Monday, October 15

రాధాదేవి

శ్రీ రాధాదేవి ఉపాసన కృష్ణభక్తి సంప్రదాయంలో ప్రముఖమైనది. పురాణాలలో భాగవతం, విష్ణుపురాణం “రాధ” పేరు ప్రస్తావించకపోయినా, ఈ మహాదేవిని కల్పిత పాత్రగా అనుకోరాదు. ఉపాసకులకు ఈ తల్లి కృపా సాక్షాత్ సత్యం. విష్ణు ప్రాధాన్యాన్ని చెబుతూ రచించిన గ్రంధం కనుక విష్ణుపురాణం కృష్ణావతారాన్ని ఒక అవతారగాధగా ప్రస్తావిస్తూ రచించింది. ఆ కారణం చేత రాధ ప్రస్తాపన కనబడదు. అలాగే భాగవతంలో ఏ గోపిక పేరు కూడా చెప్పబడలేదు. అందుకే ప్రత్యేకించి “రాధ పేరు లేదు” అనడం సమంజసం కాదు. అయితే భాగవతం దశమ స్కంధంలో శుక మహర్షి “ అనయారాధితో నూనం” అనే  శ్లోకంలో రాధ పేరును సూచించారు.

రాధ ప్రస్తావన ప్రత్యేకించి దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం, పద్మ పురాణం. స్కాందపురాణం, గర్గ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, శివపురాణం, నారద పురాణం మొదలైన పురాణాలలో విస్తృతంగా ఉన్నది. ఊర్ధ్వామ్నాయ తంత్రము  మొదలైన మంత్ర శాస్త్రాలలో శ్రీరాధా దేవ్యుపాసన చెప్పబడినది. ఋగ్వేద, సామవేదాది వేద భాగాలలోనూ శ్రీరాధికోపనిషత్తు, శ్రీ రాధా తాపిన్యుపనిషత్తు, గోపాలతాపిన్యుపనిషత్తు లాంటి వేద వాఙ్ఞ్మయంలో రాధారాధన కనిపిస్తోంది.
 
తత్వపరంగా చూస్తే ...
ఈ అనంత ప్రకృతి స్వరూపిణీయిన పరాశక్తి యొక్క ప్రేమానంద స్వరూపమే రాధ. ఈ ప్రకృతి జీవులలో ఆ శక్తి  భక్తి రసమూర్తిగా స్ఫురిస్తే, పరమాత్మలో కృపారస స్పూర్తిగా మూర్తీభవిస్తే అదే “రాధాతత్వం”. విశ్వ ప్రకృతిలోని విద్యాశక్తి సరస్వతి, ఐశ్వర్య శక్తి లక్ష్మి, ఇచ్చాఙ్ఞానక్రియాత్మక శక్తి గౌరి, కాలస్వరూపం కాళి, ప్రతాపరూపం దుర్గ, జలరూపం గంగ, వేదస్వరూపం గాయత్రి. ఇలా విభిన్న శక్తుల విభిన్న రూపాలుగా ఆరాధింపబడి ఆ శక్తుల సమృద్ధి జగదంబకృపగా లభిస్తోంది. అలాగే భగవంతుని వైపు బుద్ధిని నిలిపి, సర్వ సమర్పణతో ఆ”రాధి"ంచే భక్తి శక్తి రాధ.
 
“సాత్మస్మిన్ పరమప్రేమరూపామృత స్వరూపా
కేవల అవిచ్చిన్న అనుభవరూపా”
 
అని నారదుడి భక్తి సూత్రాలలో వివరించిన భావనని రూపు కడితే అదే రాధా రూపం.
 
శ్రీకృష్ణుడు భూలోకాన తాను అవ్తరిస్తూ గోలోకాన్నే భూమికి అవతరింపచేసాడు. అదే బృందావన వ్రజభూమి. గోలోకరాణిగా శ్రీరాధాదేవి వృషభానుడనే గోపరాజు ఇంట ఆవిర్భవించింది. అనేక జన్మల పుణ్యాలున్న వారికే రాధోపాసన లభిస్తుంది. ఉత్తరాది, వంగదేశం మొదలైన చోట్ల రాధోపాసన ప్రసిద్ధి. అయితే తెలుగులో ప్రబంధ యుగం తరువాత అనుకరణ ప్రబంధాలుగా అశ్లీలాన్ని వెలువరించిన క్షుద్రులు రాధాకృష్ణ చరిత్రను తప్పుడు భావనలతో, స్వకపోల కల్పనలతో తప్పుదారి పట్టించారు. 
 
భాద్రపద శుద్ధ అష్తమినాడు శ్రీరాధాదేవి వ్రజభూమిలో “బర్సానా” అనే ప్రాంతంలో ఆవిర్భవించింది. కనుక ఆ రోజున “రాధాష్టమి”గా మహా వైభవంగా నిర్వహిస్తారు.

“శ్రీరాధా కృపాకటాక్ష స్తవరాజము” స్తోత్రాన్ని పూర్ణిమ, శుద్ధాష్టమి, దసమి, ఏకాదశి, త్రయోదశి నాడు పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి లభిస్తుంది.    

0 వినదగు నెవ్వరు చెప్పిన..: