Sunday, October 9

వరాహపురాణంలో వేంకటాచల విశేషాలు (1)

శ్రీ వేంకటాచలం గురించి, ఆ బ్రహ్మాండనాయకుని గురించి ఎంత చెప్పినా మాటలు చాలవు. వేంకటాచల మహత్యం అనేక పురాణాల నుండి సంగ్రహింపబడినప్పటికీ వరాహపురాణం విస్తారంగా అభివర్ణించినది. వరాహపురాణం మహాపురాణాలలోనిది. ఈ పురాణమునందు 218 అధ్యాయాలు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. వేంకటాచల మహత్యం ఎక్కువ అధ్యాయాలలో(40 అధ్యాయాలు) వర్ణించిన పురాణం వరాహ పురాణం మాత్రమే.

శ్వేతవరాహ వృత్తాంతం :
శ్రీమన్నారాయణుడు, శ్వేతవరాహ రూపంలో పాతాళమున ఉన్న హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. తరువాత కొంతకాలము భూమిపైనే నివాసం ఏర్పర్చుకోదల్చి, వైకుంఠమునుండి గరుడుని ద్వారా "క్రీడాద్రి" (వేంకటాద్రి) ని భూమికి తెప్పించాడు. ఈ పర్వతమునే కృతయుగములో అంజనాద్రి అని, త్రేతాయుగములో నారాయణాద్రి అని, ద్వాపరయుగములో సింహాద్రి అని, కలియుగములో శ్రీవేంకటాచలమని పేరుగాంచినది. పవిత్ర వేంకటాచలములో అనేక తీర్ధాలు ఏర్పడినవి, ప్రతీ తీర్ధానికి ప్రత్యేక ఇతిహాససంబంధం కూడా ఉన్నట్లు ఇక్కడ తెలియచేయబడినది.

స్వామిపుష్కరిణి :

కొండపైన ఉన్న పుష్కరిణి మానవనిర్మితం కాదు. అది స్వయంవ్యక్త క్షేత్రం కనుక పుష్కరిణి కూడ స్వయంవ్యక్తమైనది. "స్వామి పుష్కరిణి" అనే ప్రసిద్ధి, వెంకటాద్రియందున్న మూడుకోట్ల తీర్ధాలలో. ఈ ఒక్క తీర్ధానికే దక్కింది. ఈ పుష్కరిణి గురించి వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలు పేర్కొన్నాయి.
శ్వేతవరాహ రూపంలో ఉన్న విష్ణువు ఆఙ్ఞానుసారం గరుడుడు, వైకుంఠము నుండి "క్రీడావాపిని" భూలోకానికి తెచ్చెను. ఇది గంగాది తీర్ధాలకు ఉత్పత్తిస్థానమని శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలియకముందే స్వామి పుష్కరిణి ఆవిర్భవించింది అని వరాహపురాణం ప్రతిపాదిస్తున్నది. దీన్ని గురించిన ప్రస్తావన అంటే ఎప్పుడు/ఎలాగ ఆవిర్భవించింది అనే దాని గురించి ఏ పురాణంలోను ప్రస్తావించలేదు.

బ్రహ్మోత్సవ వైభవం :

బ్రహ్మ శ్రీవారిని సేవించుటకు వేంకటాచలానికి వచ్చి, అక్కడే కొంతకాలం ఉండెను. తరువాత స్వామి వారి ఆఙ్ఞతో వేంకటాద్రి యందు బ్రహ్మోత్సవం చేయడం ప్రారంభించెను. సౌరమానమును అనుసరించి, సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినకాలం కన్యామసమందురు. ఈ కన్యామాసంలో ధ్వజారోహణం చేస్తారు.
ఈ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం చూడటానికి దేవతలు విచ్చేసిరి. బ్రహ్మ ఆఙ్ఞానుసారం విశ్వకర్మ అన్నశాలలను, నివాసభవనాలను, పుర వీధులను ఏర్పాటు చేసాడు.
ఉత్సవ సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశుడు సమస్త వాద్యఘోషలతో, ఛత్రచామరలు, కవులు, వాద్యములు, వేదపండితులు వెంటరాగా, ఊరేగింపుగా వెళ్ళెను. ప్రతిరోజు వైఖానస ఆగమశాస్త్రవిధి ప్రకారం యాగశాలలో హోమం మొదలైన వైదికకర్మలన్ని జరుగును. బ్రహ్మోత్సవానంతరం తిరుమలేశుడు బ్రహ్మను పిలిచి " నీవు అత్యంత భక్తితో జరిపించిన ఈ బ్రహ్మోత్సవము నాకెంతో తృప్తిని కలిగించినది. ప్రతీ సంవత్సరము కన్యామాసంలో బ్రహ్మోత్సవాన్ని ఈ విధంగానే నిర్వహించినవారు బ్రహ్మలోకాన్ని పొందుదురు" అని వరమిచ్చెను.
బ్రహ్మోత్సవం మొట్టమొదట కల్పారంభంలో బ్రహ్మచే ఆచరింపబడి, ఇప్పటికీ ప్రతీఏడు జరుగుతున్నది.

పద్మావతమ్మ జననం

ఆకాశరాజు యఙ్ఞము చేయదలచి అరణీనదీ తీరంలో బంగారు నాగలితో కర్షణము చేయిస్తూ తాను నవధాన్యములు చల్లుచుండెను. ఇంతలో పద్మశయ్యపై పరుండి బంగారు బొమ్మవలే ఉన్న బాలిక ఆ భూమిపై కనపడెను. ఆ సమయంలోనే ఆకాశవాణి ఇలా పలికింది " ఈ బిడ్డ నీ బిడ్డ, ఈమెను నీవు పెంచుము"అని. ఆకాశరాజు సంతసించి భార్య అయిన ధరణీదేవి తో సంతోషముగా పద్మావతిని పెంచి పెద్దచేసెను.
ఒకరోజు పద్మావతి చెలికత్తెలతో కలిసి ఉద్యానవనమునకు వెళ్ళింది. అంతలో ఒక మదపుటేనుగు అటుగా రావడంతో అందరూ భయంతో చెట్టుచాటున దాగిరి. ఆ సమయంలోనే ఆజానుబాహుడు, పద్మాక్షుడు అయిన వేంకటేశ్వరుడు అటు రాగ, ఆ ఏనుగు శ్రీనివాసునికి నమస్కరించి అడవిలోకి వెళ్ళిపోయింది.
అప్పుడు వేంకటేశ్వరుడు పద్మావతిని చూస్తూ, "ఈమె ఎవరు?"అని ప్రశ్నించగా "ఈమె ఆకాశరాజు, ధరణీదేవిల ముద్దల కొమరిక. నిన్ను ఇక్కడ ఆకాశరాజు చూచినచో కారాగారమున బంధించును. కనుక ఇచ్చటనుండి త్వరగా వెళ్ళుము" అని చెల్లికత్తెలు సమాధానమిచ్చిరి. శ్రీనివాసుడు తిరిగి వేంకటాద్రికి వెళ్ళిపోయాడు
ముక్తాగృహానికి చేరిన శ్రీనివాసుడు పరధ్యానముగా ఉండుట గమనించిన వకుళామాత, శ్రీనివాసుడి ద్వార పద్మావతి విషయమును తెలుసుకొనెను. తనకు పద్మావతితో వివాహము జరిపించమని వకుళను అడుగగా, వకుళ ఆకాశరాజు ఉండు నారాయణపురమునకు శ్రీనివాసుని ద్వార దారి తెలుసుకొని, నారాయణపురం చేరెను. ధరణీదేవిని కలుసుకొని, స్వపరిచయం చేసుకొని, ఉద్యానవనంలో జరిగిన పద్మావతీ శ్రీనివాసుల కలయిక గురించి వివరంగా చెప్పింది.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: