Friday, January 20

గజేంద్ర మోక్షములోని ఒక ఘట్టము


మొసలిబారిన బడ్డ గజేంద్రుడు తనను రక్షింపుమని శ్రీహరిని వేడుకున్నాడు. అతని దీనాలాపన....


అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూలసౌధంబు దా
పలమందార వనాంతరామృతసర: ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకర మావినోదియగు నాపన్న ప్రసన్నుండు, వి
హ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభియై

అచట వైకుంఠపురమునందు, కల్పవృక్ష సమూహములతోనున్న అమృతసరోవర తీరమునందు గల రాజనగరిలోనున్న మణిమయకాంతులీను భవనములో కలువపూలు పరచిన చంద్రకాంతపాన్పు మీద శ్రీలక్ష్మీదేవితో గూడి విహరించుచున్న, ఆపన్న శరణాగత తత్పలుడైన యా శ్రీమన్నారాయణుండు తన భక్తుడైన గజరాజు యొక్క మొరవిని కాపాడతలచినవాడై తత్తరపాటుతో తటాలున

సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం
తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై

శ్రీమన్నారయణుండు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖ చక్ర గదాది ఆయుధములను జేపట్టక, పరివారంబును పిలువక, తనవాహనమైన గరుడునిపై గూడ నధిరోహింపక, జారిన జుట్టును గమనింపక, వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడివేసిన యామె పైటకొంగునుకూడ గమనింపక తొందరపాటుతో యీడ్చుచునే బయలుదేరెను.
అట్టి భక్తజనోద్ధారుకుడైన శ్రీమన్నారాయణుడిట్లు సమస్త జంతుకోటి హృదయములందు అమరియున్నవాడై, ఆకాశంబు వేంచేయుచున్న సమయంబున కారణము తెలియక పతిని వెంబడించుచు లక్ష్మీదేవియు, ఆమెనుగూడి యామె అంత:పురజనుంబులు, వారివెనుక గరుత్మంతుడు, యాతని వెనుక విల్లును, కౌమాదకీ, శంఖచక్రగదాధి ఆయుధంబులునూ, నారద మహర్షియునూ, విష్వక్సేనుడును తోడుగా వచ్చిరి. వైకుంఠపురమందలి ఆబాలగోపాలమంతయు అబ్బురపడుచు అరుదెంచిరి.

శ్రీమన్నారాయణుడు క్రొంగువీడుట మరచుటచే యీడ్వబడినదై యాతని వెంబడించుచూ లక్ష్మీదేవి యిట్లు తలపోసెను.

తనపతియైన శ్రీమన్నారాయణుండెందుకు బోవుచున్నాడో చెప్పడు. ద్రౌపది మున్నగు స్త్రీల ఆర్తనాదము విని రక్షింప దలంచెనో, వేదముల నెవరైనా తస్కరులు తస్కరించిరో, రాక్షసులు దేవతానగరిపై దండెత్తి వచ్చిరో, దుర్జనులు 'మీచక్రాయుధుడేడీ' అని ధూషణ తిరస్కారముల నిందించిరో అని తర్కించుచూ, ఊగుచున్న చెవికమ్మెలను సరిచేసుకొనక, విడిన కొప్పుముడిని మరల వేసికొనక, జారిన మొల నూలును సరిదిద్దుకొనక, చెరిగిన బొట్టును గమనింపక, తన ప్రాణేశ్వరుని చేత చిక్కిన పైటకొంగు తన కుచకుంభముల నుండి చెదరగా, సిగ్గు జెందినదై, కోటి చంద్రకాంతులనుబోలు ముఖారవిందముగల లక్ష్మీదేవి

అడిగెదనని కడువడిన జను
నడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ జిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

తొట్రుపాటుతో తన భర్త ఎచటి కేగుచున్నాడో తెలుసుకొన గోరి ఒక అడుగు ముందుకు వేసి, తనకు బదులిచ్చునో లేదో యని సంశయముతో వెనుకంజవేయుచు, మరల ముందరికేగి అడిగితే యేమగునోయని తొట్రుపాటుపడుచు నట్లేయుండిపోయి, మరల తెప్పరిల్లి శ్రీమనారాయణమూర్తిని వెంబడించెను.

ఆపిమ్మట శ్రీహరి మకరి గజేంద్రుల పోరు సలుపు మడుగును జేరి, ప్రచండప్రళయ భీకరమై కన్నులు మిరుమిట్లు గొల్పు సుదర్శన చక్రమును విడిచెను. ఆది మొసలి దాపునకు జేరి తటాలున దాని శిరస్సును ద్రుంచి సంహరించెను. అప్పుడు...
మకరమొకటి రవిజొచ్చెను
మకరము మరియొకటి ధనదు మాటున దాగెన్
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్

ఒక మకరము మకరరాశిని ప్రవేశించెను, మరియొకటి కుబేరుని జేరెను, మిగిలిన మకరములన్నియు ఆదికూర్మమును జేరి దాగుకొనెను. (ఇక్కడ అతిశయోక్తి అలంకారము ఉపయోగింబడినది. జలచర, మకరములన్నియు భీతినందినవి అని యర్ధము.) మొసలిబారినుండి రక్షింపబడిన గజేంద్రుడు అలసటతీర్చుకొనుటకై మిక్కిలి సంతోషాతిశయంబున వీనులవిందుగా ఘీంకారము జేసెను.

కరమున మెల్లన నివురుచు
గర మనురాగమున మెరసి కలయంబడుచున్
గరి హరికతమున బ్రదుకుచు
గరపీడనమాచరించె గరిణులు మరలన్

శ్రీహరి దయతో గజేంద్రుడు బ్రతికి బయటకు రాగా, ఆడ ఏనుగులన్నియు మహదానందముతో మమతానురాగములతో ఒకరి తొండములనొకరు పెనవేసుకున్నాయి.

తనతో వెంబడించి వచ్చిన లక్ష్మీదేవిని జూచి, జగత్ప్రభువైన శ్రీహరి యిట్లనెను

బాలా నావెనువెంటను
హేలన్వినువీధినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబు బట్టుట
కాలోనేమంటి నన్ను నంభోజముఖీ !

(నీచేలాంచలంబుబట్టుటకు ఆలోన్ ఏమంటివి)

ఓలక్ష్మీదేవీ! నీపైటకొంగుముడి విడదీయక గజేంద్రుని కాపాడాలనే సంరంభమున నిన్నుగూడ యీడ్చుకొనిపోయినందుకు నీవేమనుకొంటివి? సర్వదా నన్ను భజించువారి ఆపదలను నేను బాపాదును. అని పలికిన

దేవా! దేవరయడుగులు
భావంబున నిలిపికొల్చు పని నాపనిగా
కో వల్లభ! యేమని యేమనియెద
నీవెంటనే వచ్చుచుంటి నిఖిలాధిపతీ !

ఓ జగన్నాయకా! మీపాదసేవయే నాపరమావిధి. నాకు వేరొందు బనిలేదు. కావున మిమ్ములను వెంబడించితినేగాని మరే తలంపులేదు.

దీనులకుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవన బొందన్
దీనావన నీకొప్పును
దీన పరాధీన దేవదేవ మహేశా !

నిన్ను కొల్చినవారిని కొంగుబంగారమై కాపాడు దేవదేవా! మహేశా! ఆపన్నుల దీనాలాపములను విని రక్షించే రక్షకుడవు. భక్తులచే దీనులచే మిక్కిలిగా బొగడబడినవాడవు. నాకు నీవేదిక్కు అని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని గొనియాడెను.

ఆపిమ్మట సాదరసరస సల్లాప మందహాస పూర్వకముగా లక్ష్మీదేవిని ఆలింగనంబు గావించి సపరివారుండై గరుదారూఢుండగుచు శ్రీహరి నిజసదనంబునకుం జనియె.

ఫలశృతి

గజరాజమోక్షంబును
నిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్
గజరాజవరదుడిచ్చును
గజతురగస్యందనములు గైవల్యంబున్

ఈగజేంద్రమోక్షమును భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో పఠించువారికి ఆశ్రీమన్నారాయణుడు ఏనుగులు, అశ్వములు, మొదలుగాగల అష్టైశ్వర్యములను, ఇహలోక, పరలోక, మొక్షమును సిద్ధింపజేయును.

7 వినదగు నెవ్వరు చెప్పిన..:

Zilebi said...

చాలా మంచి విషయాన్ని తెలిపిరాండీ

యేమనియెద మీ బ్లాగ్వెంట
నే వచ్చుచుంటి బ్లాగ్గాయత్రీ !!

(followers)

నెనర్లు
జిలేబి.

anrd said...

చక్కటి పోస్ట్ ను అందించినందుకు కృతజ్ఞతలండి.

Sunita.R said...

గజేంద్ర మోక్షాన్ని చక్కగా వర్ణించారు... ధన్యవాదాలు....

భారతి said...

మీదైన శైలిలో గజేంద్రమోక్షాన్ని చక్కగా సరళంగా విశీదకరించారు. ధన్యవాదాలండి.

gopi said...

gayathri garu chala chakkaga vivarincharu, inka meeru raghavendra swamy ni gurinichi kuda chepite chala baguntundi ani asistunnanu Gopi krishna From Nellore

గాయత్రి said...

అందరికి ధన్యవాదములు.....గోపి గారు, రాఘవేంద్రస్వామి గురించిన అంశాలను త్వరలోనే అందించగలను...

rajachandra said...

చాల చాల బాగుంది అండి.. నేను ఇంతకాలం మీ బ్లాగు ని చూడటం మిస్ అయ్యాను..