Tuesday, May 31

త్రిపుండ్రములు

శివభక్తులు నుదుటమీద అడ్డంగా ధరించే నామాలనే త్రిపుండ్రములు అని అంటారు. వీటిని ధరించడానికి ప్రత్యేక పద్దతి ఉంది, ఈ త్రిపుండ్రములను ఎక్కడ ధరంచాలి అనే విషయాన్ని శివపురాణంలో తెలియచేయబడి ఉంది. త్రిపుండ్రములను శైవులు మాత్రమే ధరించాలి అనే నియమం లేదు, ఎవరైన ధరించవచ్చు.
నామాలని ధరించేటప్పుడు సమయానుసారం ధరించాలి. మధ్యాహ్నంలోపు నామాలను ధరించే పనైతే విభూదిని నీటితో కలిపి పెట్టుకోవాలి. ఆ తరువాత ఐతే నీటిని కలపకుండా విభూదిని ధరించాలి. మధ్య, ఉంగరపు వేళ్ళతో మొదట రెండు నామాలు ధరించి, బొటనవేలితో మూడో నామాన్ని పెట్టుకోవాలి. కనుబొమ్మల మధ్య ఈ చివరనుండి, ఆ చివరవరకు నామాలు ధరించాలి. ధరించే సమయంలో శివనామస్మరణ చేయాలి.
ఈ నామాలను నుదుటిమీదే కాక వివిధస్థానాలలో శివభక్తులు ధరిస్తారు. 32 స్థానాలు లేక 16, 8, 5 స్థానాలలో మాత్రమే విభూదిరేఖలను ధరించాలి. శిరస్సు, లలాటం, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, కంఠం, రెండు చేతులు, మోచేతులు, మణికట్లు, హృదయం, రెండు
పార్శ్వాలు, నాభి, గుహ్యం, రువులు, మోకాళ్ళు, పిక్కలు, మోకాళ్ళ కిందభాగం, రెండు పాదాలు, వెనుక భాగం అనే 32 స్థానాలను భస్మధారణకు ప్రాధానమైనవిగా చెప్తారు. తల, నుదురు, కంఠం, 2 భుజస్కందాలు, 2భుజాలు, 2 మోచేతులు, 2 మణికట్లు, హృదయం, నాభి, 2 పార్శ్వాలు, వెనుకభాగము అనేవి విభూది ధారనకు ప్రధానమైన 16 స్థానాలు. గుహ్యం, లలాటం, రెండు చెవులు, రెండు భుజాలు, హృదయం, నాభి అనే 8 స్థానాలు కూడ విభూదిధారణకు ముఖ్యస్థానాలు. ఈ స్థానాలలో బ్రహ్మ, సప్తఋషులు ఉంటారు. శిరస్సు, 2భాహువులు, హృదయం, నాభి అనే 5 స్థానాలలో విభూదిధారణ చేయాలి. ( 32/16/8 స్థానాలలో ధరించలేనివారు).
( పైన ఫోటోలో గురుదేవులు ధరించినట్లు విభూది ఆయా స్థానాలలో ధరించాలి)
ఈ కాలంలో అయితే ఆఫీసులకి అలా వెళ్ళడం వీలుకాదు కనుక, కనీసం నుదుటిమధ్యలో విభూది ధరించడం మంచిది. ధరించే సమయంలో శివనామస్మరణ మరవవద్దు.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: