Wednesday, July 13

గురుపౌర్ణమి (july 15th)

ఓం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరంబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః

గురవే సర్వలోకానాం, భిషజే భవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః

మన సనాతన సంప్రదాయంలో గురువుకి అగ్రపీఠం ఉంది. తల్లి, తండ్రి తరువాత గురువే మార్గదర్శకుడు. ఆషాడశుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. అమ్మ తన బిడ్డలను ఎంత ప్రేమగా ప్రాణంతో సమానంగా చూసుకొంటుందో, గురువు కూడా ఒక తల్లి వలె తన శిష్యులను దరిచేర్చుకొంటాడు. ఆ బ్రహ్మ రాసిన రాతను గురువు తప్పించగలడు. అంటే మనకేదో పెద్ద ప్రమాదం సంభవించాలని రాసి ఉంటే, ఆ రోజు మనకు ఒక దెబ్బ తగిలి ఆ ప్రమాద బారి నుండి గురుదేవులు మనలను రక్షిస్తాడు. దైవం శపించినా గురుదేవులు అభయం ఇచ్చి రక్షిస్తాడు, కాని గురువుకే ఆగ్రహం కలిగితే, ఆపటం ఎవరితరము కాదు.
దక్షిణామూర్తి, వ్యాసభగవానుడు, దత్తాత్రేయులు, జగద్గురు ఆదిశంకరాచార్య ఇలా ఎందరో మహనీయులను గురువులుగా ఎంచుకొని సన్మార్గంలో చాలమంది పయనిస్తు వస్తున్నారు. అష్టాదశపురాణములను, మహాభారతం వంటి గ్రంధాల ద్వార మానవాళికి నైతికి విలువలను తెలియచెప్పిన వ్యాసభగవానుడి పేరిట గురుపూర్ణిమ ను జరుపుకోవడం విశేషం.

గురువులు అనుకొన్నవారిని, సన్యాసాశ్రమం స్వీకరించిన వారిని, గురుపౌర్ణిమనాడు ఎవరిని, ఎలా పూజించాలో వ్యాసభగవానుడు వివరించి చెప్పిన ఒక కధా సందర్భం బ్రహ్మాండపురాణంలో ఉంది. ఆ కధ, వే
నిధి అనే ఒక పండితుడు పితృకార్యం సందర్భముగా వ్యాసభగవానుడిని పిలిచి, అతిధి పూజలు చేసి, భోజనాది కార్యక్రమాలొనర్చి గురుకృపకు పాతృడైనాడు. మళ్ళీ గురుసేవ చేసుకొనే అవకాశం ఎలా వస్తుంది అని వ్యాసుడిని అడుగగా, "లోకములోని పౌరాణికులంతా తన అంగస్వరూపులే అని, వారిని పూజిస్తే తనను పూజించినట్లే" అని సెలవిచ్చాడు. ఇందులో అంతరార్ధం ఏంటి అంటే, పురాణాలలోని విషయాలను లోకమునకు అందించేవారంతా తన స్వరూపమే అని గురుభావన.
గురువును, దేవుడిని చుపించి ఎవరికి నమస్కరిస్తావు అంటే గురువుకే అని భక్త కబీర్ దాస్ చెప్తాడు. ఎందుకంటే భగవంతుడిని చేరే మార్గం చూపింది గురువు. ఈరోజు నుండే చాతుర్మాశం ప్రారంభం అవుతుంది.

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమోనమః

నారాయణుడు, అతని నాభి కమలం నుండి జనించినవాడు బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు వసిష్ఠుడు, వసిష్ఠుడి సంతానం శక్తిమహర్షి, అతని పుత్రుడు పరాశరుడు, అతని కుమారుడు వ్యాసుడు, వ్యాసుని కుమారుడు శుకుడు, ఇది ఆర్ష గురుపరంపర. వీరిలో వ్యాసుడు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు స్వరూపుడు. అటువంటి వ్యాసభగవానునికి నమస్కారము.

ఓం శ్రీసద్గురు పరబ్రహ్మణేనమః

0 వినదగు నెవ్వరు చెప్పిన..: