Sunday, December 30

చండీ స్తుతి

చండికాశ్వేత వర్ణాసా శివరూపాచ సింహగా
జటిలా వర్తులాత్ర్యక్షా వరదా శూలధారిణీ
కర్త్రికాంబిభ్రతీం దక్షా పాశపాత్రా భయాన్వితా

చండిమాత తెల్లని దేహం, శుభకరమగు రూపంతో విరాజిల్లుచున్నది. సింహ వాహన ధారీయై, జడలు దాల్చి, బొద్దుగా నున్నది, సూర్య చంద్రాగ్నులను, మూడుకన్నులను కలిగియున్నది. ఆమె కుడి వైపునున్న చేతులలో కింది నుండి పైకి వరుసగా వరముద్ర, శూలం, కత్తెర మున్నగు వాటిని, అలానే ఎడమవైపు అభయ ముద్ర, పానపాత్ర, పాసం మొదలైన వాటిని ధరించియున్నది. ఆమె  శిరస్సుపై చంద్రరేఖ నెలకొనియున్నది.

Saturday, October 27

కోజాగరి వ్రత విధానం

ఆశ్వీయుజ పూర్ణిమనాడు ముక్యంగా స్త్రీలు బ్రాహ్మే ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకుని, పూజామందిరంలో కాని లేదా పూజ చేయదలాం చుకున్న చోట మండపమును ఏర్పరుచుకుని అందులో శ్రీలక్ష్మి విగ్రహమును గాని, పతమును గాని ప్రతిష్టించుకుని ముందుగా గణపతి పూజచేసి అనంతరం శ్రీలక్ష్మిదేవిని షోడశోపచారాతో, అష్టోత్తరశతనామములతోనూ పూజచేయాలి.

శక్తికొలది నైవేద్యం పెట్టి, తిరిగి చంద్రోదయం అయిన తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. పాలు, పంచదార, పలకపొడి, కుంకుంపువ్వు, బియ్యం వెసి క్షీరాన్నం వండి, నైవేద్యంగా పెట్టాలి. తరువాత క్షీరాన్నాన్ని ఆరుబట వెన్నెలలొ పెట్టి కొద్దిసేపు తరువాత ప్రసాదముగా తీసుకోవాలి.

ఇలా ఆరుబయట ఉంచడంవలన చంద్రకిరణాల ద్వారా అమృతం వచ్చి అందులో పడుతుందని నమ్మకం. తరువాత రాత్రి జాగరం చేయాలని శాస్త్రం చెబుతోంది.


జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలు ఆడుతూ గడపాలని ఆచారం. ఆశ్వయుజ పూర్ణిమనాటి రాత్రి శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూంటారో వారికి సిరిసంపదలను చేకూరుస్తుందని కధనం. మరుసటి రోజు పునః పూజ చేసి వ్రతం పరిసమాప్తి చేయాలి.


అంతేకాకుండా ఇదేరోజు మనరాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో "గొంతెమ్మ పండుగ"ను చేస్తారు. కుంతీమహేశ్వరిని పూజిస్తారు. అరిసెలు, అప్పములు, కూరలను నైవెద్యముగా సమర్పిస్తారు.


ఆశ్వయుజ పూర్ణిమనాడు నారదీయ పురాణమును దానం చేయడం వల్ల మరణాంతరం ఇష్టలోకప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

కోజాగరి వ్రతం (అక్టోబర్ 29 )

పాలకడలిలో శేషశయ్యపై శయనించి ఉండే స్థితికారుడైన శ్రీమహావిష్ణువు పాదాల చెంత ఆసీనురాలై ఉండే శ్రీమహాలక్ష్మిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీలక్ష్మీదేవిని భావిస్తాం. ఆ తల్లికి అత్యంత ప్రియమైన వ్రతం, దారిద్ర్య వినాసక వ్రతం "కోజాగరి వ్రతం".

పూర్వం మహర్షులందరూ వాలిఖిల్య మహర్షిని దరిద్ర్యం తొలగిపోయి, లక్ష్మీ ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని కోరగా, వాలఖిల్య మహర్షి ఈ వ్రతమును వివరించినట్లు పూరాణ ఆధారం.

పూర్వం మగధదేశంలో "వలితుడు" అనే బ్రాహ్మణుడు నివసిస్తూండేవాడు. గొప్ప పండితుడు, భక్తుడు అయిన వలితుడు కటిక పేదవాడు. ఆయన భార్య "చండి" పరమ గయ్యాళి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొన్నివలేదని వలితుడి మాట దిక్కరించి భర్తకు వ్యతిరేకంగా నడవసాగింది. (అంటే ఎడ్డం అంటే తెడ్డం అనే రకం). వలితుడికి ఇది బాగ క్రుంగదీసింది.
స్నేహితుడైన గణేష షర్మ, వలితుడి బాద చుసి, పరి పరి విధాల ఆలోచించి, "నీవు ఏ పని చేయించుకోవలనుకుంటే, దానికి వ్యతిరేకముగా పనిచేయమని ఆమెకు చెప్పు. అందుకు వ్యతిరేకముగా ఆమె చేస్తుంది. కనుక నీ పని నెరవేరుతుంది" అని సలహా ఇచ్చాడు.

కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచింది. స్నేహితుడి సూచన మేరకు వలితుడు "రేపు మా తండ్రిగారి ఆబ్దికం, నె పెట్టదలచలేదు" అని చండి తో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని దగ్గరుండి, వలితుడి చేత పెట్టించింది. అన్ని సవ్యముగా జరుగుతున్నాయన్న సంతోషంలో వలితుడు, చండితో "పిండాలను తెసుకునిపోయి నదిలో పడవేయి" అని అన్నాడు. వెంటనే చండి, పిండాలను కాలువలో పదేసింది. విరక్తి చెందిన వలితుడు ఇల్లు వదిలి అరణ్యాల బాట పడ్డాడు.

కొంతకాలం తరువాత, ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది. సాయంత్రం అయింది, నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానమాచరించి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడేందుకు సిద్దపడ్డారు. నాలుగో మనిషి తక్కువ ఉండటంతో, యెవరైన ఉన్నరేమొ అని చుట్టుపక్కల చూసారు. వలితుడు కనిపించడంతో, ఆడటానికి ఆహ్వానించారు. అది జూదమని ఆడరాదని వలితుడు అనడంటో, ఈ దినం పాచికలు ఆడటం నియమమని అనడంతో వలితుడిని పాచికలను ఆడెందుకు అగీకరింపచేసారు.

భూలోకంలో ఎవరు మేలుకుని ఉన్నారో చూసేందుకు భూలోకం వచ్చిన శ్రీమన్నారాయణుడు, శ్రీమహాలక్ష్మి కి, ముగ్గురు నాగకన్యలు, లవితుడు పాచికలు ఆడుతూ కనిపించారు. దానికి సంతసించిన ఆది దంపతులు సర్వసంపదలను ప్రాసాదించారు.

Wednesday, October 17

దుర్గా సప్తశ్లోకి

ఓం ఙ్ఞానికా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి

ఓం దుర్గే స్మృతా హరసిభీతి మశేషజంతోః
స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ర్ధ చిత్తా

ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాద్కకే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
 
ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే
 
ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్య స్త్రాహినోదేవి, దుర్గేదేవి నమోస్తుతే
 
ఓం రోగా నశేషా వపహంసి తుష్టా
రుష్టా తు కామాన్ సకలా నభీష్టాన్
త్వా మాశ్రితానాం న విపన్నరాణాం
త్రా మాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి
 
ఓం సర్వబాధా ప్రశమనం త్రయిలోక్య స్యాఖిలేశ్వరీ
ఏనమేవ త్వయాకార్య మస్మద్వైరి వినాశనం.  

**********జయహో మాతా**********

Monday, October 15

రాధాదేవి

శ్రీ రాధాదేవి ఉపాసన కృష్ణభక్తి సంప్రదాయంలో ప్రముఖమైనది. పురాణాలలో భాగవతం, విష్ణుపురాణం “రాధ” పేరు ప్రస్తావించకపోయినా, ఈ మహాదేవిని కల్పిత పాత్రగా అనుకోరాదు. ఉపాసకులకు ఈ తల్లి కృపా సాక్షాత్ సత్యం. విష్ణు ప్రాధాన్యాన్ని చెబుతూ రచించిన గ్రంధం కనుక విష్ణుపురాణం కృష్ణావతారాన్ని ఒక అవతారగాధగా ప్రస్తావిస్తూ రచించింది. ఆ కారణం చేత రాధ ప్రస్తాపన కనబడదు. అలాగే భాగవతంలో ఏ గోపిక పేరు కూడా చెప్పబడలేదు. అందుకే ప్రత్యేకించి “రాధ పేరు లేదు” అనడం సమంజసం కాదు. అయితే భాగవతం దశమ స్కంధంలో శుక మహర్షి “ అనయారాధితో నూనం” అనే  శ్లోకంలో రాధ పేరును సూచించారు.

రాధ ప్రస్తావన ప్రత్యేకించి దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం, పద్మ పురాణం. స్కాందపురాణం, గర్గ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, శివపురాణం, నారద పురాణం మొదలైన పురాణాలలో విస్తృతంగా ఉన్నది. ఊర్ధ్వామ్నాయ తంత్రము  మొదలైన మంత్ర శాస్త్రాలలో శ్రీరాధా దేవ్యుపాసన చెప్పబడినది. ఋగ్వేద, సామవేదాది వేద భాగాలలోనూ శ్రీరాధికోపనిషత్తు, శ్రీ రాధా తాపిన్యుపనిషత్తు, గోపాలతాపిన్యుపనిషత్తు లాంటి వేద వాఙ్ఞ్మయంలో రాధారాధన కనిపిస్తోంది.
 
తత్వపరంగా చూస్తే ...
ఈ అనంత ప్రకృతి స్వరూపిణీయిన పరాశక్తి యొక్క ప్రేమానంద స్వరూపమే రాధ. ఈ ప్రకృతి జీవులలో ఆ శక్తి  భక్తి రసమూర్తిగా స్ఫురిస్తే, పరమాత్మలో కృపారస స్పూర్తిగా మూర్తీభవిస్తే అదే “రాధాతత్వం”. విశ్వ ప్రకృతిలోని విద్యాశక్తి సరస్వతి, ఐశ్వర్య శక్తి లక్ష్మి, ఇచ్చాఙ్ఞానక్రియాత్మక శక్తి గౌరి, కాలస్వరూపం కాళి, ప్రతాపరూపం దుర్గ, జలరూపం గంగ, వేదస్వరూపం గాయత్రి. ఇలా విభిన్న శక్తుల విభిన్న రూపాలుగా ఆరాధింపబడి ఆ శక్తుల సమృద్ధి జగదంబకృపగా లభిస్తోంది. అలాగే భగవంతుని వైపు బుద్ధిని నిలిపి, సర్వ సమర్పణతో ఆ”రాధి"ంచే భక్తి శక్తి రాధ.
 
“సాత్మస్మిన్ పరమప్రేమరూపామృత స్వరూపా
కేవల అవిచ్చిన్న అనుభవరూపా”
 
అని నారదుడి భక్తి సూత్రాలలో వివరించిన భావనని రూపు కడితే అదే రాధా రూపం.
 
శ్రీకృష్ణుడు భూలోకాన తాను అవ్తరిస్తూ గోలోకాన్నే భూమికి అవతరింపచేసాడు. అదే బృందావన వ్రజభూమి. గోలోకరాణిగా శ్రీరాధాదేవి వృషభానుడనే గోపరాజు ఇంట ఆవిర్భవించింది. అనేక జన్మల పుణ్యాలున్న వారికే రాధోపాసన లభిస్తుంది. ఉత్తరాది, వంగదేశం మొదలైన చోట్ల రాధోపాసన ప్రసిద్ధి. అయితే తెలుగులో ప్రబంధ యుగం తరువాత అనుకరణ ప్రబంధాలుగా అశ్లీలాన్ని వెలువరించిన క్షుద్రులు రాధాకృష్ణ చరిత్రను తప్పుడు భావనలతో, స్వకపోల కల్పనలతో తప్పుదారి పట్టించారు. 
 
భాద్రపద శుద్ధ అష్తమినాడు శ్రీరాధాదేవి వ్రజభూమిలో “బర్సానా” అనే ప్రాంతంలో ఆవిర్భవించింది. కనుక ఆ రోజున “రాధాష్టమి”గా మహా వైభవంగా నిర్వహిస్తారు.

“శ్రీరాధా కృపాకటాక్ష స్తవరాజము” స్తోత్రాన్ని పూర్ణిమ, శుద్ధాష్టమి, దసమి, ఏకాదశి, త్రయోదశి నాడు పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి లభిస్తుంది.    

Wednesday, October 10

ఎవరితో ఎలా మాట్లాడాలి

ఇప్పుడు మనం కొన్ని వేల రూపయలు ధారపోసి కమ్యునికేషన్ స్కిల్స్ అని నేర్చుకుంటున్నాం. పురాణ గ్రంధాలలో వీటి గురించి చక్కగా వివరించారు. ఈ స్కిల్స్ అనేవి మనం హనుమంతుడిని నుండి నేర్చుకోవచ్చు.
మాట్లాడే విద్యకి ఉన్న గొప్పదనం ఆదికావ్యం వాల్మీకి రామాయణంలోనే కనబడుతుంది. హనుమంతుడు అంటే రామభజన చేసేవాడని సామాన్యుల భావన. కాని వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కేవలం భజన పరుడుకాదు. వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు. కార్యదీక్షా పరుడు, ఉత్తమ మంత్రి, దూత, నేత, అనుచరుడు, సేవకుడు. ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మాన్ని సక్రమంగా, ఆదర్శవంతముగా నిర్వహించిన వాడు.

ఎలా మాట్లాడాలి?? 
శాస్త్రానుసారం ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతాడు పవనకుమారుడు. అది ఎలాగన్నది కిష్కింధ కాండలో మొదటిసారి హనుమంతుడు, రాముడిని కలిసినపుడు, రాముని నోట పలికించాడు వాల్మికీ మహర్షి.

ఎలా మాట్లాడాలంటే..
విషయం స్పష్టముగా ఉండాలి
వాక్యంలో దోషాలు ఉండకూడదు. ముఖము, కన్నులు, నుదురు, కనుబొమ్మలు..ఏ అవయవంలోనూ వికార చేష్టలు ఉండకూడదు.
విషయంతో సంబంధంలేని మాటలు మాట్లాడకూడదు.
సందిగ్ధంగా ఉంచకూడదు.
మాటలను ఆపి ఆపి మాట్లాడకూడదు
మాట మనసులోనుండి రావాలి
మధ్యమ స్వరంతో మాట్లాడాలి
ఇలా హనుమ మాట్లాడినట్లు అభ్యాసం చేయగలిగితే, ఎవరైన, ఏ రంగంలోనైనా, ఎక్కడైన రాణించగలరు.

ఎవరితో ఎంత మట్లాడాలి ??
ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు అనేది ప్రతీరోజు మనం చూసే ప్రధాన అంశం. నీతులు, నియమాలు ఒక వాక్యంలో చెప్పి వదిలేస్తే హృదయానికి హత్తుకోవు. విషయం అర్ధం అయ్యేలా స్పష్టముగా చెప్పాలి.

దూతగా...
మధ్యవర్తిగా వెళ్ళినపుడు ఎలా మట్లాడాలి అనేది హనుమంతుడు రామదూతగా అశోకవనంలో సీతమ్మ తల్లితో మాట్లాడిన తీరు గమనించాలి.
అశోకవనంలో ప్రాణత్యాగానికి పాల్పడుతున్న సీతను చూసాడు హనుమ. ముందుగా ఆమె చేత ఆ ప్రయత్నాన్ని విరమింపచేయాలి, రాముడు రాబోతున్న వార్త తెలపాలి, అంతకుమించి తాను రామ దూత అని నమ్మించాలి. ఏ విధముగా సంభాషించాలి అని అలోచించి “ దశరధుడు అనే మహారాజు అయోధ్యకు రాజు....అని విషయాన్ని చెప్పడం మొదలు పెట్టాడు చెట్టు మీద కూర్చునే, రాముడి పేరు తప్ప మరొకరి పేరు తెలియని లంకలో దశరధమహారజు పేరు వినబడిందంటే, తన ఆత్మీయులు ఎవరో వచ్చారని అర్ధమై ఆత్మహత్యా ప్రయత్నం మానేసింది సీత. అప్పుడు పవనకుమారుడు సీత ఎదురుగా వచ్చి, రాముడు వానర సైన్యంతో సీతను విడిపించడానికి వస్తున్నడనే విషయాని సీతమ్మకి తెలియచేస్తాడు. తాను చేసిన సాహసాలు ఒక్కటి కూడ చెప్పడు.
రాముడు వచ్చేవరకు సీత జీవించి ఉండేలా చేయాలి, అందుకు ఏం చేయాలి? రాముడు రాబోతున్న వార్త చెబితే చాలు, తన సాహసాల గురించిన ప్రస్తావన అవసరంలేదు. అందుకే హనుమ అవసరం మేరకు మాత్రమే మాట్లాడాడు.

స్నేహితులతో...
సీతను చూసి, రావణుడిని హెచ్చరించి, లంకా దహనం చేసి తిరిగి తన కోసం ఎదురు చూస్తున్న వానరసేనను కలుస్తాడు హనుమ. సీతను చూసాను అనే మాట మాత్రమే చెప్పి వారి మనసులను కుదుట పరుస్తాడు. ప్రాణాలు కుదుటపడ్డ వానరులు, అసలు ఎలా సముద్రాన్ని దాటగలిగావు, సీతమ్మను ఎలా కనిపెట్టావు అని అడిగారు.

ప్రభువుతో... 
సీతమ్మ చెప్పిన, చిత్రకూటంలో జరిగిన ఒక సంఘటనను హనుమ రాముడితో చెప్పాడు. (తాను సీతను చూసాననే దానికి ఆనవాలుగా). తరువాత అసలక్కడ సీతమ్మ ఎలా ఉంది, రావణుడి గురించి వివరంగా తెలిపాడు.
ముఖ్యమైన విషయం ముందే చెప్పేయాలి. అంతేగాని టి.వి సీరియల్ లా సాగదీయకూడదు. అవసరమైన విషయం ముందు చెప్పేసి, తరువాత విషయాలు నెమ్మదిగ చెప్పాలి. 

ఇలా ప్రత్తి ఒక్క పురాణం నుండి మనం నేర్చుకోవలసింది, నేర్చుకుని ఆచరించవలసిన అంశాలు చాల ఉంటాయి. కనీసం మనం ఒక్కదాని ఆచారణలో పెడితే, దాని ఫలితాలకు తిరుగుండదు.

Saturday, September 22

శ్రీలక్ష్మీ నృసింహ స్వరూప ధ్యాన శ్లోకం

వందే నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం
వివృతాస్యం త్రిణయనం శరదిందు సమప్రభం
లక్ష్మ్యలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం
చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం
ఉరోజ శోభితోరస్కం రత్నకేయూరముద్రితం
తప్తకాంచన సంకాశం పీతనిర్మల వాసనం
ఇంద్రాది సురమౌళిస్థ స్ఫురన్మాణిక్య దీప్తిభిః
నీరాజిత పదద్వంద్వం శంఖచక్రాది హేతిభిః
గరుత్మాతా సవినయం స్తూయమానం ముదాన్వితం
హృత్సరోజనదావాసం ప్రహ్లాదవరదం హరిం


"దేవతలకు ప్రభువైన శ్రీనృసింహస్వామి బంగారు సింహాసనం పై కూర్చొని ఉన్నారు. తెరచిన నోటితో, మూడుకన్నులతో, శరత్కాల చంద్రునివంటి చాయతో, వామభాగమున లక్ష్మీదేవితో, సమస్త మంగళకర శక్తులతో భాసిస్తున్నాడు. చతుర్భుజాలతో, సుందరతనువుతో, స్వర్ణకుండలాలతో, శ్రీవత్సలాంచన శోభితమైన ఛాతితో, రత్నకేయూరాల తో, పుటం పెట్టిన బంగారంలా, పీతాంబరధారియై శోభిస్తున్నాడు. ఇంద్రాదులు వంగి నమస్కరిస్తూండగా, వారి కిరీటాల మణుల కాంతులే హారతులై మెరుస్తున్నాయి. ఆ వెలుగులతో, శంఖచక్రాది చిహ్నాలతోనున్న పాదములు విరాజిల్లుతున్నాయి. వినయంతో ఉన్న గరుత్మంతుడు స్తోత్రిస్తుండగా ఆనందిస్తున్న శ్రీహరి ప్రహ్లాదవరదుడై నా హృదయకమలంలో యెల్లప్పుడూ నివసిస్తున్నాడు. ఆ స్వామికి వందనములు. 

Tuesday, September 18

గణేష దుర్గాస్తోత్రం

గణేష దుర్గాస్తోత్రం, రక్షాకరమైన స్తుతి.



ప్రాచ్యాం రక్షతు హేరంబశ్చాగ్నేయాం అగ్నితేజసః
యామ్యాం లంబోదరో రక్ష్యేత్ నైఋత్యాం పార్వతీసుతః
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదః ప్రభుః
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః
ఏవం దశదిశో రక్ష్యేత్ హ్యవరం విఘ్న నాయకః
హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః
కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి

"తూర్పున హేరంబుడు, ఆగ్నేయములో అగ్ని సమాన తేజస్వి, దక్షిణాన లంబోదరుడు, నైఋతిలో పార్వతీసుతుడు, పడమర వక్రతుండుడు, వాయువ్యంలో వరదుడైన ప్రభువు, ఉత్తరాన గణపుడు, ఈశాన్యంలో ఈశానందనుడు, ఇలా పది దిక్కులా విఘ్ననాయకుడైన శ్రీమహాగణపతి నన్ను రక్షించుగాక. "

హేరంబుని స్మరించే ఈ రక్షాస్తోత్రాన్ని 3సార్లు పఠించేవారికి పాపసంహరణమే కాక, సంకటాలు తొలుగుతాయి. వెంటనే సమస్యా పరిష్కారం అవుతుంది. ఇది శ్రీ శివకృష్ణ సంవాదంలో ప్రబోధించిన స్తుతిగా పురాణాలు చెబుతున్నాయి.