుచున్నది. ధీమహిధియోయోనః ప్రచోదయాత్ అను గాయత్రీ మంత్రార్ధమును ఊర్ధ్వపుండ్ర ధారణము సూచించును. ఇందులో అర్ధము, నాయందుండి నన్ను సత్కర్మలకు ప్రేరేపింపుము, నన్ను వ్యసనముల యందు పడనీయక సన్మార్గమున నడిపించమని అర్ధము.

శ్రీరామానుజుల వారిచే అలంకరించబడిన తిరుమణి తిరుచూర్ణములతో కూడిన ఊర్ధ్వపుండ్రములను తన దివ్య ముఖారవిందమున ధరించిన శ్రీనివాసుని దివ్యమంగళ రూపాన్ని ఒక్కసరి మనస్సులో దర్శించండి....

ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద ...

Wednesday, April 27

నవదుర్గలు

వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తులశక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు
దుర్గ అమ్మవారు తన ప్రతిరూపాలుగా మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ని సృష్టించారు. మరల మహాసరస్వతి ,మహాలక్ష్మి, మహాకాళి తిరిగి తమ ప్రతిరూపాలను సృష్టించుకొన్నారు.మొత్తంఈ రూపాలన్ని కల్సి నవదుర్గలుగా మన చేత పూజలు అందుకొంటున్నారు.
నవదుర్గలు : శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్దదాత్రి.



శైలపుత్రి :
శైలుడి {పర్వతరాజు} కుమార్తె. ఆమెకే సతీ భవాని, హిమవంతుడి (హిమాలయాలకు రాజు) కూతురు హిమవతి, పార్వతి అను పేర్లు కూడా ఉన్నాయి. నవదుర్గలలో మొదటి రూపం
శైలపుత్రి. ఎడమ చేతిలో కమలము, కుడి చేతిలొ త్రిశూలధారణియై. ఎద్దుని వాహనంగా కలిగిఉంటారు అమ్మవారు.





బ్రహ్మచారిణి
కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలము కలిగిఉంటుంది. ఙ్ఞానం కలిగించే గొప్ప శక్తి కల దివ్య రూపం. తనను ఆరాధించే భక్తుల పైన ప్రేమ తో పాటు వారికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మోక్షం పొందటానికి బ్రహ్మచారిణి ఆరాధన ప్రధానమైనది.





చంద్రఘంట :
తన సిరస్సు పై అర్ధచంద్రుడిని ఘంటాకారముగా కలిగి ఉండటం వలన ఈమెను చంద్రఘంట అంటారు. పది చేతులతో, పది రకాలైన ఆయుధములతో { జపమాల, ఘంట, బాణం, పద్మం, ఖడ్గం,కమండలం, త్రిశూలం, ధనస్సు, గద, కమలం }, మూడు నేత్రములతో అమ్మవారి రూపం కొలువు తీరి ఉంటుంది. సింవాహినియై తాను దైర్యసాహసాలకు ప్రతీకగా
ఉంటుంది.





కూష్మాండ :
సంస్కృతం లో కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్ధం. ఈ అమ్మవారికి నివేదించే కూరగాయలలో గుమ్మడికాయ ముఖ్యమైనది. అమ్మవారిని శాంతింపచేయడంలో పెట్టే నైవేద్యంలో కూష్మాండం ప్రధానమైనది అందుకే ఈ అమ్మను కూష్మాండదుర్గ అని అంటారు. కు = చిన్నదైన, ఉష్మ = ఉష్ణము, అండ = బ్రహ్మాండము. 8 చేతులతో అష్టభుజిగా ఉండి, కమండలము, ధనస్సు, బాణము, తామర, గడ, చక్రము, మట్టిముంత, 8వ చేతిలో జపమాల ధరించి ఉంటుంది.




స్కందమాత :
దేవ సేనాపతి ఐన సుబ్రహ్మణ్యస్వామి { కార్తికేయుని } తల్లి. ఈమె 4చేతులు, 3కన్నులు కలిగి, సుబ్రహ్మణ్యస్వామిని తన కుడి పైచేయి మీద కూర్చొపెట్టుకొని ఉంటుంది. మరొక చేతిలో కమలమును, ఎడమ చేయి వరములను ప్రసాదించే ముద్రలోను, 4వ చేతితో కమలమును పట్టుకొని ఉంటుంది. మంచి వర్చస్సుతో కూడిన ముఖము కలదై, పద్మాసనిగా కూడ అమ్మవారిని వర్ణిస్తారు.




కాత్యాయని:
కాత్యాయని సాక్షాత్తు గాయత్రీఅమ్మవారి స్వరూపం. ఈమె వింధ్యాచల నివాసిని. కాత్యాయని ఉపసన వలన భయాలు దూరమవుతాయి. తామరపువ్వు, ఖడ్గము, అభయ హస్తములతోటి అమ్మవారు కొలువై వుంటారు.







కాళరాత్రి :
రాత్రి చీకటిలా నల్లటి వర్ణంతో, జలపాతల వంటి కురులు కలిగి ఉంటుంది. ప్రకాశవంతమైన వెలుగు కల మాలతో, నిప్పులు గక్కె త్రినేత్రధారియై, గార్దభ వాహినిగా, చతుర్భుజి గా, కుడి వైపున ఒక చేయి వరప్రసాదినిగా, రెండవ చేయి అభయంగా, ఎడమవైపు పొడవుగా ఉండే పదునైన కత్తితో, మరో చేతిలో కొడవలితో దర్శనం ఇస్తుంది.






మహాగౌరి :
తెల్లటి ఆభరణాలతో, తెల్లటి శరీరఛాయ కలిగి, చతుర్భుజి, వృషభవాహినిగా ఉంటుంది. త్రిశూలము, ఢమరుకము, అభయము, వరప్రసాద హస్తములతో దర్శనం ఇస్తుంది.









సిద్ధదాత్రి :
మార్కండేయ పురానంలో అష్ట సిద్దుల గురించి వివరించారు. అవి అణిమా సిద్ధి, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకమ్య, ఇషిత్వ, వషిత్వ సిద్దులు. ఈ అష్టసిద్దులను ప్రసాదించేది సిద్ధదాత్రి. దేవీభాగవత పురాణంలో చెప్పినట్లు, సిద్ధదాత్రి అనుగ్రహం వలనే పరమశివుడు సిద్ధులను సాధించాడు. ఆమె అనుగ్రహం వలనే అర్ధనారీశ్వర రూపం పొందాడు.

Monday, April 25

శనిత్రయోదశి

ఈనెల 30 న శనిత్రయోదశి. ఈరోజు శనీశ్వరునకు తైలాభిషేకము (నువ్వుల నూనె తో) చేయడం వలన జాతకములో శనిదశ ,అంతర్దశలలో శని సంచారములతోను చికాకులు పడుతున్నవారికి దోషములు పరిహారమవుతాయని శాస్త్రవచనము. అలాగే ఈరోజు శివునకు రుద్రాభిషేకము తో పూజలు జరిపించటము వలన జీవితములో కష్టాలు ఎదుర్కొంటున్న వారు వాటిని తొలగించుకోగల శక్తి పొందుతారు. ప్రత్యేకముగా ప్రదోషకాలములో శివార్చన అనంతశుభాలను ప్రసాదిస్తుందని పురాణాదులు తెలుపుతున్నాయి. కనుక శివారాధన చాల ముఖ్యము.

ఈరోజు ఉపవాసం ఉండటం మంచిది. { పెద్దవారు /ఉపవాసం చేయలేని వారు మాత్రం బలవంతంగా చేయొద్దు }. రాత్రి 8 తర్వత భోజనం చేయాలి. సాద్యమైనంత వరకు శివనామస్మరణ చేస్తూఉండాలి. మద్యం / మాంసాహారం తీసుకోకూడదు. ఎవరివద్దనుండి ఇనుము, నువ్వులు, నువ్వుల నూనె, ఉప్పు చేతితో తీసుకోకూడదు. వారిని కిందపెట్టమని అప్పుడు మీరు తీసుకోండి. { మామూలు రోజులలో కూడ ఉప్పు ని వేరొకరి చేతినుండి అందుకోకూడదు }

Saturday, April 23

ఆంజనేయ పంచరత్నం

వీతాఖిల విషమేచ్ఛంజాతా - నందాశ్రుపుంక మత్యచ్చం
సీతాపతి దూత్యాద్యంవాతా - త్మజ మద్యభావయేహృద్యం
తరుణారుణముఖకమలం - కరుణారసపూరపూరితాపాంగం
సంజీవన మాశాసేమంజుల - మహిమాన మంజుసూనుం
శంబరవైరి శరాతిగ - మంబుజదళవిపుల లోచనోదారం
కంబుగళమనిలదిష్టం - బింబజ్వలితోష్ఠమేకమవలంబే
దూరీకృతసీతార్తిః - ప్రకటీకృతరామవైభవస్పూర్తిః
వానరనికరాధ్యక్షం దానవకుల - నికర కుముదరవికర
సదృశం దీనజనావనదీక్షం పవనతపః - పాకపుంజమద్రాక్షం

ఫలశ్రుతి :
ఏతత్పవన సుతస్యస్తోత్రం - యః పఠతి పంచరత్నాఖ్యం చిరమిహనిఖిలాన్ భోగాన్ - భుక్త్వా శ్రీరామభక్తిమాన్ భవతి

Friday, April 22

శ్రీ దేవీపంచరత్న స్తోత్రం

శ్రీ దేవి పంచరత్నస్తోత్రం

ప్రాతస్స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృధులమౌక్తికశోభినాసం
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాడ్యాం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశం

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రత్నాంగుళీయల సదంగుళిపల్లవాఢ్యాం
మాణిక్య హేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషుసృణీన్ దధానాం

ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం
పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవద్యాం
విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాజ్మనసో తిదూరాం

పాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి

ఇతి శ్రీ దేవీపంచరత్న స్తోత్రం

వెంకటేశ్వర వజ్రకవచం

మార్కండేయ ఉవాచః

నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతుమే హరిః
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయకృత వేంకటేశ్వర వజ్రకవచం







తులసి ప్రాముఖ్యం

మన ఇళ్ళలో ముఖద్వారానికి ఎదురుగా పెరటిలో తులసి కోటని పెట్టుకొంటాం. ప్రతీరోజు తులసమ్మ కి పూజ చేసి నైవెద్యం పెడ్తాము.తులసి మాత చాలా పవిత్రమైనది. శ్రీమన్నారాయణునికి చాల ప్రియమైన శ్రీ మహాలక్ష్మియే తులసి. తులసిని పూజించి నమస్కరించినచో సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మీశ్రీమన్నారాయణులను పూజించినట్లే.

యన్మూలే సర్వతీర్ధాని, యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీంత్వాం నమామ్యహం
తులసి యొక్క మొదలునందు సర్వ తీర్ధములు, మధ్య భాగమున సర్వ దేవతలు, అగ్ర భాగమున వేదాలు ఉన్నదైవస్వరూపంగా భావిస్తారు. ఇంతేగాక తులసి అగ్రభాగమున సాక్షాత్తూ బ్రహ్మదేవుడు, మధ్యభాగమున శ్రీ మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడును, శాఖలలో అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నైరుతి, ఈశానుడు నివసిస్తారు. అంతేగాక గాయత్రీ, లక్ష్మీ, సరస్వతి, శచీదేవుల నివాసరూపం "తులసి రూపం".

శ్రీమన్నారాయణుడికి అతంత్య ప్రీతికరమైనది తులసి కావునే ప్రతీ నిత్యం అన్ని అర్చనా కార్యక్రమాలలో తులసి ప్రధానముగా ఉంటుంది. ప్రతీరోజు శ్రీవారి అష్టోత్తర నామర్చన ప్రారంభానికి ముందు అర్చకస్వామి వారు శ్రీవారి అష్టోత్తర శతనామార్చనమున సంకల్పించి "ఓం వేంకటేశాయనమః" అని వరాహ పురాణమునందలి అష్టోత్తర శతనామాలను పఠించుచూ ప్రతీ నామం చివర తులసి దళములను భక్తితో శ్రీవారి పాదపద్మల వద్ద ఉంచుతారు.
"తిరుమలవాసా గోవిందా, తులసి వనమాల గోవిందా,
గోవిందాహరి గోవిందా, గోకుల నందన గోవిందా.. "


ప్రాతః కాలమున పురుషులు మాత్రమే తులసీ దళములను కుడిచేతితో కోయవలెను. 3దళాలకు మించి ఎవరూ కోయరాదు. ద్వాదశి, శ్రవణా నక్షత్రములందును, అమావాస్యా, పౌర్ణమి తిధులందును, మంగళ, శుక్ర వారాలయందును, మధ్యాహ్న, సాయంత్ర, రాత్రి వేళల్లో తులసి దళాలను కోయరాదు. గ్రహణసమయమునందు, నిషిద్ధ సమయములందు పవిత్రమైన తులసి పత్రములు కోయరాదు. అవసాన దశయందు తులసి తీర్ధమును నోటిలో పోయుట మోక్షప్రాప్తికి నిదర్శనమని పెద్దల ప్రవచనము.

బృందా బృందావని, విశ్వపూజితా విశ్వపావనా,
పుష్ప సారా నందినీచ, తులసీ కృష్ణ జీవనీ
ఏతన్నా మాష్టకం చైవ స్తోత్రం నామార్ధ సం యుతం
యః పఠేత్ తాంచ సంపూజ్య సోశ్వ మేధ ఫలం లభేత్

తులసీ, బృంద, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందినీ తులసి, కృష్ణ సేవితా అను తులసీ నామాష్టకమును భక్తితో పఠించిన వారికి అశ్వమేధ యాగ మోనర్చిన ఫలము దక్కును.

Thursday, April 21

శివారాధన

శివారాధనను భక్తులు తమకు ఇష్టమైన రీతిలో వివిధరకాలుగా చేస్తారు. ఈ విధంగానే చేయాలి అనే నియమము లేదు. అందులో ఎటువంటి తప్పు లేదు. శివుడు భక్తవశంకరుడు. భక్తులు ఏ విధంగా పిలిచినా, ఆరాదించినా పలుకుతాడు. శివపంచాక్షరిని జపానుష్టాను పద్దతి ద్వార చేయుట మొదటి పద్దతి. మహన్యాస విధానం ద్వార చేయుట రెండవ పద్దతి. రుద్రాభిషేకము ద్వార శివారాధన చేయుట మూడవ పద్దతి.

పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. శివపంచాక్షరీ మంత్రము 5 కోణములు కల నక్షత్రముగా వర్ణించబడినది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటిరకము కాగా, భోగభాగ్యములు ఇచ్చు మంత్రము రెండవరకము. పంచాక్షరిలోని 5 అక్షరములునూ వాటి వాటి తత్వములను సాధన చేయువారికి 5 రంగులలో 5 తత్వములు దర్శనమిచ్చును. 1. తెల్లటి ముత్యము వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము 2. పగడము వంటి అరుణకాంతి. 3. పసుపుపచ్చని బంగారుకంతి 4. నీలవర్ణములలో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి 5. శుద్ధధవళ కాంతి. భ్రూమద్యములో 5 రంగుల జ్యోతి ప్రకాశించుటచే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా చెప్పినారు.
విష్ణువు కు సహస్రనామమనిన ప్రీతి, గణపతికి మోదకములన్న ప్రీతి, సూర్యభగవానునికి నమస్కారములంటె ఇష్టము, చంద్రుడికి ఆర్ఘ్యం ప్రీతి, అగ్ని హవిస్సులకు ప్రీతుడు, శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును.

బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు, భవిష్యత్ సృష్టికోసం ప్రతీ జాతి అంటే సమస్త జీవరాసులు, వృక్షములు, ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశమునందు నింపెను. అందు అమృతమును, అన్ని సముద్రజలములను, నదీజలములను పోసెను. గాయత్రీమంత్రముతో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవాహింపచేసెను. దీనినే పూర్ణకుంభం అంటారు. ఈ పూర్ణకుంభంలోని అమృతమునే భూమిపైకి నిరంతరంగా మహర్షులు అభిషేకించారు. ఆ అభిషేకము కైలాశగిరి వద్ద జరుపుటచే అది పరమపవిత్ర స్థానమైనది. శ్రావణపూర్ణిమనాడు అమర్నాధ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతిసహజంగా ఏర్పడును.

ఆ పూర్ణకుంభం బోర్లించగా అందునుండి ఇద్దరు మహామునులు అవతరించారు. మొదటివాడైన వశిష్టుడు తెల్లని తేజస్సుతో ఉండగా, రెండవ వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణుల అంశలతో జన్మించారు. పూర్ణకుంభమున అమృతజలముతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకము చేసిన మంచిది. ఏకాదశ రుద్రులకు, వైష్ణవ పరమైన ఏకాదశీ తిధికి సన్నిహిత సంబంధము ఉండుట వలన, శివకేశవులు ఒకరే అని గుర్తించవలెను.

ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలో మన ఇంటిలో రుద్రాభిషేకం చేయించడం మంచిది.


రుద్రాక్షలు

రుద్రాక్ష :
మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.

సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు.

ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష కార్తికేయస్వరూపం, సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం, అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం, నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం, ఇది దొరకడం చాల కష్టం. దీనిలో విద్యా, ఙ్ఞాన, క్రియా, శాంత, వామ, జ్యేష్టా, రౌద్రా, అంగ, పశ్యంతీ అను నవ శక్తులు ఉంటాయి. అందుకే నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం, ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశరూపం, ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్యరూపం. ఈ విధంగా రుద్రాక్షలకు దేవతా స్వరూపములకు దగ్గర సంబందం ఉంది.

Wednesday, April 20

దశ మహావిద్యలు

మొదటిరూపం కాళి : మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతలనే మహావిద్యలంటారు. ఒకానొక సమయంలో హిమాలయములందు కల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితా రూపమున దర్శనమిచ్చింది. కాటుక వలె కృష్ణవర్ణమునందు ఉండుటవలన ఆమెకు కాళీ అనే పేరు వచ్చింది. శుంభనిశుంభలను సంహరించినది. కాళి నీలరూపము అగుటవలన తారానామము ఏర్పడినది. అనేక సంవత్సరాల కాలమునకు కాని ఫలించని యోగమార్గ సాధన, కొద్ది రోజులలోనో, మాసములలోనో సాధించాలి అని అనుకొనే వారు కాళి ఉపాసన చేస్తారు. ఐతే సాధనాకలం లో కాళీ శక్తి తమ శరీరములోకి ఆకర్షించినపుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను, బాధలను అనుభవించాల్సి ఉండును.

రెండువరూపం తార : తార సర్వదా మోక్షమును ప్రసాదించును. ఈమెకు నీలసరస్వతి అను పేరు కూడా ఉంది. భయంకరమైన విపత్తులనుండి భక్తులను కాపాడుతుంది కావున, ఈమెను ఉగ్రతార రూపమున కూడ యోగులు ఆరాధిస్తారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలుస్తారు. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మూడవరూపం ఛిన్నమస్త : దేవి ఒకానొక సమయమున తన సఖురాండ్రైన జయవిజయలతో మందాకిని నదికి స్నానార్ధము వెల్లింది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితయై కృష్ణవర్ణ ఐనది. ఆమె సఖురాండ్రు ఆమెను భోజనవిషయమై అడిగిరి. కృపామయురాలు అయిన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామ హస్తమున పడింది. ఆమె కబంధం నుండి మూడు రక్తధారలు ప్రవహించినవి. రెండు రక్తధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా మూడవ రక్తధారను దేవియే స్వయముగా పానము చేసినది. ఆ రోజునుండి ఆమెకు ఛిన్నమస్తా నామము స్థిరపడినది. హిరణ్యకశ్యపాదులు ఈ ఛినమస్తాదేవి ఉపాసకులు.

నాల్గవరూపం షోడసీ : ఈ తల్లి చాలా దయామయురాలు. ఈమెను ఆశ్రయించినవారికి ఙ్ఞానమనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్ని ఈ అమ్మవారినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడ వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి ఉపాసన వలన భోగమోక్షములు రెందూ సిద్ధిస్తాయి. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఐదవరూపం భువనేశ్వరీదేవి : సమస్తకోటి మహామంత్రములు ఎల్లపుడు ఈ దేవిని ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వము నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులు ఉన్నయి. వాటినుండి అవ్యక్త భువనేశ్వరీ వ్యక్తమై బ్రహ్మాండరూపాన్ని ధరించకలుగుతుంది. ప్రళయవేళలో జగత్తునుండి క్రమముగా లయమై కాళీరూపములో మూలప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈ తల్లిని కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు. చంద్రగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరవరూపం త్రిపురభైరవి : సృస్టిలో పరివర్తన అనునది ఎల్లపుడునూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ అనునవే మూలకారణము. ఈ త్రిపురభైరవి నృసిం హభగవానుడి అబ్బిన్నశక్తిగా చెప్పబడినాడు.

ఏడవరూపం ధుమావతి : ఈమె కూడ ఉగ్రరూపమే. ఆగమములలో ఈమెని అభావసంకటాలను దూరం చేయునట్టి రూపంగా వర్ణించారు. ఐతే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలూ, కలహదారిద్ర్యముల న్నింటికి ఈమే కర్త. ఆమె అనుగ్రహముంటే సకటములన్నీ దూరమవుతాయి. రాహుగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎనిమిదవరూపం భగళాముఖి : ఐహిక, దేశ, సమాజ, శత్రు శమనార్ధం ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రధమముగా బ్రహ్మదేవుడు భగళామహా విద్యోపాసన చేసాడు. విష్ణువు, పరశురాముడు భగళాముఖీ దేవతా ఉపాసకులే. కుజ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజ చేయడం మంచిది.

తొమ్మిదవరూపం మాతంగి : గృహస్థజీవితాన్ని సుఖవంతంచేసి పురుషార్ధములను సిద్ధింపచేసే శక్తి ఉన్న రూపం. ఈమెను మతంగముని కుమార్తెగా కూడా పిలుస్తారు.

పదవరూపం కమలాలయ : వస్తు సమృద్ధికి ప్రతీక. భార్గవులచేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు కూడ ఉంది. శుక్రగ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజవలన ఫలితాన్ని పొందుతారు

Saturday, April 16

రోజు పఠించే శ్లోకములు కొన్ని ..

మనం రోజువారీ చదువుకొనే చిన్న చిన్న శ్లోకములు :

ప్రొద్దున నిద్ర లేవగానే పఠించాల్సిన శ్లోకం :
కరాగ్రే వసతే లక్ష్మి
కరమూలే సరస్వతి
కరమధ్యే తు గోవిందం
ప్రబాతే కర దర్శనం

దేవుడి ముందు దీపారాధన చేసిన తర్వాత, దీపానికి నమస్కరిస్తూ పఠించాల్సిన శ్లోకం :
దీపజ్యోతి పరబ్రహ్మ
దీపజ్యోతి జనార్ధనా
దీపోమి హర తు పాపం
దీపా జ్యోతిర్ నమోస్తుతే


గణపతి :
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రస్సన్న వదనం ద్యాయేత్ సర్వ వి ఘ్నోప శాంతయే

గురువు :
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

దక్షిణామూర్తి :
స్పటిక రజితవర్ణం మౌక్తికా మక్షమాలా
మమృత కలశ విద్యా ఙ్ఞానముద్రాః ప్రదాయకం
దధత మురగరక్షం చంద్రచూడం త్రినేత్రం
విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే

శ్రీరాముడు :
శ్రీరామ రామ రామేతి, రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

శ్రీకృష్ణుడు :
కస్తూరీ తిలకం లలాటఫలకే, వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ

శ్రీ మహావిష్ణువు :
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయహరం సర్వలోకైకనాధం

శ్రీ లక్ష్మీనృసింహ స్వామి :
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
భోగీద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీ నృసిం హ మమదేహి కరావలంబమ్

ఆంజనేయస్వామి :
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి.

సూర్య భగవానుడు :
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం
తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం

గురు రాఘవేంద్రస్వామి :
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచా
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే

సరస్వతిదేవి :
యాకుందేందు తుషారహార దవళ యా శుభ్రః వస్త్రావృతా
యా వీణా వరదందమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకరప్రబృతి భిర్ధే వైస్సదా వందిథా
సమాంపాతు సరస్వతి భగవతి నిస్సేష జాద్యాపః

లక్ష్మీదేవి :
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం, శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్తదేవ వనితాం, లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం

అన్నపూర్ణాదేవి :

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ,
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ;
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.

శ్రీ లలితాదేవి :
హ్రీం కారాసన గర్భితానల శిఖాం సౌః క్లీంకలాం బిభ్రతీమ్
సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలామ్
వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భూషితాముజ్వలామ్
స్త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కలాం శ్రీ చక్రసంచారిణీమ్

దేవి శ్లోకం :
సర్వమంగల మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్రయంబికేదేవి నారాయణీ నమోస్తుతే

దుర్గా దేవి :
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కదుపారడి బ్చ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

అయ్యప్ప స్వామి :
ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్పా..

భోజన సమయమున :
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః
బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతైన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధిన


రాత్రి పడుకొనేముందు :
కార్తవీర్యార్జునా నామ రాజాబాహు ప్రసస్మితే
అస్మత్ స్మరణ మాత్రేన చోర భయం వినశ్యతి

రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం I
శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి

హనుమంతుని ద్వాదశనామాలు

హనుమంతుని ద్వాదశనామాలు :

హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః
రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విక్రమః
ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్

హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనేముందు, ప్రాయాణ సమయమున పఠించిన మృత్యుభయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.

హనుమాన్ చాలిసా

హనుమాన్ చాలిసా : మన నిత్య దైవారాధనలో హనుమాన్ చాలిసా కూడ తప్పక ఉంటుంది. మన ఇళ్ళలో చిన్నపిల్లలకు సైతం హనుమాన్ చాలిసా నేర్పించడం మనకు పరిపాటి. ఈ చాలిసా ను రచించింది తులసిదాసు. అసలు ఈ చాలిసా అనునది ఎలా వచ్చిందో తెల్సుకొందాం. వారణాసి లో ఉండే తులసిదాసు గొప్ప రామ భక్తుడు. నిత్యం రామనామ సంకీర్తనలో కాలం గడుపుతూ, అందరికి రామనామ దీక్షను ఇస్తూ, అద్యాత్మికతను అందరికి భోదించేవాడు. ప్రజలు కూడ తులసిదాసు తో కలిసి రామనామ సంకీర్తనలు చేసేవారు.

ఒకరోజు, అదే ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిలో, భర్త వియోగం వలన ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, భర్త శవం తీస్కొని పోవద్దు అంటూ ఉన్న ఆ తల్లిని, బంధువులు బలవంతంగా పట్టుకొని ఉండగా, శవయాత్ర మొదలు పెట్టారు. ఆ ఇల్లాలు, బంధువులను విడిపించుకొని, ఆ శవయాత్ర వెంట పరుగు తీసింది. తులసిదాసు ఉండే ఆశ్రమం మీదుగానే శవాన్ని తీస్కొనివెళ్తున్నారు. తులసిదాసు ఆశ్రమం సమీపించగానె ఆ ఇల్లాలు తనకు తెలియకుండానే ఆశ్రమంలో కి వెళ్ళి తులసిదాసు ని ఆశ్రయిస్తుంది. ఆ తల్లి గజ్జెల సవ్వడి, గాజుల శబ్ధం విన్న తులసిదాసు "దీర్ఘ సుమంగళీ భవ" అని ఆశీర్వదించాడు. అది ఎలా సాధ్యం అని ఆమె తండ్రి జరిగింది తులసిదాసుకి వివరిస్తాడు. అది తెల్సుకొన్న తులసిదాసు, రామనామ స్మరణ చేస్తూ కొద్దినీటి ని ఆ శవం పైన చల్లాడు. వెంటనే శవం లో చైతన్యం వచ్చింది.

ఇదే అదునుగా తీసుకొని కీర్తనలు, భజనలు నచ్చని మతపెద్దలు, తులసిదాసు మతమార్పిడి ని ప్రోత్యహిస్తున్నాడు అని, ప్రభువైన పాదుషా కు ఫిర్యాదులు చేసారు.
పాదుషా తులసిదాసుని పరీక్షించ దలచి దర్బారుకి పిలిపించారు.

పాదుషా : రామనామము అన్నింటికన్నా గొప్పది అని ప్రాచారం చేస్తున్నారటా?

తులసిదాసు : అవును ప్రభు. సృస్టికి మూలం ఐన రామనామం వర్ణించడం ఎవరితరం కాదు
పాదుషా : రామనామం వలన దేనినైనా సాదించవచ్చు అని చెప్తున్నారట?
తులసిదాసు : అవును ప్రభు
పాదుషా : ఐతే నేనొక శవం తెప్పిస్తాను, దానికి జీవం పోయగలవా?
తులసిదాసు : సృస్టిలో జనన మరణాలు ప్రకృతి సిద్దమైనవి. వాటిని మనం నిర్ణయించడం సబబు కాదు.
పాదుషా : మీరు శవం లో జీవం తెప్పించండి లేదా మీ రామనామ స్మరణ, మీరు చెప్పినవి అన్ని అబద్ధాలు అని ఒప్పుకోండి.

ఈ విపత్కర పరిస్థితి కల్పించిన నీవే, పరిష్కారం కూడ చూపాలి అని ఆ శ్రీరామ చంద్రుడిని వేడుకొంటూ ద్యానస్తుడైన తులసిదాసుని బందించమని ఆఙ్ఞాపిస్తాడు పాదుషా. ఆ క్షణంలో ఎక్కడనుండి వచ్చాయో కాని వేలాది కోతులు ఒక్కసారిగా సభాసదులందరిపైనా దాడి చేసాయి. ఆ కలకాలానికి ధ్యాన భంగమైన తులసిదాసు, వానర సేనను చూసి, ఎందుకిలా జరుగుతోంది అని సింహద్వారం వైపు చూడగా అక్కడ హనుమంతుడు దర్శనమిచ్చాడు.

అంతే తులసిదాసు మహదానందంలో మునిగిపోయాడు, భక్తి పారవశ్యంతో 40దోహాలుతో ఆ పవన తనయుడిని వర్ణించాడు. శాంతించిన హనుమ, ఏం వరం కావాలో కోరుకోమంటే, ఈ 40దోహాలను పఠించినవారికి అభయం ఇవ్వు తండ్రీ అని తులసిదాసు కోరుకొన్నాడు. దానికి మరింత ముగ్దుడైన ఆంజనేయుడు, ఈ స్తోత్రం చేసినవారికి ఎల్లప్పుడు నేను అండగా ఉంటానని అభయం ఇచ్చాడు.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలీం
శ్రీ రామభక్త హనుమతే నమః

Wednesday, April 13

మాఘమాసం

అన్ని మాసాలలో కల్లా మాఘమాసానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఆ మాసంలో నదీనదాలో చేసే స్నానానికి ఎంతో పవిత్రత ఉంది. ఈ స్నానాలనే మాఘస్నానాలు అంటారు. సాధారణంగా నీటికి గల శక్తులు పరమపావనమైనవి. కల్మషాలు, మలినాలను కడిగివేయడంతో పాటు దాహాన్ని తీర్చేది నీరు. జలం మానవులకు యెంతో ఉపయుక్తమైనది. సాధారణం స్నానం దేహాన్ని శుద్ధి చేసి ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని స్థిరత్వన్ని కలిగిస్తుంది. స్నానం నిత్యవిధి. అలాంటి స్నానాలను నిత్యస్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం, క్రియాంశ స్నానం, అభ్యంగన స్నానం, క్రియా స్నానం అను ఆరు రకాలుగా చెప్తారు. మిగిలిన మాసాలలో కెల్ల వైశాఖం, కార్తీకం, మాఘమాసాలలో చేసే స్నానాలు, ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు. చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘమాసం.

మాఘం అంటే యఙ్ఞం. కళ్యాణ కారకమైన స్నానం పరమ పవిత్రం. ఈ మాసంలో సూర్యుడి గమనాన్ని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ కిరణాలలో గల అతినీలలోహిత కిరణాలు నదులు, తటాకాల్లోని నీటిపై ప్రసరించడం వలన ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. మాఘస్నానం విధులను మాఘపురాణంలో వివరించగా, మాఘస్నానం మహత్యాన్ని బ్రహ్మండ పురాణంలో పేర్కొన్నారు.
గృహస్నానం 6సంవత్సరాల పుణ్యాన్ని, బావి స్నానం 12ఏల్ల పుణ్యాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణాలను, మహానది స్నానం శతగుణాన్ని, గంగాస్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం శత సహస్ర గుణాల ఫలాలను అందిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.

కాలం దేవతా స్వరూపం. కాలానుగుణంగా కర్మలన్నీ జరుగుతాయి. మాఘమసంలో చేసే స్నానం వలన శరీరంలోని మలినాలు తొలగడంతోపాటు ఓషధ గుణాలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని, పుణ్యఫలాలను అందించే మాఘస్నానం ఆచరించడం మంచిది అని పురాణాలు చెప్తున్నాయి.

Wednesday, April 6

ఖర నామసంవత్సర అర్ధం....

ఖర నామసంవత్సరం అనగానే చాలమంది గాడిద నామసంవత్సరం ఏంటి అని అనుకొంటున్నారు. ఖర అంటే గాడిద అని కూడ అర్ధం ఉంది కాని, ఈ సందర్భంలో గాడిద అని అర్ధంకాదు. చురుకైన / తీవ్రమైన అని భావం.
ప్రముఖులు, సాహితీవేత్త, కవి ఐన గరికపాటి నరసింహరావు గారు మనకు అర్ధమగు రీతిలో వివరించారు. ఈ క్రింది విడియో ను వీక్షించండి .


Monday, April 4

ఉగాది -- శ్రీ ఖర నామ సంవత్సరం


ముందుగా అందరికి శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు. ఖర అంటే చురుకైన / సూర్పణక సహోదరుడు / గార్దభం అని అర్ధం. 60 తెలుగు సంవత్సరాలలో 25వ సంవత్సరం ఖర. పురాణల ప్రకారం, శ్రీ మహా విష్ణువు మాయ వలన, నారద మహర్షి మానవ (స్త్రీ) రూపం పొంది ఈ జంఝాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కొనిపోతుంది, ఒక రాజుని వివాహమాడి 60మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి. కాలగమనంలో యుద్ద సమయమున ఆ పిల్లలను పోగ్గొట్టుకొంటుంది. ఈ మాయ నుండి బైట పడ్డ ఆ యువతి (నారదుడు) ఇది అంతా ఆ మాహా విష్ణు మాయ అని తెల్సుకొంటుంది. ఆ 60మంది కుమారులకు గుర్తుగా, 60 తెలుగు సంవత్సరాలు వారి పేర్లు తో సార్ధకమౌతాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారని పురాణాలలో చెప్పారు.

యుగాది కృద్యుగావర్థో నైకమాయో మహాశన:
ఆద్రుశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్
విష్ణువు కు యుగాది అను పేరు కూడ ఉంది. దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు. యుగాది కృద్ అంటే యుగాలను సృష్టించేవాడు, యుగావర్తో అనగా యుగములను పునరావృతం చేయువాడు.
హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగు సంవత్సరాది ఉగాది నాడు మొదలవుతుంది. యుగమునకు ఆది (మొదలు) అని అర్ధము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చైత్ర మాసం లో ని పూర్ణ చంద్రోదయ రోజున, శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందినాడని, ఆ రోజునే కలియుగ ఆరంభంగా పరిగణించారు. ఆ విధంగా కలియుగం ఆరంభం ఐనది అని వారి భావము.
మన జీవితంలోని ఎగుడు దిగుడులను కూడా మనం సమంగా తీస్కోవాలని తెలిపేదే ఉగాది పచ్చడి. తీపి, వగరు, పులుపు, చేదు, ఉప్పు, కారం కలగలిసినదే ఉగాది పచ్చడి . జీవితం కూడా అంతే, అన్నింటిని ఆస్వాదించినపుడే సంతోషముగా ఉంటాము.